Advertisement

Advertisement


Home > Articles - Chanakya

ఒక్క చౌదరి కోసం....

ఒక్క చౌదరి కోసం....

చంద్రబాబు కార్పొరేట్ సహచరుల కోరికలకు బందీ అయిపోయారా?  తెలిసి తెలిసి తప్పు చేయక తప్పని సరి పరిస్థితులు ఏర్పడ్డాయా? కొడుకుతో, తనతో అనేకానేక బంధాలు పెనవేసుకున్న సుజన చౌదరి కోసం మిగిలిన వన్నీ పక్కన పెట్టేయాల్సి వచ్చిందా? పైకి ఎవరూ ఏమీ మాట్లాడకపోయినా, దేశం జనాలు లోలోపల ఇదే చర్చించుకుంటున్నట్లు వార్తలు వినవస్తున్నాయి.

మోడీ తొలి మంత్రి వర్గంలో ఒక్క స్థానం వచ్చింది. దాన్ని ఉత్తరాంధ్రకు, క్షత్రియ కులానికి కేటాయించారు. అందులో సబబే వుంది. ఎందుకంటే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర బాబుకు దన్నుగా నిలబడింది. అదీకాక, తొలిసారి రాష్ట్రం అంతటా క్షత్రియులు ఏక తాటిపైకి వచ్చి బాబుకు అండగా నిల్చున్నారు. అది జగమెరిగిన సత్యం. అందువల్ల వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అయింది.

సరే బాగానే వుంది. మరి ఇన్నాళ్లుకు రెండో చాన్స్ వచ్చింది. ఇక్కడ బాబు ముందు కీలకమైన రెండు ప్రాధామ్యాలున్నాయి. ఒకటి రాయలసీమ..రెండు తెలంగాణ. ఆంధ్రలో పార్టీని చూసుకుంటే ఒకటి ఇటు కేటాయించారు కాబట్టి రెండవది అటు ఇవ్వాల్సి వుంది. లేదా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని, తెలంగాణ అంటే తనకు చిన్న చూపు లేదని నిరూపించుకోవడానికి అక్కడకు ఆ పదవి కేటాయించాల్సి వుంది. కానీ బాబు ఈ రెండింటినీ గాలికి వదిలేసారు. అదే విధంగా మొదటి పదివి ఓసి కి ఇచ్చారు .రెండవది బిసిలకో, ఎస్ సి లకో, ఎస్టీలకో ఇవ్వాల్సి వుంది. అదీ విస్మరించారు. కనీసం మహిళలకు..అదీ లేదన్నారు.  ఇంకా చిత్రమేమిటంటే బాబు కోటాలో కాకున్నా, ఆంధ్ర నుంచి ఇప్పటికే ఓ కమ్మ వర్గానికి కేంద్ర మంత్రి పదవి వుండనే వుంది.

ఇదంతా బాబుకు తెలియక కాదు. సుజన చౌదరికి ఇచ్చి తీరాలి. వారి మధ్య వున్న అనేకనేక లావాదేవీలు అలాంటివి. బాబు పదేళ్లు అధికారంలో లేనపుడు పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసింది సుజనానే. ఎక్కడ సమావేశాలు జరిగినా, వాటి ఏర్పాట్లు, వాటికి కావాల్సిన ఆర్థిక అండదండలు, అన్నీ సుజనానే. ఇప్పుడు కూడా అటు చంద్రబాబు ఇటు లోకేష్ మధ్యలో సుజన. ఆయన లేకుండా, తెలియకుండా, ప్రమేయం రాకుండా నిర్ణయం వుండదు..పనులు జరగవు.

అందుకే సామాజిక, ప్రాంతీయ ఈక్వేషన్లు అన్నీ పక్కన పెట్టి మరీ బాబు సుజనాకు తలపాగా పెట్టారు. పోనీ ఇప్పుడు కాకుంటే ఏడాది తరువాతయినా మరో అవకాశం వస్తుందని బిసిలో, రాయలసీమ వాసులో ఆశ పడకుండా ముందే చెప్పేసారు. ఈ సారి మరో పదవి వస్తే, అది తెలంగాణ వారికి ఇస్తామని. అంటే ఆ మిగిలిన ఆశలు కూడా రాయలసీమ వాసులకు అడుగంటిపోయినట్లే.

ఇదే పరిస్థితి కాంగ్రెస్ లోనో, వైకాపాలోనో సంభవిస్తే, ఈ పాటికి ‘పచ్చ’పాత పత్రికలు..పార్టీలో ముసలం..అలకలు,.సీమను నిర్లక్ష్యం చేసిన ఫలితం..తెలంగాణను విస్మరించిన వ్యవహారం..ఇంకేమీలేదు పుట్టి మునికిపోయినట్లు కథనాలు వండి మొదటిపేజీలో వడ్డించేవి. ఇప్పుడు ముందుగా అవసరమైతే రాజధాని వ్యవహారం మాదిరిగా దానికి రివర్స్ కథనాలు వండి వార్చేందుకు రెడీగా వుంటాయి. పదేళ్లు నిరుపానంగా, నిస్వార్థంగా, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన, ఆర్థికంగా బోలెడు నష్టపొయిన వ్యక్తికి పెద్ద పీట వేయడం ద్వారా పార్టీ తనను నమ్ముకున్నవారిని ఆదుకుంటుందన్న సంప్రదాయాన్ని బాబు నిలబెట్టారు అంటూ కథనాలు వస్తాయి.

నాలుగేళ్ల దాకా ఇలాగే..

మళ్లీ ఎన్నికల అవసరం కలిగే వరకు బాబు ఇలా డెలిబిరేట్ గా నిర్ణయాలు తీసుకుంటూనే వుంటారు. రాయలసీమ వాసులకు రకరకాల కబుర్లు చెబుతూనే వుంటారు. దగ్గరకు వచ్చాక మళ్లీ తాయిలాలు బయటకు తీస్తారు.

చాణక్య

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?