Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : 2019లో టిడిపి గెలుస్తుందనకూడదా? -2/2

ఎమ్బీయస్‌ : 2019లో టిడిపి గెలుస్తుందనకూడదా? -2/2

మోదీ దేశాన్ని గొప్పగా నడిపించేస్తాడని నేను అనుకోలేదు. నేను అనుకోకపోవడం చాలామందికి నచ్చలేదు. వారిలో కొంతమందికి తత్త్వం బోధపడింది. మరి కొంతమందికి ఆశలు చావలేదు. ఎవరి అనుభవాలు వారివి. యుపిఏ అంత అధ్వాన్నం కాకపోయినా మోదీ పాలన బాగాలేదని నా అభిప్రాయం. కానీ ప్రత్యామ్నాయం లేదు కాబట్టి మోదీ యింకో రెండు టెర్మ్‌లు, కనీసం ఒక టెర్మ్‌ కొనసాగుతాడనే అవగాహన నాకుంది. అది రాయడానికి జంకను. అంతమాత్రం చేత నేను మోదీ చర్యలను సమర్థిస్తున్నా ననుకోకూడదు. క్షేత్రవాస్తవాన్ని వాస్తవంగా గుర్తించకుండా 'మోదీని ఓడించండి' అని యావద్భారత ప్రజలకు నా కాలమ్‌ ద్వారా పిలుపు నిచ్చి భుజాలు చరుచుకోవడం అవివేకం. లేని బావ కంటె గూనిబావ మేలన్నారు. ఉన్న గూనిబావ తన గూనిని సవరించుకుంటాడనో, కనీసం కవర్‌ చేసుకుంటాడనో కోరుకోవడం తప్పు కాదు. మోదీ పాలన ఎలాగూ తప్పదు కాబట్టి అదేదో కాస్త మెరుగ్గా వుంటే బాగుండునని చిన్ని ఆశ. కెసియార్‌ విషయానికి వస్తే అతని వాగ్దానాలకు, వాటి అమలుకు హస్తిమశకాంతరం వుంది. అన్నీ అమరి వున్నాయి కాబట్టి ఏదోలా బండి లాగిస్తున్నారు. నగరం పరిస్థితి మెరుగు పడలేదు. గ్రామాల్లో ఎలా వుందో తెలియదు. మిషన్‌ భగీరథ మరో జలయజ్ఞమో, కాదో కొన్నాళ్లకు తెలుస్తుంది. అయినా యింకో టెర్మ్‌ నెగ్గడం ఖాయమనిపిస్తోందని రాస్తే అతని అప్రజాస్వామిక చర్యలను సమర్థించినట్లు కాదు. 

ఎన్నికలు యింకో రెండేళ్లల్లో వస్తున్నాయంటే యీ పాటికి ఎన్ని సన్నాహాలు జరిగి వుండాలి! చివరకు ఎన్నికల టైముకి ఏదో ఒక పార్టీకి పక్కవాయిద్యంగా తేలతాడనుకుంటున్నాను తప్ప ప్రధాన భూమిక వహించి, ప్రజానాయకుడిగా వస్తాడనుకోవడం లేదు. మరి ఏ పార్టీకి కాల్‌షీట్‌ యిస్తాడన్నది యిప్పుడే చెప్పలేం. అయితే బిజెపికో లేక టిడిపికో తప్ప వైసిపికి అయితే కాదు కదా! పవన్‌ మద్దతు యిచ్చినా బిజెపి 2019లో ఆంధ్ర గెలిచేస్తుందా? ఓ పాఠకుడు రాశాడు - 2014కు ముందు యుపిలో బిజెపికి వున్న బలమెంత? అయినా మోదీ 80లో 75 సీట్లు గెలవలేదా? అని. యుపిలో బిజెపికి ఎప్పుడూ కొన్ని ఓట్లు స్థిరంగా వున్నాయి. పైగా మోదీ తరహా నాయకుడు ఆంధ్ర బిజెపికి వున్నాడా? ఉన్నవాళ్లల్లో చాలామంది బిజెపి మౌలిక సిద్ధాంతాలేమిటో తెలియని ఫిరాయింపుదారులే. పైగా ఆంధ్ర బిజెపి టిడిపి సమర్థకులు-వ్యతిరేకులుగా చీలిపోయి వుంది. అమిత్‌ షా దీనిపై దృష్టి పెట్టాలి, పార్టీ నిర్మించాలి, యివన్నీ ఎప్పటి కవుతాయో తెలియదు. అందుకని ప్రతిపక్షం అంటే వైసిపి ఒక్కటే కనబడుతోంది. దాని పరిస్థితి ఏమిటి?

