Advertisement

Advertisement


Home > Articles - Special Articles

హేతువాదం అంటే

హేతువాదం అంటే

హేతువాద మేధావులారా రామాయణంలో కనీసం ఒక్క కాండం అయినా చదవండి చిన్న ఘట్టం అయినా చదవండి చేతకాకపోతే మనసు పెట్టి వినండి అప్పుడు విమర్శించండి. ఏం వాగినా సాగిపోతుంది కదా అని వాగడం సరికాదు. పాశ్చత్య దేశాల వారు మన పురాణ గాధల్ని నెత్తిన పెట్టుకొని పూజించుకుంటే. ఈ దేశంలో పుట్టి పురాణాలను పురాణ పురుషులను విమర్శించటమే మీ నిత్య కృత్యం అవుతుంది. అదే హేతువాదులు వేరే మతాల జోలికి వెళ్లరు మరి. లాగి తంతారు అన్న భయం.

మన దేశంలో పుట్టిన ఎందరో మహనీయులుతో పాటు ఐన్ స్టీన్ వంటి శాత్రవేత్తలు కూడా రామాయణ మహాభారతాలు, భాగవత భగవద్గీతలుతో ప్రేరణ పొంది మేము గొప్పవాళ్ళం అయ్యాము అని సగర్వంగా చెప్పుకుంటూ ఉంటే. మీరు మాత్రం వాటిని విమర్శించటమే మీ హోదాలుగా మలచుకుంటున్నారు.

హేతువాదం అంటే ఏది సదాచారం? ఏది దురాచారం? అని విశ్లేషించటం అంతే కానీ కోట్లాది మంది ఆరాధించే దైవాలను దూషించి వాళ్ళ హృదయాలను తూట్లు పొడవటం కాదు వాళ్ళ నమ్మకాల మీద బురద చల్లి మీరు పబ్బం గడపటం కాదు. అదేమీ పెద్ద బ్రహ్మ విద్య కాదు. వాళ్ళు దేవుళ్ళా రాక్షసులా అన్న భావన చూసే విధానంలో ఉంటుంది. వారి నమ్మకంలో ఉంటుంది. మీరు నమ్ముతున్న పిచ్చి సిద్ధాంతాల మీద మీకు ఎంత ప్రేమ ఉంటుందో వారి నమ్మే దైవాల మీద నమ్మకాల మీద వాళ్లకి ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది.

దేవుడుగా మనం కొలిచే రాముడు కూడా శివుడ్ని పూజించాడు. శివుడు విష్ణువుని పూజించాడు విష్ణువు శివున్ని పూజించాడు ఇద్దరూ శక్తి సంపన్నులే. రాముడు కంటే కూడా ఎంతో జ్ఞాన సంపన్నుడు శక్తి సంపన్నుడు పరమ శివ భక్తుడు అయిన రావణున్ని రాక్షసుడు అంటున్నాము అంటే. ఎంత జ్ఞానం ఉన్నా పరస్త్రీ వ్యామోహం ఉంటే చరిత్ర హీనుడే అన్న సత్యం తీసుకోవాలి అని అర్ధం.

పరాయి వాడి చెరలో ఉన్న భార్య కోసం ఎందుకు తపించాడు రాముడు? అయన చక్రవర్తి కో అంటే కోటిమంది కాంతలు అయన ముందు వాలుతారు భార్య దూరం అయినా ఆమె విగ్రహాన్ని పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు ఏముంది? ఎవడో ఒక సామాన్యుడు మాటకి విలువ ఇచ్చి తన భార్యను అడవికి పంపి తను నరక యాతన పడాల్సిన అవసరం ఏముంది? తండ్రి మాటకి విలువ ఇచ్చి అరణ్యవాసం చెయ్యాల్సిన అవసరం ఏముంది? లక్షణుడిని రాముడు నీ భార్యని వదిలేసి మాతో రా అని పిలవలేదే? తన భర్త విడిచి వెళితే ఊర్మిళ దూషించలేదే? సీతను కూడా రమ్మనలేదు కదా నేను లేకపోయినా నా పాద రక్షకులు పెట్టుకొని పరిపాలించు అని భరతున్నీ ఆజ్ఞాపించలేదే. సీతను అగ్ని ప్రవేశం చెయ్యమనకపోతే ఇదే హేతువాద మేథావులు చి చి రాముడు మలినమైన సీతను తెచ్చుకున్న చేతకాని వాడు అని కూడా కూస్తారు ..బహుసా ఇలాంటి మేతావులకు అవకాశం ఇవ్వకూడదనే సీత ఔన్నత్యాన్ని ఇంకా ఈ లోకానికి చాటాలని రాముడు అలా చేసాడేమో.

