Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : పాలస్తీనా సమస్య - 03

మొదటి ప్రపంచయుద్ధం తర్వాత యుద్ధం అనర్థం, శాంతి తక్షణావసరం అంటూ అప్పటిదాకా యుద్ధాలు చేసిన అగ్రదేశాలే నానారాజ్య సమితి (లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌) పేర ఒక అంతర్జాతీయ సంస్థ పెట్టారు. అది అగ్రరాజ్యాలు చెప్పినట్లా ఆడి, ఘోరంగా విఫలమైంది. రెండవ ప్రపంచయుద్ధాన్ని ఆపలేకపోయింది. అందువలన రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి (యుఎన్‌ఓ) స్థాపించారు. అది కూడా అమెరికా, పాశ్చాత్య దేశాలు చెప్పినట్లు ఆడుతోందని అందరికీ తెలుసు. కానీ యిన్నాళ్లగా నెట్టుకొస్తోంది. మొదటి యుద్ధానంతరం యీ నానారాజ్య సమితి మేన్‌డేటరీ పద్ధతి అని పెట్టి దాని ద్వారా సిరియాను ఫ్రాన్స్‌కి, పాలస్తీనా, ఇరాక్‌లను బ్రిటన్‌లకు కట్టబెట్టింది. తక్కిన అరబ్‌ రాజ్యాలు బ్రిటన్‌ పరోక్ష ప్రాబల్యంలోకి తరలిపోయాయి. మనం ఎలాగైతే ఆంగ్లసామ్రాజ్యపు వలస రాజ్యంగా వున్నామో, అరబ్బులు కూడా అలాగే తయారయ్యారు. మనలాగే యీ బానిసత్వాన్ని అరబ్‌లు ఆమోదించలేదు, సహించలేదు. రష్యాలో జరిగిన విప్లవం వారిని ఉత్తేజ పరిచింది. పైగా అప్పుడే టర్కీ మహాసామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి గెలిచి వున్నారు. అందువలన బ్రిటిష్‌, ఫ్రెంచ్‌ సామ్రాజ్యవాదులకు ఓ పట్టాన లొంగలేదు. అప్పుడు యీ రెండు రాజ్యాలు  విభజించి పాలించే సూత్రం అవలంబించి అరబ్బుల్లో చీలికలు తేవడానికి పూనుకున్నాయి. కొన్ని దేశాలలో క్రైస్తవులు అధికంగా వున్న ప్రాంతాలను గుర్తించి వాటిని విడగొట్టి, ఏ రాజ్యమూ పెద్దగా లేకుండా అంతఃకలహాల్లో మునిగేట్లు చేసి, బలహీన పరచాలనే చూశాయి. ప్రజలు తిరగబడితే రాజ్యాంగ సంస్కరణలు చేపడతామని హామీ యివ్వడం, వారిలో కొందర్ని మితవాదులుగా మార్చడం చేశాయి. ఇలా ప్రతీ అరబ్‌ దేశంతోనూ యివి ఆటలాడాయి. మన ప్రస్తుత అంశం పాలస్తీనా కాబట్టి దాని గురించే మాట్లాడదాం.

పాలస్తీనాతో వచ్చిన చిక్కేమిటంటే అది మూడు ప్రముఖమతాల వారికి పుణ్యక్షేత్రం. ప్రాచీన కాలంలో యూదులకు స్వస్థలం. దానిలో ఉత్తర భాగాన్ని ఇజ్రాయేల్‌  (రాజధాని జెరూసలేం) అని, దక్షిణ భాగాన్ని జుడా అని పిలిచేవారు. జీసస్‌ క్రైస్త్‌ జెరూసలెంలో యూదుజాతిలోనే పుట్టాడు. అతని మరణం తర్వాత సుమారు 300 ఏళ్లకు క్రైస్తవం బాగా వ్యాప్తి చెందింది. అప్పణ్నుంచి ప్రపంచ క్రైస్తవులందరూ జెరూసలెంను పుణ్యస్థలంగా భావించసాగారు. కొన్నాళ్లకు వచ్చిన ఇస్లాం మతస్తులకు కూడా పాలస్తీనా పవిత్రభూమిగానే వుంది. ఇస్లాం స్వీకరించిన అరబ్బులు పాలస్తీనాను ఆక్రమించారు. వారి సైనికబలానికి తట్టుకోలేక యూదులు యితర దేశాలకు తరలివెళ్లిపోయి, మొదటిభాగంలో చెప్పినట్లు వ్యాపారమార్గం ద్వారా డబ్బు బాగా సంపాదించారు. గతంలో యుద్ధాలలో పోగొట్టుకున్న పాలస్తీనాను యీ కాలంలో డబ్బుతో సంపాదించాలని ప్రయత్నించారు. 

