“ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం” అని ఆత్రేయ రాసిన పాట ఒకప్పుడు సినీ అభిమానుల్ని ఉర్రూతలూగించింది. ప్రేమ దక్కదని భయాందోళనకు గురైన ఓ ప్రేమికురాలు ఎంతో కఠిన నిర్ణయం తీసుకుంది.
తేనెకంటే తీయనైన ప్రేమను దక్కించుకోవడానికి ఓ ప్రేమికురాలు విశ్వ ప్రయత్నం చేసింది. అయితే ప్రాణంగా ప్రేమించిన వాడు, తనను మోసం చేస్తున్నాడని ఆ ప్రియురాలిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చివరికి ఆ ప్రేమే ఆ యువతిని నేరస్తురాలిని చేసింది.
పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన గర్సికూటి పావని, తాడేపల్లిగూడెం పాతూరు నివాసి అంబటి కరుణ తాతాజీనాయుడు (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమను పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని తాతాజీనాయుడిని పావని ఏడాది కాలంగా కోరుతోంది.
అతను నిరాకరిస్తుండడంతో పావనిలో అసహనంతో పాటు అనుమానం పెరగసాగాయి. తాతాజీనాయుడు మరొకరిని ప్రేమిస్తున్నాడని ఆమె భావించింది. తాతాజీ బైక్పై సోమవారం పంగిడి వెళ్లాడు. పావని తన స్వగ్రామం నుంచి అతని వద్దకెళ్లింది. ఇద్దరూ చీకటి పడే వరకూ బైక్పై తిరిగారు.
రాత్రి కావడంతో ప్రియురాలిని ఊళ్లో వదలడానికి మలకపల్లెకు బైక్పై బయల్దేరారు. బైక్లో వెనక వైపు పావని కూర్చుంది. ప్రాథేయపడుతున్నా తనను పెళ్లి చేసుకోడానికి నిరాకరిస్తున్నాడని రగిలిపోతున్న పావని బ్యాగులో సిద్ధంగా ఉంచుకున్న కత్తితో అతని వీపుపై పొడిచింది. దీంతో అతను కుప్పకూలిపోయాడు.
కిందపడిన తర్వాత కూడా పావని విడిచిపెట్టలేదు. తాతాజీ మెడ, తల, వీపుపై తీవ్ర గాయాలు చేసింది. అక్కడికక్కడే తాతాజీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కొవ్వూరు మండలం ధర్మవరం -కాపవరం గ్రామాల మధ్య చోటు చేసుకుంది. ఆ దారిలో వెళుతున్న వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ ఎం.సురేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.