కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత రోజువారీగా పెరుగుతూ వెళ్లిన కోవిడ్-19 కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంది. ఒక దశలో రోజుకు లక్ష కేసుల వరకూ వెళ్లిన నంబర్ ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది.
రోజుకు నలభై వేల స్థాయికి తగ్గింది. అయితే.. ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి మరో వేవ్ లో విజృంభించడంతో మళ్లీ నంబర్ పెరిగింది. అయితే.. గత ఇరవై నాలుగు గంటల్లో నమోదైన కరోనా నంబర్లు మరికాస్త తక్కువగా ఉండటం గమనార్హం.
గత ఇరవై నాలుగు గంటల్లో దేశ వ్యాప్తంగా సుమారు 26,567 కేసులు నమోదు అయినట్టుగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నంబర్ కు ప్రత్యేకత ఏమిటంటే.. గత ఐదు నెలల్లో తొలి సారి ఇంత తక్కువ స్థాయిలో కేసుల సంఖ్య నమోదైంది. సరిగ్గా జూలై పదో తేదీన 26వేల స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.
ఆ తర్వాత క్రమక్రమంగా నంబర్ పెరుగుతూ వెళ్లింది. ఒక దశలో ఒక్కో రోజు లక్ష కేసుల స్థాయిలో నమోదయ్యాయి. తిరుగుముఖంలో నంబర్లు తగ్గుతూ, పెరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఐదు నెలల తక్కువ స్థాయి నంబర్ నమోదు కావడం ఒకింత ఊరటను ఇచ్చే అంశం.
ప్రజల కార్యకలాపాలు చాలా వరకూ మళ్లీ ఊపందుకున్నాయి. కొంత జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే.. ప్రజలు తమ కార్యకలాపాల్లో నిమగ్నమమయ్యారు. అయితే గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఇప్పటికీ కరోనా కారణ మరణాలు ప్రతి రోజూ వందల స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో కూడా 385 మంది కరోనా కారణంగా మరణించినట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
కొంతమంది యుక్త వయసులో ఉన్న వారు కూడా కరోనా బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిడ్నీలు తదితర వ్యవస్థలు దెబ్బతిని ఆసుపత్రి పాలవుతున్న కరోనా బాధితులు కూడా అక్కడక్కడ కనిపిస్తున్న దాఖలాలున్నాయి. నంబర్లు తగ్గినంత మాత్రాన కరోనా సోకిన వారిలో అందరి పరిస్థితీ సాఫీగా లేదని గుర్తుంచుకోవాలి.
ఈ మహమ్మారి బారిన పడిన వారిలో నూటికి ఒకటిన్నర శాతం మంది కరోనాతో ఇప్పటికీ మరణిస్తున్న దాఖాలాలు కనిపిస్తున్నాయి. భారీ నంబర్ల వారీగా చూస్తే కరోనా ప్రభావం తగ్గినట్టేమో కానీ.బాధితుల పరిస్థితిని దగ్గర నుంచి గమనిస్తే మాత్రం కరోనా ఇంకా కచ్చితంగా మహమ్మారే. జాగ్రత్త చర్యలు కొనసాగాల్సిందే.