సీఎం జగన్ ముద్దుగా పిలుచుకునే దత్త పుత్రుడు పవన్కల్యాణ్ భద్రతపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కనీసం చీమ కుట్టినట్టైనా లేదు. తనకు ప్రాణాపాయం పొంచి వుందని, తనను అంతమొందించేందుకు సుపారీ ఇచ్చారని పవన్ సంచలన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. నిజంగా తనకు భద్రత లేదని భావించి వుంటే, తన పార్టీ నాయకుల ద్వారా డీజీపీ దృష్టికి తీసుకెళ్లేవారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సుపారీ నిర్వహించారనే ఆరోపణలకు ఆధారాలేవైనా ఉన్నాయా? వుంటే తన పార్టీ నాయకుల ద్వారా డీజీపీ దృష్టికి తీసుకెళ్లి చర్యలకు ఉపక్రమించేవాళ్లని అంటున్నారు. అయితే ఈ దఫా చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
పవన్ వైఖరిపై బాబు ఆగ్రహంగా ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దత్త పుత్రుడిగా గుర్తింపు పొందిన పవన్ తన ప్రాణాలపై ఆందోళన చెందుతుంటే, కనీసం నోరు తెరిచి ఒక్క మాట కూడా బాబు మాట్లాడకపోవడం ఏంటనే చర్చకు తెరలేచింది.
సొంత ఎజెండాతో పవన్కల్యాణ్ ముందుకెళ్లడాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు, జనసేనాని మాటల్ని విశ్వసించడం లేదని సమాచారం. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇట్లే టీడీపీ ప్రభుత్వంపై పవన్ ఆరోపించారని బాబు గుర్తు చేస్తున్నారని తెలిసింది.
బీజేపీ చెప్పినట్టుగా వింటూ, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయేలా నడుచుకుంటూ, రాజకీయంగా దెబ్బతీసేందుకు పవన్ కుట్రలు చేస్తున్నారని బాబు ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. అందుకే పవన్ ప్రాణాపాయం కామెంట్స్పై బాబు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదనే చర్చ నడుస్తోంది. చివరికి దత్త తండ్రి కూడా పవన్ మాటలను నమ్మే పరిస్థితి లేదన్న మాట.