ఎంతో యోగ సాధన చేసినవారు ఆ రామున్ని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. కానీ ఈ మేతావులకు రాముడు విమర్శనాస్త్రం అయిపోవటం మన దౌర్భాగ్యం. మనకున్న జ్ఞానానికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు, చినజీయర్ స్వామి వారు, సామవేద షణ్ముఖ శర్మగారు లాంటి సద్గురువులు చాలా చాలా ఎక్కువ..అది మన స్థాయి . జ్ఞానం అనేది స్థాయిలను బట్టి ఉంటుంది. జ్ఞానంలో వీరి స్థాయికే మనం ఇంకా ఎదగలేదు రాముడిని విమర్శిస్తున్నాము.

భృగు మహార్షి విశ్వామిత్రుడు వశిష్ఠుడు వంటి ఎంతో మంది ఋషులు శివ కేశవులతో కలిసి తిరిగారు అంటే అది వాళ్ళ స్థాయి. అనసూయ వంటి పతివ్రత త్రిమూర్తులను చిన్న పిల్లలుగా మార్చి దేవేరులు చేత తమ భర్తలు మాములు మనుషులుగా చెయ్యమని వేడుకునట్టు చేసింది అంటే అది ఆమె స్థాయి.

కొన్ని వేల సంవత్సరాల తరువాత కూడా కోట్లాది మంది భక్తులు రామున్ని పూజిస్తున్నారు అంటే అన్ని కోట్లమంది, వందల్లో వేలల్లో ఉన్న మీ వంటి మహా విజ్ఞాన సంపన్నులు కంటే పరమ అజ్ఞానులు అని అర్థమా? ..ఆ కోట్లాది మందిలో ఎంతో మంది శాస్త్ర వేత్తలు ఉన్నారు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పేరు మోసిన వైద్యులు ఉన్నారు సుప్రీం కోర్టు లాయర్లు ఉన్నారు జడ్జీలు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు ,రాజ్యాంగ నిర్మాతలు ఉన్నారు. అబ్దుల్ కలాం వంటి రాష్ట్ర పతులూ ఉన్నారు వాళ్లు కూడా మీకంటే అజ్ఞానులేనా ?

మీరు నమ్మే సైన్స్ అన్నిటికి ఆధారం అనుకోవటం చాలా తప్పు ఈ అనంత విశ్వంలో సైన్స్ కి కూడా అంతుపట్టని రహస్యాలు ఎందుకు ఉన్నాయి? నాసా శాస్త వేత్తలు కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం విలసిల్లిన మన విజ్ఞానాన్ని చూసి అబ్బుర పడుతున్నారంటే వాళ్లు కూడా మీ కంటే అజ్ఞానులే. వాళ్ళు ప్రయోగాలు చేసి నిరూపిస్తున్నా కూడా మీకు సిగ్గు రావటం లేదు. రాముడు నన్ను దేవుడుగా కొలవండి అని ఎక్కడా చెప్పలేదు.రామునిలోని సుగుణాలు ఔన్నత్యాన్ని చూసి లోకం పూజిస్తుంది అది వారి నమ్మకం.

మంచి వెనుక చెడు ఎలా ఉంటుందో, దైవం ఉంటే దయ్యం ఎలా ఉంటుందో ఆచారం దగ్గర దురాచారం కూడా తప్పకుండా ఉంటుంది. అది అన్ని మతాలలో ధర్మాలలో ఉంటుంది తప్పకుండా దురాచారం ఎక్కడున్నా ఖండించాలి అదీ నిజమైన హేతువాదం అంతే కానీ నోరు వుంది కదా అని మీ పిచ్చి పిచ్చి ప్రేలాపనలతో కోట్లాది మంది నమ్మకాలను మనోభావాలను తూట్లు పొడవకండి. మీకు నచ్చలేదు తటస్థంగా ఉండండి అంతే. కోట్లాది మంది నమ్మకాలను తూట్లు పొడిచే హేతువాద మేతావులందరికీ పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 

-మీగడ త్రినాధ రావు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?