Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : శ్రీలంక అధ్యక్షుడి భారత పర్యటన - 1

ఎమ్బీయస్‌ : శ్రీలంక అధ్యక్షుడి భారత పర్యటన - 1

శ్రీలంకకు కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన మైత్రీపాల సిరిసేన ఫిబ్రవరి 16 న భారతదేశం రాబోతున్నారు. ఇది అతని మొదటి విదేశీ పర్యటన. రాజపక్ష చైనాకు అనుకూలంగా వ్యవహరించగా, సిరిసేన భారత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తారనే ఆశ పొడచూపుతోంది. అనూహ్యంగా 69 ఏళ్ల మహీంద్ర రాజపక్షను ఎన్నికలలో ఓడించిన సిరిసేన తను అనుకున్నది సాధించగలడా లేదాని వూహించేముందు శ్రీలంక ప్రస్తుత రాజకీయాలను ఒక్కసారి మననం చేసుకోవాలి. 

ఎల్‌టిటిఇని మట్టుపెట్టి, శ్రీలంకలో శాంతిని స్థాపించిన రాజపక్షకు యిప్పట్లో ఎదురు వుంటుందని ఎవరూ అనుకోలేదు. ముఖ్యంగా రాజపక్ష! అందుకే గడువుకు రెండేళ్ల ముందుగానే ఎన్నికలు జరుపుతామని నవంబరు 2014లో ప్రకటించి 2015 జనవరి 8 నాటి ఎన్నికలలో తన అధికారాన్ని తానే చేతులారా కూలదోసుకున్నాడు. గతంసారి దేశాధ్యక్షుడిగా వుంటూ 2009 మేలో తమిళ టైగర్లతో యుద్ధంలో గెలిచి, పౌరులందరూ అతన్ని పొగుడుతున్న తరుణంలో 2010లో అతను అధ్యక్ష ఎన్నికలు ప్రకటించాడు. ఎవరూ ఎదురుచూడని విధంగా అతని ఆర్మీ కమాండర్‌ జనరల్‌ శరత్‌ ఫోన్సేకా అతనితో తలపడ్డాడు. ప్రజలు రాజపక్ష పక్షాన నిలిచారు. శరత్‌ ఓడిపోయాడు. విజితుడి పట్ల రాజపక్ష ఔదార్యం చూపలేదు. నాకే ఎదురుతిరుగుతావా, బుద్ధి చెప్తానుండు అన్నట్లు చిన్న చిన్న ఆరోపణలపై అతన్ని జైలుపాలు చేశాడు, అతనితో పాటు అతని సహచరులను కూడా! ఇదే అది అతని పతనానికి నాంది అంటారు పరిశీలకులు. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్ల కంటె ఎక్కువసార్లు అధ్యక్షుడిగా వుండకూడదు. తన అధికారాన్ని ఉపయోగించి 2010లో ఆ షరతు ఎత్తేశాడు. సుప్రీం కోర్టు ఆ సవరణను ఆమోదించేట్లు చూసుకున్నాడు. 

ఆర్థికాభివృద్ధి 7% వుంది అని ప్రభుత్వం చెపుతున్నా శ్రీలంక ఆర్థికవేత్తలు అవన్నీ కిట్టించిన గణాంకాలు అంటున్నారు. రాజపక్ష పాలనలో ఉద్యోగాలు తగ్గాయి, జీతాలు తక్కువగా వున్నాయి. కానీ ప్రజలను ముగ్ధులను చేయడానికి పెద్ద పెద్ద మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులు తలపెడితే అందరూ వూరుకుంటారని అతను తలపోశాడు. చైనా అండగా నిలిచింది. అధిక వడ్డీలపై బిలియన్ల డాలర్ల ఋణాలు యిచ్చింది. ప్రాజెక్టుల వలన ధనం ప్రవహించి కొంతమంది లాభపడ్డారు. వాటి దీర్ఘకాల ప్రయోజనం మాట ఎలా వున్నా ప్రస్తుతానికి మాత్రం అవి గుదిబండల్లా తయారయ్యాయి. ఎందుకంటే వడ్డీలు కట్టడానికి ఏటా వచ్చే ఆదాయమే సరిపోనంత భారీగా అప్పులు తీసుకున్నాడు రాజపక్ష. ఇంత పెద్ద ప్రాజెక్టులు అవసరమా, దీర్ఘకాలంలోనైనా ఆదాయం వస్తుందా, ఆర్థికంగా నిలబడుతుందా (ఎకనమిక్‌ వయబిలిటీ) లేదా, వడ్డీలైనా తీర్చగలమా లేదా అన్న లెక్కలేవీ వేయకుండా వీటిలో దిగాడు. కాంట్రాక్టులు యిచ్చేటప్పుడు అంతర్జాతీయ టెండర్లు పిలిచే పద్ధతి లేదు. ఇతరులతో పోల్చి చూసే పద్ధతి లేదు. (మన ఆంధ్ర రాజధాని బృహన్నిర్మాణపు ప్రణాళికల గురించి, సింగపూరు కంపెనీలకు కాంట్రాక్టులన్నీ కట్టబెడుతున్న తీరు వలన భవిష్యత్తులో జరగబోయే నష్టం గురించి యిక్కడ గుర్తు చేయడం అప్రస్తుతం కాదు) అన్నీ చైనాకు కట్టపెట్టాడు. ఈ ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకునే ముఖ్యమైన మంత్రిపదవులన్నీ రాజపక్ష బంధువుల వద్దే వున్నాయి. తన నియోజకవర్గపు ఓట్ల కోసం తన సొంత వూరిలో ఒక కొత్త ఎయిర్‌పోర్టు, కన్వెన్షన్‌ హాలు, ఎక్స్‌ప్రెస్‌ హైవే కట్టడానికి చైనానుండి ఋణం అర్థించాడతను. చైనా వాళ్ల దగ్గర కమిషన్‌ల కోసమే యీ ప్రాజెక్టులన్నీ అని, చివరకు ఆ అప్పులన్నీ తమ నెత్తిన పడతాయనీ శ్రీలంక ప్రజలు భావించారు. (సశేషం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?