విశాఖ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నట్లుండి విమర్శనాత్మక జోస్యాలు మొదలు పెట్టారు. జగన్ తనంతట తాను తప్పుకుని భారతిని సిఎమ్ ను చేస్తే ప్రజల కష్టాలు తీరిపోతాయని అనేసారు.
ఇంకా చాలానే అన్నారు. అసలు ఇంతకీ విష్ణుకుమార్ రాజు సమస్య ఏమిటి? ఆయన ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యారు? అన్నది అనుమానం.
విశాఖలో సాయి ప్రియ రిసార్టు వుంది దాదాపు ఇరవై ఏళ్లుకు పైగా బీచ్ లో బ్రహ్మాండంగా నడుస్తూ కోట్లు సంపాదిస్తోంది. అయితే ప్రైవేట్ బీచ్ వున్న ఆ స్థలాన్ని ఆ రిసార్టు కొనుగోలుచేయలేదు.
దశాబ్దాల కాలం కిందట ప్రేమ సమాజం అనే ధార్మిక సంస్థ నుంచి వీలయినంత తక్కువ అద్దెకు లీజుకు తీసుకుంది. అయితే అంత స్థలాన్ని రిసార్ట్ కోసం వాడడం లేదు. ఏళ్ల తరబడి లీజు లెక్కన తన దగ్గరే వందల కోట్ల విలువైన ఆ స్ధలాన్ని వుంచుకుంది.
ఇలాంటి నేపథ్యంలో కోట్ల విలువైన ఆస్తులున్న ప్రేమ సమాజాన్ని దేవాదాయ శాఖ స్వాధీనంలోకి తీసుకుంది. గత రెండు దశాబ్దాల కాలంలో ప్రేమ సమాజం మీద పలు సార్లు వివాదాలు ఆరోపణలు వస్తూనే వున్నాయి.
ఈసారి మాత్రం ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని దాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఆ తరువాత ప్రేమసమాజం విలువైన భూముల సంగతేమిటని ఆరా తీయడం ప్రారంభించింది.
ఆ విధంగా ఈ రిసార్టు కు ఉపయోగించకుండా వుంచిన స్థలాన్ని వెనక్కు తీసుకుంది. రిసార్ట్ నడుస్తున్న కొన్ని ఎకరాల స్థలాన్ని అలాగే వుంచింది. అద్దెలు ఏ విధంగా వున్నాయన్నది పరిశీలించడం ప్రారంభించింది.
స్థలం కోసం చూసుకుంటే మొత్తం రిసార్ట్ చేజారిపోయేలా వుందని, ఆ సంస్థనే స్వచ్చంధంగా ఖాళీ ల్యాండ్ ను వెనక్కు ఇచ్చేసింది. ఇలా చేయడం పాపం లోలోపల బాధనే.
విష్ణుకుమార్ రాజుకు ఆ రిసార్ట్ నిర్వాహకులతో స్నేహమో, లేదా ఆయన పార్టీ మిత్రులకు రిసార్ట్ తో బంధాలో వున్నాయన్న గుసగుసలు వున్నాయి. ఇప్పుడు అదే ఆయన చేత అలా మాట్లాడిస్తోందని టాక్.
ఇన్నాళ్లు విశాఖలో గుట్టు చప్పుడు లేకుండా, పెద్దగా పెట్టుబడులు లేకుండా ప్రభుత్వ స్థలాలో, మరోకటో సంపాదించుకుని, సాగిస్తున్న వ్యాపారాలు అన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అదే అందరికీ బాధగా వుంది.