అమెరికాలోని కాన్సస్ రాష్ట్రంలో ఒక జాత్యహంకారి చేతిలో కాల్పులకు గురై కూచిభొట్ల శ్రీనివాస్ అనే ప్రతిభావంతుడైన తెలుగు యువకుడు నేల కొరగడం అత్యంత విషాదకరం. జాత్యహంకారంతో దాడులు జరగడం అమెరికాకు కొత్త కాదు. నల్లజాతివారిపై దాడులు జరిగినపుడు విని వూరుకుంటాం. బ్రౌన్స్, అనగా మనపై జరిగినపుడు ఉలిక్కిపడి, చర్చలు జరుపుతుంటాం. కానీ ఈ సారి చాలా పెద్ద ఎత్తున రోజుల తరబడి జరుగుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ అధ్యక్షుడుగా వచ్చాడు కాబట్టి యిలాటివి మరిన్ని జరుగుతాయనే భయం!
ట్రంప్ కారణంగానే అక్కడి వాతావరణం కలుషితం అయిపోయిందని, యిప్పటిదాకా అవకాశాలు వెతికేవారికి భూతలస్వర్గంగా వున్న అమెరికా యిప్పుడు భూతాలకే స్వర్గంగా. తక్కినవారికి నరకంగా మారిందని, ప్రాణం మీద ఆశ వుంటే అక్కడకి వెళ్లడం మంచిది కాదని మీడియా హోరెత్తించేస్తోంది. ఇది చూసి అమెరికాలో పిల్లలున్న తలిదండ్రులు బెంబేలెత్తున్నారు. బతికుంటే బలుసాకు తినవచ్చు, వెనక్కి వచ్చేయమని పిల్లల్ని బతిమాలుతున్నారు. ఇదంతా అక్కడున్న మనవాళ్లకు చికాకు వ్యవహారంగా తయారైంది. గోరంత దాన్ని మీడియా కొండంతలు చేస్తోందని టీవీలలో కనబడి చెప్తున్నారు, మీడియాలో వ్యాసాలు రాస్తున్నారు.
అక్రమవాసులనుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయవలసింది. చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు అనే మాట కూడా కరక్టు కాదు, అక్రమవాసులను కాల్చి చంపమని ఏ చట్టమూ చెప్పలేదు. అతను తాగుబోతు, ఫ్రస్ట్రేషన్లో వుండి వుంటాడు. తుపాకీలు ఆటవస్తువుల్లా లభ్యమవుతాయి కాబట్టి కోపోద్రేకంలో ప్రాణాలు తీశాడు. అలాటి ఉన్మాదులు ఏ దేశంలోనైనా తక్కువ సంఖ్యలోనే వుంటారు. కాల్చడానికి వాళ్లకి ఏ కారణమూ అక్కరలేదు. 'నీ మొహం నాకు నచ్చలేదు' అని కూడా అనవచ్చు. అమెరికాలో నిత్యం జరిగే హింసాత్మక సంఘటనల్లో దాడి చేసినవాడు, బాధితుడు యిద్దరూ శ్వేతజాతి అమెరికన్లు అయిన సందర్భాలే ఎక్కువ శాతం అయి వుంటాయి. మన ఈ హత్యపై జరిగిన చర్చల్లో చాలామంది ప్రభుత్వం మన వాళ్ల తరఫున అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి రక్షణ కల్పించాలని సూచించారు. మాట్లాడితే ఏమంటారు? 'మీవాళ్లు అప్పుడప్పుడు పోతున్నారు. మా వాళ్లు నిత్యం ఛస్తున్నారు. మా తుపాకీ కల్చర్ అలాటిది.' అని జవాబిస్తారేమో! నిజానికి శ్రీనివాస్ హత్యను ట్రంప్ కాంగ్రెస్ సాక్షిగా ఖండించిన మూడు రోజుల్లోనే సౌత్ కరోలినాలో ఓ గుజరాతీ కాల్పులకు గురయ్యాడు.
