Advertisement

Advertisement


Home > Articles - Special Articles

చంద్రబాబును గెలిపించిన 'విన్నర్‌'...!

చంద్రబాబును గెలిపించిన 'విన్నర్‌'...!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఒకరు గెలిపించడమా? ఆయనే అందరినీ గెలిపిస్తుంటారు. ఆయన్ని గెలిపించడమేమిటి? ఆయన అటల్లో ఏనాడైనా గెలిచాడో లేదో తెలియదు. కాని రాజకీయాల్లో గెలిచాడు...నిలిచాడు. పదేళ్లపాటు పక్కకు ఉన్నా ఏదోరకంగా పరుగులు తీసి అవశేష ఆంధ్రకు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన్ని గెలిపించింది జనం. కాని ఒక వ్యక్తి కాదు కదా...! నిజమే కాని తాజాగా ఓ మహిళ అందులోనూ క్రీడాకారిణి ఆయన్ని గెలిపించింది. ఆమె పీవి సింధు. ఆమె చరిత్ర ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ గెలుపు కథేమిటంటే...రియో ఒలింపిక్స్‌ రజత పతకం విజేత సింధు ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగంలో చేరబోతోందని, ఆమె విజయం సాధించగానే చంద్రబాబు ఆఫర్‌ చేసిన గ్రూప్‌-1 పోస్టును ఆమె ఇప్పుడు అంగీకరించిందని, ఆమె లిఖితపూర్వకంగా ఆమోదం తెలియచేయగా ప్రభుత్వం నియామకపత్రం సిద్ధం చేసిందని మీడియా సమాచారం. అధికారులు ఈ విషయం ధ్రువీకరించారు కూడా. ఆమెకు ఉద్యోగం వస్తే చంద్రబాబు గెలవడం ఏమటని అనుకుంటున్నారా?

సింధు ఒలింపిక్స్‌లో విజయం సాధించగానే ఆ క్రెడిట్‌ను దక్కించుకోవడానికి, ఆమెను తమ రాష్ట్రానికి చెందిన అమ్మాయంటే తమ రాష్ట్రానికి చెందిన అమ్మాయని చెప్పకోవడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు పిచ్చిగా తాపత్రయపడ్డారు. ఒక దశలో ఈ తాపత్రయం వెగటు కలిగించింది కూడా.  సింధును తెలంగాణ ప్రభుత్వం 'తెలంగాణ బిడ్డ' అంటే, ఏపీ ప్రభుత్వం 'ఆంధ్రా అమ్మాయి' అని క్లెయిమ్‌ చేసుకుంది. పోటీలు పడి కోట్ల రూపాయల నజరానాలు ప్రకటించారు. పెద్ద ఉద్యోగాలు ఆఫర్‌ చేశారు. రాజధానుల్లో వెయ్యి గజాల ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఉదాసీనంగా ఉండే పాలకులు సింధును ఆకాశానికి ఎత్తడంలో, కానుకలు సమర్పించడంలో మాత్రం పరుగులు తీశారు. ఇక సన్మానాలు సత్కారాల సంగతి చెప్పక్కర్లేదు. చంద్రబాబు ప్రోటోకాల్‌ కూడా పక్కకు పెట్టి ఆమెకు ఎదురేగి స్వాగతం పలికారు. సింధుకు ఇద్దరు ముఖ్యమంత్రులు పెద్ద ఉద్యోగాలు ఆఫర్‌ చేసినప్పటికీ ఆమె చాలాకాలం అవునని కాదని చెప్పకుండా మౌనంగా ఉంది.

ఇందుకు కారణం ఎటూ తేల్చుకోలేక కావొచ్చు లేదా ఉన్న ఉద్యోగంలో కొనసాగితే బాగానే ఉంటుంది కదా అనే ఆలోచన కావచ్చు. రెండు ప్రభుత్వాలు ఆమెకు ఉద్యోగం ఆపర్‌ చేయగానే ఉద్యోగం లేదని జనం అనుకొనివుంటారు. కాని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్లో డిప్యూటీ మేనేజర్‌ (స్పోర్ట్స్‌)గా పనిచేస్తోంది. ఆమెకు ఆల్రెడీ ఉద్యోగం ఉన్నా సీఎంలు ఆపర్‌ చేయడానికి కారణం ఒలింపిక్‌ విజేత తమ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తోందని గర్వంగా చెప్పుకోవడానికే. ఇలా గర్వపడే అవకాశాన్ని సింధు ఏపీ సీఎం బాబుకు కల్పించడం ద్వారా కేసీఆర్‌తో పోటీపడిన ఆయన్ని గెలిపించినట్లయింది. కేసీఆర్‌కు నిరాశ మిగిలింది. ఏపీ ఆఫర్‌ను ఒప్పుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? రాష్ట్రాభిమానం కావొచ్చు. ఆమె హైదరాబాదులోనే పుట్టి పెరిగింది కాబట్టి ఆమెకు లేకపోయినా పెద్దవాళ్లకు (ఏలూరు ప్రాంతంవారట)  ఉండొచ్చు. లేదా ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగమై ఉండొచ్చు. ఇప్పుడామె డిప్యూటీ కలెక్టర్‌గా చేరితే ఐదారేళ్లలో ఐఏఎస్‌ ర్యాంక్‌ (కన్‌ఫర్మ్‌డ్‌) అధికారి అయ్యే అవకాశం ఉంది. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసి పాసైన వ్యక్తి కాకపోయినా ఐఏఎస్‌ అధికారిగానే పరిగణిస్తారు.

ప్రస్తుతం 21 ఏళ్ల సింధు ముప్పయ్‌ ఏళ్లు రాకముందే ఐఏఎస్‌ అధికారి అవుతుంది. ఒలింపిక్‌ విజేత అనే కీర్తితోపాటు ఐఏఎస్‌ అధికారి అనే పేరూ వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఏ ఉద్యోగం ఆఫర్‌ చేసిందో తెలియలేదు. కొంతకాలం  కిందట తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పట్టించుకోని కేసీఆర్‌ సానియా మీర్జాకు, ఆంధ్రా అమ్మాయి అయిన పీవీ సింధుకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి కానుకలు సమర్పించారని విమర్శించారు.

తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ రైతు సమస్యలపై నివేదిక ఇస్తానంటే అపాయింట్‌మెంట్‌ ఇవ్వని కేసీఆర్‌ ఆంధ్రా ఆడబిడ్డ అయిన  పీవీ సింధుకు నాలుగు కోట్ల రూపాయల నజరానా ఇచ్చి మూడు గంటలసేపు ముచ్చటించారని అన్నారు. ఇది సింధుపై ఉద్దేశపూర్వకంగా చేసిన విమర్శ కాకపోవచ్చు. కాని చివరకు ఆమె 'ఆంధ్రా అమ్మాయి' అయింది. చంద్రబాబు ఇక హ్యాపీ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?