జగన్‌ తన ఎమ్మెల్యేలను పోగొట్టుకుంటున్నాడు అని రాస్తే అధికార పార్టీ ఒత్తిళ్లు అలా వున్నాయి మరి.. అంటున్నారు కొందరు. బాబు పదేళ్లు ప్రతిపక్షంలో వున్నారు. ఈ స్థాయిలో ఎమ్మెల్యేలను పోగొట్టుకున్నారా? ఎన్నో రాష్ట్రాలలో పార్టీలు దశాబ్దాల తరబడి అధికారంలో లేకపోయినా నాయకులను తమతో వుంచుకోగలుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలోనే ప్రతిపక్షాలు చతికిల పడుతున్నాయి. ఎందువలన? ఇవి మళ్లీ అధికారంలోకి రావు అని ఆ పార్టీల ఎమ్మెల్యేలు అనుకోవడం చేతనే! వాళ్లకీ గ్రౌండ్‌ రిపోర్టులు వుంటాయి కదా! ఫిరాయింపుల తర్వాత వాళ్ల యిళ్ల ముందు ప్రజలు ప్రదర్శనలు చేయడం లేదు కదా! మంత్రులుగా మారి వస్తే దండలు వేయడం మానటం లేదు కదా! పార్టీలు మారేవారికి 2019లో ప్రజలు బుద్ధి చెప్తారు అనుకుని మధ్యతరగతి మేధావులు తమకి తామే నచ్చచెప్పుకుంటూ కూర్చోవాలి తప్ప అప్పటికి చమత్కారాలు ఏమీ జరగవు. దేశమంతా ఫిరాయింపులే. అధికారపక్షాలు నిస్సిగ్గుగా స్పీకరు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యంతో ఆడుకుంటున్నాయి. ప్రజల్లో చైతన్యం ఏమైనా కనబడుతోందా? వాళ్లకి తీరిక ఎక్కడ? ఏ ఎటిఎంలో క్యాష్‌ వస్తోందోని పరుగులు పెట్టడంతోనే సరిపోతోంది.

ఏది ఏమైనా ఫిరాయింపుదారు ఫిరాయింపుదారే. ఎన్నికల ముందు కొందరు గోడ దూకితే, తర్వాత కొందరు దూకారు. దూకుతూ దూకుతూ పాత నాయకుడి మీద రాళ్లు రువ్విపోతారు. జగన్‌ నియంత అని, ప్రతిభ వున్నవాళ్లను సహించలేడని, మంచీమర్యాద తెలియనివాడని ఏవేవో అనేసి పోతున్నారు. అవన్నీ నమ్మనక్కరలేదు అనుకున్నా జగన్‌ పార్టీలోంచి  మైసూరా రెడ్డి వంటి చాలామంది మంచి వక్తలు, ప్రతిభావంతులు వెళ్లిపోయారన్న మాట వాస్తవం. తెలంగాణలో అయితే మరీనూ. జగన్‌ వ్యవహారశైలి ఎటువంటిదో మనకైతే తెలియదు. కానీ యీ స్థాయిలో అనుచరులను పోగొట్టుకోవడం ఉత్తమ నాయకత్వ లక్షణమైతే కాదు. చంద్రబాబు పాలన పట్ల ప్రజల్లో ఆగ్రహం ఎంత వుందో తెలియదు కానీ అసహనం, అసంతృప్తి అయితే ధారాళంగా వుంది. దాన్ని ఛానెలైజ్‌ చేసే వ్యూహం వైసిపి వద్ద లేదు. ఎంతసేపూ ''సాక్షి'' పత్రికలో, టీవీలో చెప్పుకుంటే సరిపోయిందా? ప్రజలు ఓ పట్టాన తిరగబడరు. సహిస్తూనే పోతూ వుంటారు. వారిలో చైతన్యం రగిలించాలంటే ప్రజాసంఘాలను కూడగట్టుకోవాలి, ప్రజావేదికలను ఏర్పరచాలి. సదస్సులు పెట్టి, సమావేశాలు పెట్టి జరుగుతున్నదానిపై ప్రజలకు అవగాహన ఏర్పరచాలి. ఊరూరా నాయకులు తయారుచేయాలి. బాబు వంటి మీడియా మేనేజర్‌ను తట్టుకోవడానికి యిప్పుడు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం చాలవు.

ప్రజలకు కావలసినది తమ సమస్యలు తీరడం, వచ్చేసారి తమరు ముఖ్యమంత్రి అవుతారా లేదా అన్నది కాదు. అది గ్రహించాలి. 'ఆ ఒక్కటీ అడక్కు'లో రాజేంద్రప్రసాద్‌లా 'ఆఫ్టర్‌ టూ ఇయర్స్‌, ఐ యామ్‌ ద సిఎం' అని చెప్పుకుంటే ఎబ్బెట్టుగా వుంటుందని తోచదా? కావాలంటే అలాటివి పార్టీ సమావేశంలో కార్యకర్తలను ఉత్సాహపరచడానికి చెప్పుకోవచ్చు. ప్రజల మధ్య, అధికారుల ముందు ఎందుకు? ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిపక్ష నాయకుడిలో ఎన్నో లోటుపాట్లు కనబడుతున్నాయి. అతన్ని సవరించే పార్టీ ప్రిసీడియం వంటి వ్యవస్థ ఏమీ లేదు. తక్కిన ప్రాంతీయ పార్టీలలాగానే అక్కడా అధినాయకుడి మాటే వేదం. అతనే కేంద్రబిందువు. ఎవరూ కిక్కురుమనడానికి లేదు. పొగడగలిగినంత కాలం పొగడడం, తేడా వస్తే బయటకు నడవడం. ఇలాటి పరిస్థితుల్లో టిడిపి మళ్లీ గెలుస్తుందని అనుకోవడంలో తప్పు లేదని నా భావన. ఎన్నికలు వచ్చేలోగా మార్పులు వస్తే రావచ్చు. వస్తే అప్పుడే మాట్లాడుకోవచ్చు. ఈ లోపున చర్చలు అనవసరమనుకుంటాను. 

ఎమ్బీయస్‌ : 2019లో టిడిపి గెలుస్తుందనకూడదా?-1/2

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?