ఇప్పుడీ పూరింగ్టన్ అక్రమ వలసదారుల ప్రస్తావన తెచ్చాడు కాబట్టి చర్చ ట్రంప్ విధానాలపై మళ్లింది. నిజానికి అక్రమ వలసదారులను ప్రతి అమెరికా అధ్యక్షుడు బయటకు పంపిస్తూనే వున్నారని గణాంకాలు చెపుతున్నాయి. (బిల్ క్లింటన్ (1993-2000) 9 లక్షలు, బుష్ (2001-08) 20 లక్షలు, ఒబామా (2009-16) 31 లక్షలు ) ఇంతమందిని పంపినా, ప్రస్తుతం కోటీ పదిలక్షల మంది ఉన్నారంటే దాని అర్థం ఏమిటని? పంపినవాళ్లు మళ్లీ వచ్చేస్తున్నారనా? కొత్తగా వస్తున్నారనా? ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో చేసిన దేమిటంటే యీ అక్రమ వలసలకు, స్థానికుల నిరుద్యోగానికి, అమెరికాలో పెరుగుతున్న క్రైమ్ రేటుకు ముడిపెట్టడం. దాంతో ఇన్నాళ్లు అక్రమ వలసదారులను చూసీ చూడనట్లు వదిలేసిన అమెరికన్ సమాజం, వారిని తిట్టుకుంటూనే వారి చేత అతి తక్కువ జీతాలకు పని చేయించుకుంటూ వున్న జనం యిప్పుడు వారిని తరిమివేస్తే తప్ప దేశం బాగుపడదనే ఉద్దేశానికి వచ్చి వుండవచ్చు. సమాజంలో అందరూ యిదే భావంతో వున్నారని చెప్పలేము కానీ ట్రంప్కు ఓటేసిన వారైనా - వారి సంఖ్యా గణనీయమైనదే - అలా అనుకుంటూ వుండవచ్చు. అక్రమ వలసదారుల్లో 52% మంది మెక్సికన్లని, వ్యవసాయ కార్మికుల్లో వారి శాతం 25 అని, వాళ్లని పంపించివేస్తే పళ్లు, కూరగాయలు మార్కెట్ రావని చెప్తున్నారు. అక్రమ వలదారులు ఆర్థిక రంగానికి ఏటా 50 వేల కోట్ల డాలర్లు సమకూరుస్తున్నారని, వారిని పంపేస్తే జిడిపి 2.6% తగ్గవచ్చని అంటున్నారు. కొన్ని సంస్థలు వారిని దాచడానికి నడుం బిగించాయి కూడా.
అక్కడ 30, 40 ఏళ్లగా స్థిరనివాసం ఏర్పరచుకున్నవాళ్లు వెనక్కి రారు. ఆస్తులు, కుటుంబాలు అన్నీ అక్కడే వున్నాయి వాళ్లకి. ఎదిగిన పిల్లలుంటే వాళ్లు 'కావాలంటే మీరు వెళ్లండి, మేం యిక్కడే వుంటాం. మాకేమీ జంకు లేదు. ఇండియాలో మాత్రం మతకలహాలు, కులకలహాలు లేవా? టెర్రరిస్టు దాడులు అక్కడే ఎక్కువ కదా!' అని వాదిస్తారు. వాళ్లని వదిలి వీళ్లు రాలేరు. ఇక పదేళ్ల క్రితం వెళ్లి స్థిరపడుతున్నవారు కూడా వచ్చేస్తారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్లకు అక్కడా యిక్కడా ఆస్తులతో బాటు వాటి మీద అప్పులూ వుంటాయి. అక్కడి ఉద్యోగంలో వచ్చే ఆదాయం వెనక్కి ఇండియాకు వచ్చేస్తే యిక్కడ రాదు. అప్పు మాత్రం వెంటాడుతుంది. వచ్చేద్దామనుకుంటే అక్కడి ఇల్లూ వాకిలీ అయినకాడికి తెగనమ్ముకోవాలి. అమ్ముకుందామనుకున్నా కొనేవాళ్లు దొరకాలి. ఇన్ని తలనొప్పులు పడే బదులు కాస్త రిస్కు తీసుకునైనా వుండిపోదామనుకుంటారు.
గతంలో గల్ఫ్లో యుద్ధాలు వచ్చినపుడు మనవాళ్లందరూ బతుకుజీవుడా అంటూ మాతృదేశం వచ్చేశారు చూడండి. ఇప్పుడు అలాటి పరిస్థితి అక్కడేమీ లేదు. అమెరికాపై యుద్ధం ప్రకటించి వాళ్ల గడ్డపై బాంబులు కురిపించేటంత సాహసం యిప్పట్లో ఏ దేశానికీ లేదు. ఇక టెర్రరిస్టులు అప్పుడప్పుడు చేసే దొంగదాడులంటారా, ఆ భయం ప్రపంచంలో చాలా దేశాల్లో - ఇండియాతో సహా - ఉంది. లెక్కకు చూస్తే అమెరికాలోనే తక్కువ!
