Advertisement

Advertisement


Home > Articles - MBS

కశ్మీరీ పండితులు వెనక్కి వెళతారా?

కశ్మీర్‌ నుంచి బయటకు తరమబడిన పండితులు తిరిగి కశ్మీర్‌ చేరాలని అందరూ కోరుకుంటారు. హిందువులు మరింతగా కోరుకుంటారు. హిందువులు అత్యధికంగా వున్న భారతదేశంలోనే హిందువులు స్వరాష్ట్రం వదలి వేరే రాష్ట్రాలలో కాందిశీకులుగా బతకడం జీర్ణించుకోలేని విషయం. మోదీ ప్రభుత్వం దీనికి చాలా ప్రాధాన్యత యిస్తోంది. పండితుల పునరావాసానికి బజెట్‌లో రూ. 500 కోట్లు కేటాయించడమే కాకుండా, రాష్ట్రపతి చేత తన ప్రసంగంలో 'కశ్మీరీ పండితులను గౌరవంగా, సురక్షితంగా, ఉపాధి అవకాశాలతో సహా తమ పూర్వీకుల భూమికి పంపడం యీ ప్రభుత్వం ధ్యేయం' అని చెప్పించారు. అదే జరిగితే హిందువులలో బిజెపి ప్రభుత్వం ప్రతిష్ట యినుమడిస్తుంది. అయితే అది సాధ్యమేనా?

800 సం||రాల క్రితం కశ్మీర్‌లో హిందూమతమే వుండేది. ఇస్లాం ప్రబోధకులు అక్కడకు వెళ్లి ప్రచారం చేసినపుడు కశ్మీరీ బ్రాహ్మణులైన పండితుల్లో కొందరు ఇస్లాం తీసుకున్నారు. అలా మతం మార్చుకున్నవారిలో కొందరు యిప్పటికీ తమ యింటిపేర్లను యథాతథంగా వుంచుకోవడం కనబడుతుంది. (ఉదా- మక్బూల్‌ భట్‌) మతం మారినవారు, మారనివారు అందరూ పక్కపక్కనే వుంటూ సఖ్యంగానే వుండేవారు. అయితే 1989, 90 ప్రాంతాల్లో ఇస్లామిక్‌ టెర్రరిజం ప్రారంభమైన తర్వాత పండితులపై దాడులు ప్రారంభం కావడంతో వారు కశ్మీర్‌ విడిచి పారిపోయారు. అప్పటి దాడుల్లో 219 మంది పండితులు చంపబడ్డారని అంటారు. మిమ్మల్నీ చంపుతామని లేఖలు అందడంతో 60,452 కుటుంబాలు కశ్మీర్‌ లోయ విడిచి జమ్మూ, ఢిల్లీ వంటి ప్రదేశాలకు పారిపోయి అక్కడ ఉపాధి అవకాశాలు వెతుక్కున్నారు. కశ్మీర్‌ పాలకులకు యిది అవమానకరమైన ఒక మచ్చగా మిగిలిపోయింది. ప్రతి కశ్మీరు నాయకుడు పండితులను వెనక్కి తీసుకుని వచ్చే పరిస్థితులు కల్పిస్తాం అని వాగ్దానాలు చేస్తూ వుంటారు. పండితులను ఆదుకోవడానికి కేంద్రప్రభుత్వం వారిని నమోదు చేసుకోమంది. ఆ లెక్కల ప్రకారం 38,119 కుటుంబాలు జమ్మూలో, 19,338 కుటుంబాలు ఢిల్లీలో తలదాచుకున్నాయి. వారిలో ఆర్థిక పరిస్థితి బాగాలేని వారికి కేంద్రం వారికి నెలకు తలా రూ.1650 (కుటుంబానికి రూ. 6,600 పరిమితి వుంది), తలా 9 కిలోల బియ్యం, 2 కిలోల గోధుమలు, కుటుంబానికి కిలో పంచదార యిస్తోంది. ఇలాటి సహాయం అందుకునే కుటుంబాలు జమ్మూలో 17248, ఢిల్లీలో 3385 వున్నాయి. 2004లో ప్రధానమంత్రి పునరావాస పథకం కింద వారికి జమ్మూలో 5242 టూ బెడ్‌రూమ్‌ నివాసాలు కట్టారు. 

