ఓటు అంటే కొందరి దృష్టిలో ప్రజాస్వామ్యం సామాన్యుల చేతికి ఇచ్చిన ఆయుధం. మరికొందరి దృష్టిలో ఓటు అనేది నిరాయుధం. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాగుతున్న ఓటింగ్ సరళిని చూస్తే చాలా నిరాశజనకంగా ఉంది. ముఖ్యంగా విద్యావంతులు, ఉద్యోగులున్న ప్రాంతాల్లో ఓటింగ్ శాతం మరీ అధ్వానంగా నమోదైంది.
కానీ సినీ , వ్యాపార సెలబ్రిటీలు మాత్రం గుడ్డిలో మెల్ల అన్నట్టు ఉదయాన్నే ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం అభినందనీయం. ఈ నేపథ్యంలో ప్రముఖ కమెడియన్ హీరో రాజేంద్రప్రసాద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా గ్రేటర్ పోరులో ఓటు వేసేందుకు షూటింగ్ మానుకుని మరీ ఇక్కడికి వచ్చి ఓటు వేసినట్టు చెప్పుకొచ్చారు. రాజేంద్రప్రసాద్ చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
తాను విశాఖపట్నం జిల్లా అరకులో షూటింగ్లో ఉన్నానని, కేవలం ఓటు వేయడానికి మాత్రమే హైదరాబాద్ వచ్చినట్టు తెలిపారు. ప్రశ్నించే హక్కు ఊరికే రాదన్నారు. మనం ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు ప్రశ్నించే హక్కు కూడా ఉంటుందని ఆయన అన్నారు.
ఎప్పుడైతే మనం ఓటు వేయమో అప్పుడు నాయకులను ప్రశ్నించే హక్కును నైతికంగా కోల్పోయినట్టేనని తన అభిప్రాయంగా చెప్పారు.
కావున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. కానీ పోలింగ్ బూత్లు ఓటర్లకు నోచుకోక ఖాళీగా కనిపించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.