ఏది ఏమైతేనేం అక్కడి ద్వేషపూరితమైన వాతావరణం గురించి ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించిన ఆమె అక్కడ వుండడానికే నిశ్చయించుకున్నారు. అక్కడ ప్రాణాలకు ముప్పు వుండి వుంటే వుండి పోయేవారు కారు కదా అని తోస్తోంది. శ్రీనివాస్ అన్న డాలస్లో వుంటారట. ఆయన కూడా వెనక్కి వచ్చేస్తానని ఏమీ చెప్పలేదు. తల్లిదండ్రులు వెనక్కి వచ్చేయమని చెప్పి వుండవచ్చు కానీ యీయన యింకా ఏమీ నిర్ణయించుకోలేదేమో! ఇవన్నీ చూస్తే మనం మరీ గందరగోళ పడవలసిన పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇక అప్పుడప్పుడు జరిగే కొట్లాటలంటారా? మన దేశంలోనూ ఏదో ఒక రూపంలో జరుగుతూ వుంటాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారిపై ఢిల్లీలో ఆ మధ్య అనేక దాడులు జరిగాయి. పట్టుకుని చావగొట్టి వదిలిపెట్టారు. కొన్నాళ్లకు చల్లారాయి. ఇక్కడికి, అమెరికాకు తేడా ఏమిటంటే మనం చేతులకు పని చెపుతాం. వాళ్లు తుపాకీలకు పని చెప్తారు. ఎందుకంటే వాళ్లకు తుపాకులు అందుబాటులో వుంటాయి. అది వాళ్ల కల్చర్! దానికి తగ్గట్టుగానే అక్కడ వుండేవాళ్లు - స్వతహాగా అమెరికన్లయినా, విదేశాల నుండి వెళ్లి స్థిరపడినవారైనా - హెచ్చరికగా వుండాలి. ఓ స్థాయి దాటి పోట్లాట పెట్టుకోకూడదు.
తానా పూర్వ అధ్యక్షులు, భారతీయ అమెరికన్ మైత్రీ మండలి అధ్యక్షులు, మిత్రులు తోటకూర ప్రసాద్ గారు మనవాళ్లు తీసుకోవలసిన జాగ్రత్తలు అంటూ పేపర్లలో వ్యాసాల ద్వారా, టీవీ ద్వారా చాలా విషయాలు చెప్పారు. అవి వింటే 'ఇవి కూడా చెప్పవలసి వస్తోందేమిటి?' అనిపిస్తోంది. రాజకీయ నాయకులు, సినిమా తారలు వస్తే ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారట. ఏదైనా కల్చరల్, రెలిజియస్ ఫంక్షన్లు అత్యంత కోలాహలంగా జరుపుతూ పోలీసుల చేత చివాట్లు తింటున్నారట.
బహిరంగ ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ సద్దుగా మాట్లాడడం, స్థానికులను చూస్తూ, పక్కవాళ్లకు చూపిస్తూ వాళ్ల కర్థం కాకుండా తెలుగులో మాట్లాడడం, బిగ్గరగా నవ్వడం, తమ యిళ్ల దగ్గర గట్టిగా మ్యూజిక్ పెట్టడం, లుంగీలు, నైట్గౌన్లలో యింటి బయట తిరగడం, స్థానికులను తేరిపార చూడడం, ఫంక్షన్లకు వచ్చి యితరులకు ఆటంకం కలిగించేట్లా కార్లు యిష్టం వచ్చినట్లు పార్క్ చేయడం.. యిలాటివి చెయ్యవద్దు అని చెప్తున్నారు. అంటే కొంతమందైనా యిప్పుడు చేస్తున్నారనే అర్థమవుతోంది. సినిమా రిలీజు టైములో కటౌట్లు, క్షీరాభిషేకాలు, జంతుబలులు యింకా మొదలుపెట్టి వుండరు. మొదలెడితే పక్కవాడికి కసి యింకా పెరుగుతుంది.