ఎంతైనా యిది తాత్కాలికమే కాబట్టి వారిని కశ్మీర్‌ తిరిగి వెళ్లేట్లా పురికొల్పడానికి 2008 లో యుపిఏ ప్రభుత్వం రూ. 1618 కోట్లతో ప్యాకేజీ ప్రకటించి జమ్మూ, కశ్మీర్‌ ప్రభుత్వం ద్వారా అమలు చేయించబోయింది. కశ్మీర్‌ వెళ్లిన పండితులు కొత్త యిల్లు కట్టుకోవడానికి  లేదా పాత యిల్లు బాగుచేయించుకోవడానికి రూ. 20 లక్షలు యిస్తామని చెప్పారు. అయితే కశ్మీర్‌లో శాంతిభద్రతలు బాగు పడలేదు కాబట్టి, టెర్రరిజం బెడద వదలలేదు కాబట్టి యిప్పటిదాకా ఒకే ఒక్క కుటుంబం తిరిగి వెళ్లింది. 1474 మంది యువకులు మాత్రం తిరిగి వెళితే వాళ్లకు రాష్ట్రప్రభుత్వంలో ఉద్యోగాలు యిచ్చారు, వారికై కొత్తగా కట్టిన 1010 ట్రాన్సిట్‌ ఫ్లాట్లలో బస యిచ్చారు. ఇప్పుడు ఎన్‌డిఏ ప్రభుత్వం యిస్తున్న ప్రోత్సాహకాలతో తిరిగి వెళతారా అని జర్నలిస్టులు పండిత కుటుంబాలను పలకరించాయి. 

ముసలివాళ్లలో కొంతమంది వెనక్కి వెళతాం కానీ మాకై విడిగా కాలనీలు కడితే వెళ్లం. ఏదైనా అల్లర్లు జరిగితే ఆ కాలనీలనే టార్గెట్‌ చేస్తారు, దానికి బదులు ముస్లిములకు, మాకు పక్కపక్క యిళ్లు వుండే కాలనీలైతే మెరుగు అన్నారు. '15-20 శాతం మంది పండిత కుటుంబాలు వెనక్కి వెళ్లడానికి సిద్ధంగా వున్నాయని అంటున్నారు. వాళ్లు వెళ్లాక వాళ్ల పరిస్థితి ఎలా వుందో, బతికి బాగున్నారో లేదో చూసి అప్పుడు తేల్చుకుంటాం' అంటున్నారు. పిల్లలలో (20-45 ఏళ్ల వయసులో వున్నవారు) మాత్రం తిరిగి వెళ్లనక్కరలేదన్న ఏకాభిప్రాయం కనబడుతోంది. వాళ్లు 25 సంవత్సరాల క్రితమే బయటకు వచ్చేశారు. విద్యార్థులుగా వున్నవాళ్లు కాందిశీకుల హోదాలో మంచి మంచి కాలేజీల్లో రిజర్వేషన్‌ సౌకర్యంతో సీట్లు పొందారు, చక్కగా చదువుకుని ఉన్నతోద్యోగాలు పొందారు. అప్పటికే యువకులుగా వున్నవారు అప్పుడే చోటు చేసుకున్న గ్లోబలైజేషన్‌ ధర్మమాని ఉద్యోగాలు పొంది యిప్పుడు పెద్ద పెద్ద హోదాల్లో వున్నారు. ఇప్పుడు వెనక్కి వెళితే అక్కడేముంది? అంటున్నారు వాళ్లు. ''ఒక అంచనా ప్రకారం 230 మంది కశ్మీరీ పండితులు వివిధ సంస్థల్లో సిఇఓ స్థాయిలో వున్నారట. మా సంఖ్య అత్యల్పమైనా యింత సాధించామంటే దాని అర్థం - వాళ్లు తరిమివేయడం మాకు లాభించిందన్నమాట. నేను ఒక యిన్సూరెన్సు కంపెనీలో ఏటా రూ. 35 లక్షల జీతం సంపాదిస్తున్నాను. అక్కడికి వెళితే యింత జీతం ఎవడిస్తాడు? కశ్మీర్‌లో టాటాలు, బిర్లాలు లేరు, పెద్ద పరిశ్రమా లేదు. ప్రశాంతంగా బతికే అవకాశమూ లేదు. రిటైరైనవాళ్లకు తప్ప మా ఎవరికీ అక్కడకి వెళ్లి ఉద్ధరించాలని లేదు. అంతగా అనిపిస్తే టూరిస్టులా వెళ్లి వారం రోజుల్లో తిరిగి వస్తాం.'' అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో పండితుల పునరావాసం ఎలా పరిణమిస్తుందో, మోదీ ప్రభుత్వం ఆశయం సిద్ధిస్తుందో లేదో తెలియకుండా వుంది. 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?