Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సిపిఎం ఆవిర్భావం - 09

రాజరికం పోయి ప్రజాస్వామ్యం రావాలని, భూస్వామ్య వ్యవస్థ పోవాలని, విదేశీ శక్తులని తరిమేయాలని సన్యట్‌ సేన్‌ ప్రారంభించిన కొమింటాంగ్‌ అనే దేశీయ ఉద్యమం దక్షిణ చైనానుండి ప్రారంభమై విజయవంతమయింది. ఈలోగా అంత:పుర కుట్రలు జరిగాయి. ప్రధానమంత్రి యువాన్‌కి, పూయీ చక్రవర్తికి విభేదాలు వచ్చాయి. అది అదనుగా 1912లో సన్యట్‌సెన్‌ చైనాను రిపబ్లిక్‌గా ప్రకటించి దానికి అధ్యకక్షుడయ్యాడు. ప్రధానమంత్రి యువాన్‌కి రాజ్యం అప్పగించి చక్రవర్తి పారిపోయాడు. ఇటువంటి సంధియుగంలో మన దేశంలో పాలెగార్లులా, అక్కడ తుచూన్లు అని పుట్టుకొచ్చారు. అంటే చిన్నచిన్న సంస్థానాధీశులు అన్నమాట. కాస్త సైన్యం, విదేశీయుల మద్దతు. ఒకళ్లతో ఒకళ్లు కొట్టుకోవడం. అందరూ కలిసి ప్రజలను దోచుకుతినడం. దోపిడీ దొంగలకు ఎక్కువ, సామంతరాజులకు తక్కువ!

చైనా యిలా అంతర్గత కలహాలతో కొట్టుకు ఛస్తూ వుంటే జపాన్‌ మధ్యలో దూరింది. వాళ్లకు వెస్టర్నయిజేషన్‌ కారణంగా పారిశ్రామికీకరణ ఎక్కువ. కానీ చోటు తక్కువ. పక్కనున్న దేశాలను కబళించాలని ఎప్పుడూ ఆశే! అందునా చైనా యిలాటి పరిస్థితిలో వుంటే ఎంత హుషారుగా వుంటుంది! వాళ్ల చక్రవర్తిని కీలుబొమ్మ చేసి చైనాను అదుపులో తీసుకుందామని ప్రయత్నించింది. సాగలేదు. 1915 నుండి 1919దాకా జరిగిన మొదటి ప్రపంచయుద్ధ సమయంలో చైనాలో కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది. యుద్ధం పూర్తయ్యాక బ్రిటన్‌ వగైరా దేశాలు జపాన్‌ ఆక్రమించిన ప్రాంతాలను జపాన్‌కి కట్టబెట్టి, చైనాకు అన్యాయం చేశాయి. దాంతో ప్రజలు భగ్గుమన్నారు. 1919లో ఓ విప్లవం చెలరేగింది. విదేశీ వస్తువులను దగ్ధం చేశారు. రష్యన్‌ విప్లవం చూసి ప్రభావితులైన యువకులు చైనా కమ్యూనిస్టు పార్టీ (సిసిపి) నెలకొల్పారు. 

విదేశీశక్తుల సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొవాలంటే కమ్యూనిస్టులు మొదట స్వదేశంలో వున్న జాతీయవాదులతో చేతులు కలపాలని, వాళ్లతో చేతులు కలిపి విదేశీయులను తరిమేశాక, అప్పుడు వీళ్ల పని పట్టాలని లెనిన్‌ సిద్ధాంతం. 'ఎందుకంటే ఈ జాతీయవాదులు ధనికుల కొమ్ము కాస్తారు. శాంతియుతంగా పోరాటం చేద్దామంటారు. మితవాద ధోరణి అవలంబిస్తారు. అందుచేత వారిని అణిచేసి, కార్మికరాజ్యం నెలకొల్పాలి. అలా అని, మొదటినుండే జాతీయవాదులతోనూ, విదేశీశక్తులతోనూ పోరాడబోతే యిద్దరూ కలిసి కార్మికులను అణిచేస్తారు.' అంటాడాయన. ఈ సిసిపీ అంటే చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ సన్యట్‌సెన్‌ గారి కుమిన్‌టాంగ్‌ పార్టీకి మద్దతు యిచ్చింది. రష్యా సన్యట్‌ సెన్‌ ప్రభుత్వాన్ని గుర్తించి, దానికి అన్నివిధాలా సహాయం చేయడంలో ఉద్దేశం యిదే. రష్యా మద్దతుతో, చైనీస్‌ కమ్యూనిస్టుల మద్దతుతో సన్యట్‌సెన్‌ ప్రభుత్వం దక్షిణ చైనాలో అనేక ప్రాంతాలకు విస్తరించింది. 