నిజానికి యిలాటివి చెప్పాలా అనిపిస్తుంది కానీ తెలియకపోతే అడిగి తెలుసుకోవడం మంచిది. ఇంకో సందర్భంలో వేరేవారు చెప్పారు - మన కుర్రవాళ్లకు ఫైనాన్షియల్గా ఫ్యామిలీ సపోర్టు వుంటుంది. వాళ్లకుండదు. మనవాళ్లు ఇంటి బయట పార్టీలు చేసుకుంటూ తమ కున్న బంగారాన్ని, సంపదను షో ఆఫ్ చేస్తున్నారట. అసలే ఉద్యోగాలు లేక ప్రభుత్వ భృతిపై బతుకుతున్న పొరుగింటి స్థానికుడికి అక్కసు, అసూయ రగులుతోందట. 2015 దీపావళికి యుకెలో ఉన్నాను. మేం ఉన్న కవెంట్రీలోనే బాణసంచా కాల్చారు. మాకు దగ్గర్లో వున్న లెస్టర్లో కొన్ని గంటలపాటు ఒక వీధి వీధంతా దీపావళి పటాసులతో, ప్రభుత్వ అనుమతితోనే, హోరెత్తిస్తారు. లండన్లో అయితే కొన్ని ప్రాంతాల్లో మరీట. శ్రీలంక తమిళులు శరణార్థులమనే పేరుతో పౌరసత్వం సంపాదించుకుని చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని, రాత్రి 10 దాకా వాటిని నడుపుతూ విపరీతంగా ఆర్జించి ఆస్తులు కొన్నారు. వాళ్లు దీపావళి చాలా ధూంధాంగా చేస్తారు. వినడానికి మనకు సరదాగానే వుంటుంది కానీ పొరుగున వున్న ఇంగ్లీషువాడికి అనిపిస్తుంది - 'పొట్ట చేత్తో పట్టుకుని వచ్చినవాడు నా కళ్ల ముందే ఎదిగి యిప్పుడింత ఆర్భాటం చేస్తున్నాడు. నేను ఇంగ్లీషు పద్ధతుల్లో ఐదు గంటలకే కొట్టు కట్టేసి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుందన్నట్లు వుండిపోయాను' అని.
అంతెందుకు మన యింటి పక్క వున్న ఖాళీ స్థలంలో ఓ లంబాడీ తండా వచ్చి ఆక్రమించి, గుడిసెలు వేసేసుకుని వాళ్లకు ప్రత్యేకమైన పండగ వచ్చిందంటూ ఓ రాత్రంతా ఆడా, మగా తాగి డప్పూ, ఢోలూ, పాటలతో హోరెత్తించేశారనుకోండి. మనకు సహనం నశిస్తుంది. 'వీళ్లను తరిమివేయాలండీ, వాళ్ల ఓట్ల కోసమని నాయకులు వాళ్లని ఎంకరేజ్ చేస్తున్నారు' అంటూ విరుచుకు పడతాం. ఎవరి సంస్కృతి వారు కాపాడుకోవాలి. కానీ అది నాలుగు గోడల మధ్య వుండాలి. స్థానికులకు చిర్రెత్తించే రీతిలో బహిరంగంగా ప్రదర్శించ కూడదు. యూరోపియన్ యూనియన్లో యితర సభ్యదేశాలు కూడా ఇంగ్లండు బాట పట్టబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రతి చోట భూమిపుత్రుల వాదం బలపడుతోంది. భుక్తి కోసం ఇతర దేశాల నుంచి వలస వచ్చేవారిపై అసహనం పెరుగుతోంది. దానితో పాటు విదేశాల నుంచి వచ్చి ఉద్యోగాలు ఎగరేసుకుని పోయేవారిపై కూడా ఆగ్రహం కలుగుతోంది. ప్రొటెక్షనిజం పేరుతో స్థానిక పరిశ్రమలను కాపాడాలని, జాతీయవాదం పేరుతో స్థానికులకే అవకాశం యివ్వాలనే డిమాండు యూరోపంతా వ్యాపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మనం డబ్బు విరజిమ్మి వాళ్లను కవ్వించడం ప్రమాదకరమే.