మొదటి ప్రపంచయుద్ధకాలంలో బ్రిటన్‌తో బేరాలాడారు - 'ఇప్పుడు మీకు చాలా డబ్బు కావాలి, మేం అప్పిస్తాం. కానీ దానికి బదులుగా పాలస్తీనాలో మాకు జన్మభూమి కల్పించాలి' అని. అరబ్బుల స్వాతంత్య్ర పిపాస అప్పటికే రుచి చూస్తున్న బ్రిటన్‌కు యీ యూదుల దేశాన్ని వారి మధ్య స్థాపిస్తే  వాళ్లకు చెక్‌ చెప్పినట్టు వుంటుందని లెక్క వేసింది. అరేబియాలోని చమురు తమకు కావాలి. వాళ్లు యివ్వకపోతే ఆయుధశక్తి ప్రయోగించాలి. దానికి అక్కడ ఒక స్థావరం కావాలి, అది నెలకొల్పడానికి మిత్రదేశం కావాలి. ఈ యూదులు ఆ మిత్రదేశాన్ని తమ ఖర్చుతో తాము ఏర్పాటు చేసుకుంటానంటున్నారు, పైగా మనకు భారీ ఋణాలు యిస్తామంటున్నారు. ఇంకేం కావాలి? బ్రిటన్‌ విదేశాంగ మంత్రి ఆర్థర్‌ బాల్ఫర్‌ ద్వారా యూదు ఋణదాతలు (బ్యాంకర్లు) నాయకుడు రాత్‌ఛైల్డ్‌కు 1917లో ఒక లేఖ రాసి కమిట్‌ అయ్యారు. యూదులు సంతృప్తి పడి అప్పులిచ్చారు. యుద్ధానంతరం మాట చెల్లించమన్నారు. నానారాజ్యసమితి ద్వారా మేన్‌డేటరీ పద్ధతిలో పాలస్తీనాను చేజిక్కించుకున్న బ్రిటన్‌ యూదులను అక్కడకి వెళ్లి నివసించడానికి అనుమతి యిచ్చేసింది. పాలస్తీనాను సంప్రదించనే లేదు. 1919లో 60 వేల మంది యూదులు పాలస్తీనాకు తరలివెళ్లారు. ఆ తర్వాత వెళుతూనే వున్నారు. పదేళ్లు తిరిగేసరికి వారి సంఖ్య 8 లక్షలకు పెరిగింది. 

యూదు ధనికులు బ్రిటన్‌ పాలకులతో ఒప్పందం చేసుకున్నా యీ స్థాయిలో సామాన్య యూదులెవరైనా తరలి వెళతారా? అన్న సందేహం మనకు కలుగుతుంది. ఈ తరలి వెళ్లడం వెనక్కాల ఒక ఉద్యమం వుందని తెలిస్తే ఆ సందేహం తీరుతుంది. మాతృదేశం వదలి వెళ్లిన యూదులు ఎన్ని అష్టకష్టాలు పడ్డారో బైబిల్‌లోనే వర్ణించబడింది. యూదులలో మతభావనలు హెచ్చు. ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా స్థానికులతో కలవకుండా తమ ఐడెంటిటీని అలాగే కాపాడుకుంటూ వచ్చారు. మాతృదేశానికి మరలాలన్న ధ్యేయాన్ని పాత తరం కొత్తతరానికి నూరిపోస్తూ వచ్చింది. 1492లో స్పెయిన్‌ యూదులను తరిమివేయడంతో కొందరు పాలస్తీనాలో సెటిల్‌ అయ్యారు. 16 వ శతాబ్దంలో యూదులు జెరూసలెం, టిబిరియాస్‌, హెబ్రాన్‌, సఫేద్‌ అనే నాలుగు పుణ్యస్థలాలలో స్థిరపడ్డారు. 1697లో కొంతమంది వచ్చారు. 1750 ప్రాంతాల్లో తూర్పు యూరప్‌ దేశాల నుండి మరి కొందరు వచ్చారు. కానీ 1881లో తూర్పు యూరోప్‌ నుండి భారీ సంఖ్యలో వలస ప్రారంభమైంది. ఆస్ట్రియా-హంగరీ దేశాలకు చెందిన జర్నలిస్టు థియోడోర్‌ హెర్జెల్‌ యూదులు సంచారజీవితానికి స్వస్తి చెప్పి తమ మాతృభూమిని తిరిగి చేరాలనే ఉద్యమాన్ని 1896లో ప్రారంభించాడు. మరుసటి ఏడాదే ప్రపంచ యూదుల సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరికీ యీ సలహా యిచ్చాడు. 1904-14 మధ్య 40 వేల మంది యూదులు పాలస్తీనాలో స్థిరపడ్డారు కానీ సగానికి సగం మంది వెనక్కి వెళ్లిపోయారు. ఇక 1918లో బ్రిటన్‌ మద్దతు లభించాక వెల్లువెత్తారు. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?