కానీ తుచూన్‌లు ఊరుకుంటారా? వాళ్ల కొమ్ముకాస్తున్న విదేశీశక్తులు ఊరుకుంటాయా? అంతర్యుద్ధం ప్రారంభించాయి. వాళ్లతో సంప్రదింపులు జరపడానికి వెళ్లి సన్యట్‌సెన్‌ మరణించాడు. ఇది 1925. ఆయన తర్వాత కొమింటాంగ్‌ నాయకుడిగా వచ్చిన చాంగ్‌-కై-షేక్‌  సన్యట్‌సెన్‌ వంటివాడు కాడు. మహా కుటిలుడు. కానీ సమర్థుడు. ఇతను కమ్యూనిస్టుల సహాయంతో తుచూన్లను అణచివేశాడు. మూడేళ్లలో దేశాన్ని ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకువచ్చాడు. ఇది జరిగాక విదేశీశక్తులతో చేతులు కలిపి కమ్యూనిస్టులను అణచివేయడం మొదలెట్టాడు. సన్యట్‌సెన్‌ ప్రవచించిన భూసంస్కరణల కార్యక్రమం పక్కన పడేశాడు. భూస్వామ్యవ్యవస్థను చెక్కు చెదరనీయలేదు. దీంతో కమ్యూనిస్టులు ఇతని ప్రభుత్వాన్నుండి 1929లో బయటకు వచ్చేశారు. 

1925 డిసెంబరులో భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఏర్పడినపుడు వున్న అంతర్జాతీయ వాతావరణం అది. చైనాలో కొమింటాంగ్‌లా భారత్‌లో కాంగ్రెసు జాతీయవాద పార్టీ. అప్పటికే బలంగా వుంది. చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీలాగానే భారతీయ కమ్యూనిస్టు పార్టీ కూడా కాంగ్రెసుతో కొంతకాలం పని చేసి, తాము బలపడిన తర్వాత కలహించవచ్చు అని కమ్యూనిస్టు నాయకులు అనుకున్నారు. అది సాధ్యమా, ఎంత పిచ్చి ఆలోచన అని మనం యిప్పుడు అనుకోవచ్చు. చైనాలో మాత్రం మావో ఓ పట్టాన గెలిచాడా? మావోలాగే మనదేశంలోనూ విప్లవం తెచ్చేద్దామని కుతూహల పడిపోయేవారిలో చాలామంది మావో లాంగ్‌మార్చ్‌ అని బయలుదేర తీస్తే పోనుపోను చాలామంది వచ్చి చేరారని, ఆ ఊపులో అలాగే వెళ్లి సింహాసనం ఎక్కేశాడు అని అనుకుంటారు. లాంగ్‌మార్చ్‌వల్ల మావో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు వచ్చిన మాట వాస్తవమే కానీ వెంటనే అధికారం సిద్ధించలేదు. లాంగ్‌మార్చ్‌ జరిగినది 1934-35 మధ్య. మావో ప్రభుత్వం ఏర్పరచినది 14 ఏళ్ల తర్వాత 1949లో! లాంగ్‌ మార్చ్‌కు ముందు ప్రభుత్వం నుండి బయటకు వచ్చాక జియాంగ్సీ పర్వతాలకు వెళ్లి అక్కడ సోవియట్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా పేరుతో రాజ్యం ఏర్పరచుకుని  1931 నుండి 1934 వరకు పాలించాడు. తాను అనుకున్న సంస్కరణలు అమలు చేయసాగాడు. చాంగ్‌ కై షేక్‌ చేతిలో ఓడిపోయిన కమ్యూనిస్టులకు ఆశ్రయం కల్పించేవాడు. 

అదే పద్ధతిలో తెలంగాణలో కూడా కమ్యూనిస్టు రాజ్యం తెచ్చేసి, అక్కణ్నుంచి దేశమంతా వ్యాపించేద్దామని భారత కమ్యూనిస్టులు అనుకున్నారు. అంతేగానీ, ఒక పాఠకుడు రాసినట్లు దాన్ని రష్యాలో కలిపేద్దామని కాదు. ఎక్కడి తెలంగాణ? ఎక్కడి రష్యా? సరిహద్దులు కలుస్తాయా? అసలు తెలంగాణ పోరాటం తప్పని స్టాలిన్‌ తిట్టిపోశాడట. యుద్ధంలో ఓడిపోతే పారిపోవడానికి సముద్రతీరం లేకుండా అన్ని వైపులా భూమి వుంది కదా, ఎలా గెలుస్తారనుకున్నారు? అని మందలించి, పోరాటం విరమించమని సలహా యిచ్చాడట. ప్రపంచ చరిత్రలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏదైనా వుంది అంటే అది మన దేశంలోని కేరళ రాష్ట్రంలోనే. ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ 1957 ఎన్నికలలో గెలిచారు. తక్కిన కమ్యూనిస్టు విజయాలన్నీ హింసాత్మకమైనవే. అహింస ద్వారా స్వాతంత్య్రం తెచ్చుకున్న భారతదేశంలో హింసాధోరణికి గిరాకీ లేదని అప్పటి గదర్‌ పార్టీ నుంచి, యిప్పటి మావోయిస్టుల దాకా గుర్తించకపోవడం దురదృష్టకరం. లేటుగా నైనా అది గుర్తించిన సిపిఐ, సిపిఎంలకు రివిజనిస్టు పార్టీలుగా వీరి చేత ముద్రపడడం విషాదకరం. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5

Click Here For Part-6

Click Here For Part-7

Click Here For Part-8

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?