తోటకూర ప్రసాదు గారే చెప్పారు - ఈ మధ్య టూరిస్టుగా వచ్చిన ఓ భారతీయుడు నార్త్ డకోటా ఎయిర్పోర్టులో విమాన సిబ్బందితో వాగ్వివాదానికి దిగి 'నా సూట్కేసులో బాంబుంటే ఏం చేసి వుండేవారు?' అంటూ తర్కించబోయాట్ట. బహుశా అతని సూట్కేసు అప్పటికే చెకిన్ అయిందేమో! వాళ్లు వెంటనే విమానాన్ని ఆపేసి, పూర్తిగా తనిఖీ చేసి, ఏమీ లేదని తేల్చుకుని యితన్ని పట్టుకుని జైల్లో పడేశారు. అబ్బే నేను సరదాకి అన్నా అని మొత్తుకున్నా వినలేదు. అక్కడివాళ్లు అసలే పారనాయిడ్. పరాయివాళ్లంటే చచ్చే భయం. ఇండియా నుంచి వచ్చిన కేంద్రమంత్రుల్ని కూడా గుడ్డలూడదీసి సోదా చేస్తారు. అలాటి వాళ్లతో పరాచకాలేమిటి? మన ఇండియాలో అయితే నిజంగా బాంబున్నా మనవాళ్లు చలించరు. అందుకే ఏకంగా పార్లమెంటుపై దాడి జరిగినా, మన రైల్వే స్టేషన్లలో, ఎయిర్పోర్టుల్లో భద్రతా ఏర్పాట్లలో వైఫల్యాలు సవరించుకోవటం లేదు. ఈ వాతావరణంలో పెరిగి, ఆ వాతావరణానికి అలవాటు పడాలంటే మనవాళ్లకు తర్ఫీదు యివ్వాల్సిందే.
ప్రసాద్గారు చెప్పిన అంశాల్లో కల్చరల్గా స్థానికులతో కలవడం, మన ఫంక్షన్లకు వాళ్లను పిలవడం, మన ఔన్నత్యాన్ని వాళ్లు గుర్తించేలా చేయడం కూడా వుంది. ఇది చాలా అవసరం. సాధారణంగా ఒక భాషవాళ్లందరూ ఒకే లొకాలిటీలో చేరడం, దానిలోకి యితరులు చొరబడకుండా కనబడని కంచె కట్టేసుకోవడం జరుగుతుంది. మన దేశంలోని నగరాల్లో కూడా యీ ధోరణి కనబడుతుంది. లండన్లో కూడా భారతీయులు ఎక్కువ వుండే ప్రదేశాలు, తెలుగువాళ్లందరూ గుమిగూడి వున్న ప్రదేశాలూ కనబడతాయి. అలా జరిగినపుడు అక్కడ కోలాహలం పెరిగి, స్థానికుల దృష్టిలో పడి, ఏవైనా గొడవలు జరిగినప్పుడు అవి యీజీ టార్గెట్లవుతాయి. నేను అనేక వ్యాసాల్లో రాశాను - తమిళులు తమిళనాడులో తప్ప వేరే ఎక్కడున్నా వారిపై దాడులు ఎందుకు జరుగుతాయి? అని. బెంగుళూరు, ముంబయి, శ్రీలంక.. యిలా ఎక్కడైనా సరే వాళ్లపై దాడులు జరుగుతాయి, తెలుగువాళ్లపై జరగవు. ఎందుకు? ఎక్కడికి వెళ్లినా తమిళులు తమ అస్తిత్వం చాటుకుంటారు. తమ వాళ్లంతా ఒక పేటలో పోగడి, వాళ్ల వూళ్ల నుంచి వచ్చినవాళ్లందరినీ అక్కడ చేరుస్తారు. అక్కడ తమ తరహాలో ఓ గుడి కడతారు. తమ ప్రాంతపు పూజారిని రప్పిస్తారు. మేళతాళాలతో ఉత్సవాలు చేస్తారు. ఆ లొకాలిటీలో లుంగీలు కట్టుకుని వీధుల్లో తిరిగేస్తూంటారు. తమ ప్రాంతపు వంటకాలు దొరికే దుకాణాలు పెట్టిస్తారు. చుట్టూ యితర భాషీయులు ఎంతమంది వున్నా తమిళంలో పెద్దగా అరుచుకుంటూ తమ ఉనికిని చాటుకుంటారు. ఏవైనా పండగలు వస్తే ఏ తమిళ విద్వాంసుణ్నో పిలిపించి కచ్చేరీ పెట్టిస్తారు. వాళ్ల సంఘీభావం సాధారణంగా చూడముచ్చటగానే వుంటుంది. కానీ వాళ్లు స్థానికులను డామినేట్ చేస్తున్నారన్న ఫీలింగు వచ్చిందంటే చాలు వాళ్లపై దాడులు జరుగుతాయి. తెలుగువాళ్లల్లో అలాటి సంఘీభావం అస్సలు వుండదు. పైగా తెలుగుతనం నిలబెట్టేయాలన్న తపనా వుండదు. ఎక్కడ వుంటే అక్కడ లోకల్ వాళ్లతో కలిసిపోతారు. వేషభాషలు కూడా మారిపోతాయి. అందువలన యితర రాష్ట్రాల్లో వున్న తెలుగువారిపై దాడులు ఎప్పుడూ వినం.
