దేశంలోనే అత్యంత ఖరీదైన మున్సిపల్ ఎన్నికలుగా హైదరాబాద్ రికార్డు సృష్టించినట్లే వుంది. అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జనాలు చెప్పుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ ఒక్కో డివిజన్ కు మూడు కోట్ల వరకు ఖర్చు చేసిందని మిగిలిన పార్టీల నాయకులు అంటున్నారు.
అలా అని భాజపా కూడా తక్కువ తినలేదు. పక్క రాష్ట్రం కర్ణాటకలో అధికారంలో వుండడంతో, అక్కడి నుంచి పార్టీ నిధులు బాగానే వచ్చాయని గుసగుసలు వున్నాయి. ప్రతి డివిజన్ కు కోటి వంతున ఖర్చు చేసినట్లు టాక్ వుంది. ఇక ఎమ్ఎమ్ఐ కూడా మరీ భారీగా కాకున్నా, గట్టిగానే ఖర్చు చేసింది.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తరపున అంత సీన్ లేదు కానీ, అభ్యర్థులు యధాశక్తి ఖర్చు చేసారు. 150 డివిజన్లలో వందలాది మంది ఇండిపెండెంట్ లు పోటీ చేసారు. వారు తమ అనుచరులను వెంట తిప్పుకునేందుకు, వాహనాలకు, తిండి, మందు కు కూడా గట్టిగానే ఖర్చుచేయాల్సి వచ్చింది.
మొత్తం మీద అన్ని పార్టీలు, అందరు అభ్యర్ధులు కలిసి జనాల్లోకి 700 కోట్ల వరకు పంపించి వుంటారని లెక్కలు వినిపిస్తున్నాయి. కరోనా టైమ్ లో డల్ గా వున్న సిటీ మార్కెట్ లోకి ఇన్ని వందల కోట్లు డంప్ కావడం అంటే ఒక విధంగా మంచి పరిణామమే. కనీసం మార్కెట్ అన్నా పుంజుకుంటుంది.