ఈ విషయాలు తలకెక్కించుకునే బదులు మన మీడియా ట్రంప్ను తిట్టడానికి చాలా సమయం వెచ్చిస్తోంది. అమెరికా వలసదారుల దేశమని గుర్తుంచుకోవాలట. పాత చరిత్రంతా తవ్వి వలసదారుల వలన ఆ దేశం ఎంత బాగుపడిందో చెప్తున్నారు. ఆ మాట కొస్తే మన దేశానికి ఎన్నో జాతుల వాళ్లు శతాబ్దాలుగా వలస వస్తూనే వున్నారు. అంతమాత్రం చేత యిప్పుడు ఎవణ్ని పడితే వాణ్ని రానిస్తామా? బంగ్లాదేశ్ శరణార్థులు ఆసాంను ముంచెత్తుతున్నారని ఆందోళన జరగటం లేదా? ఎవర్ని రానీవాలో, ఎవర్ని రానీయనక్కరలేదో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. 'మీది వలస దేశం కాబట్టి, మీ దేశంలో వున్న 1.10 కోట్ల అక్రమ వలసదారులను ఉంచుకో! కొత్తగా ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకోకు.' అని మనం చెప్పగలమా? అక్రమవాసుల్లో నాలుగున్నర లక్షల మంది భారతీయులున్నారట. అలా వుండడం తప్పు కదా! అసలు వుండవలసిన అవసరం ఏమొచ్చింది? వాళ్లను తీసుకెళ్లి జైల్లో పెడితే మన పాలకులు అభ్యంతర పెట్టగలరా? హైదరాబాద్లో సరైన పత్రాలు లేకుండా బంగ్లాదేశీయులు తిరుగుతున్నారని మనం ఫిర్యాదు చేయటం లేదా?
తాజాగా ఔట్సోర్సింగ్ చేసే కంపెనీలకు యిచ్చే గ్రాంట్లు, గ్యారంటీలు, రాయితీలు యివ్వకూడదంటూ బిల్లు ప్రవేశపెడుతున్నారు. విదేశాల్లో అమెరికా కంపెనీల ఔట్సోర్సింగు ఉద్యోగులు 1.40 కోట్ల మంది వున్నారు. అంటే అమెరికాలో ఉద్యోగార్థుల కంటె దాదాపు రెట్టింపు. నిజానికి బ్యాంకు బాలన్సు చెప్పడం, సినిమా హాల్లో బుకింగ్ చేయడం వంటి పనులు స్థానికులకే యివ్వవచ్చు. ఎంతటి గణిత విద్యా ప్రవీణులైనా బయటి దేశాల వాళ్లకు యిచ్చే అవసరం లేదు. కానీ కంపెనీలు ఎందుకిస్తున్నాయి? వాళ్లయితే చవగ్గా చేస్తారని, డబ్బు మిగులుతుందని. ఆ విధంగా ఆల్రెడీ లాభపడుతున్న కంపెనీలకు విడిగా రాయితీలు దేనికి? మన పాలకులు ట్రంప్ నుంచి స్ఫూర్తి తీసుకుని మన కంపెనీలకు కూడా యిలాటి కోతలు పెట్టాలి. ఎందుకంటే ఏ చైనావాళ్లో మన కంటె తక్కువ జీతాలకు సిద్ధపడవచ్చు. అప్పుడు మన కంపెనీలు వాళ్లకు ఔట్సోర్సు చేసేయవచ్చు. ఇప్పటికే మన ఐటీ కంపెనీలు ఉద్యోగాలు కల్పిస్తున్నామనే పేర ప్రభుత్వాల నుంచి అవసరం లేకపోయినా వందలాది ఎకరాలు చౌకగా కొట్టేశాయి. స్థానికంగా తయారుచేసిన వస్తువులమ్మే షాపు వాడి ఎదురుగా మరొకడు చైనా చీప్ వస్తువుల షాపు పెట్టి లాభాలు గడిస్తూ, పైగా ప్రభుత్వం నుంచి రాయితీలు కూడా పొందుతూంటే మొదటి షాపువాడు ఎలా ఫీలవుతాడో ఊహించండి.
ఇప్పుడీ కాన్సస్ సంఘటన వలన, ట్రంప్ విధానాల వలన అత్యధికంగా ప్రభావితమయ్యే వారు యీ వర్గమే. నిజానికి అన్నీ సక్రమంగా వున్నవారికి కూడా పూరింగ్టన్ వంటి వాడి వలన భయముంది. వాళ్లకే అలా వుంటే చదువుతూండగానే అక్రమంగా పని చేసేవారు, చదువు పూర్తయి, వీసా గడువు తీరిపోయినా అక్రమంగా వుండిపోయినవారు ఇంకా దడుస్తారు. పూరింగ్టన్ లాటి వాడు తమను ప్రశ్నలు వేస్తాడని అనుక్షణం భయపడుతూ వుంటారు. అక్కడుంటే గొడవలు వస్తాయనుకుని వెనక్కి వచ్చేస్తారు. ఇప్పటికే అక్రిడేషన్ కౌన్సిల్ ఫర్ ఇండిపెండెంట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ బోర్డు గుర్తింపు రద్దు చేయడంతో దాని అనుబంధంగా వున్న 800 విద్యాసంస్థల్లో చేరిన 2 లక్షల మంది పరిస్థితి గందరగోళంగా వుంది. గత ఏడాది చదువు పూర్తి చేసుకుని ఏడాదిగా ఓపిటిపై ఉద్యోగం చేస్తున్న వారిలో 10 వేల మంది తెలుగువాళ్లు వున్నారట. బోర్డు రద్దుతో వీరిలో కనీసం సగం మందైనా వెనక్కి రావలసి వుంటుంది. లేకపోతే మళ్లీ యింకో యూనివర్శిటీలో చదువు కంటూ చేరాలి. వారి తలిదండ్రులు మరింత అప్పులపాలవుతారు. వారికి వ్యక్తిగతంగా నష్టమే కానీ, దీనివలన జరిగే మేలు ఏమిటంటే - ఇకపై ఉద్యోగాల యావలో పిల్లల్ని అమెరికా పంపరు. ఇక్కడ ఏదోలా బిటెక్ అయిందనిపించి, ప్రఖ్యాత యూనివర్శిటీల్లో సీటు తెచ్చుకోలేక, తలితండ్రుల్ని పీడించి, 40, 50 లక్షలు విద్యాఋణాలు తీసుకుని, బ్యాంకు బాలన్స్ లేకపోయినా వున్నట్లు చూపించి, ఏజంట్ల ద్వారా స్థాయిలేని యూనివర్శిటీలో చదువు వెలగబెడుతూ, చాటుగా ఉద్యోగాలు చేసేవారు తగ్గుతారు. ఉన్నతవిద్య కోసం నిజంగా తపించేవారు మాత్రమే అమెరికా వెళతారు. వారికి ఎలాగూ మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఎచ్1బి వీసా బిల్లు పాసయితే జీతం కూడా 1.30 లక్షలు వస్తుంది.
పిల్లల్ని అమెరికా పంపుదామనుకుంటున్న తలిదండ్రులకు యీ సుదీర్ఘవ్యాసం చెప్పే సలహా ఒక్కటే - ప్రస్తుత సంఘటనతో బెంబేలెత్తకండి. మీ పిల్లలలో అసమాన ప్రతిభ వుంటేనే అమెరికా పంపండి. అదీ పేరుప్రఖ్యాతులున్న కాలేజీల్లో సీటు వస్తేనే, అతను చాటుమాటు ఉద్యోగం చేయనవసరం లేకుండా చదివించగల ఆర్థిక స్తోమత మీకుంటేనే పంపండి. 'చదువు పూర్తయ్యాక ఉద్యోగం దొరకదు, యింటికి తిరిగి వచ్చేస్తాడు, ఇక్కడే ఉద్యోగం వెతుక్కుంటాడు' అనే సందర్భానికి సిద్ధపడితేనే పంపండి. పంపబోయే ముందు అక్కడి సమాజంలో ఎలా యిమిడిపోవాలో తర్ఫీదు యిప్పించి పంపండి.
ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2017)
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు