'బాలీవుడ్ లో నెపోటిజం ఉంది..ఉంటుంది.. దీనిపై ఇప్పటికే చాలా వాదన జరుగుతూ ఉంది, ఇంకా ఎంతైనా వాదించవచ్చు.. అయితే దాన్నొక సమస్యగా చూస్తే దానికి పరిష్కారం లేదు..' అని అంటోంటి నటి తాప్సీ. నెపోటిజం అంశానికి ఎలాంటి పరిష్కారం లేదని.. ఆమె కుండబద్ధలు కొట్టింది. ఎవరు ఒప్పుకున్నా, కంగనా లాంటి వాళ్లు తలకిందుల తపస్సు చేసినా .. తాప్సీ చెప్పింది మాత్రం వాస్తవం. ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఎక్కడైనా బంధుప్రీతికి చెక్ పెట్టే అవకాశం ఉండదు, లేదు, రాదు! అది మానవతత్వం.
అవకాశాలు ఇచ్చే వాడు..తన బంధువులకే ఇవ్వాలి, తన ఇంట్లో వాళ్లకే ఇవ్వాలి, కష్టమో నష్టమో వారితోనే అని బలంగా ఫిక్స్ అయితే బయటవాళ్లు ఏం చేయగలరు? అదే పరిశ్రమ అయినా.. డబ్బు పెట్టే వాడి ఇష్ట ప్రకారం బండి నడుస్తుంది కానీ, మరెవరికి నిర్ణయాధికారం ఉండదు.
ప్రతిభ కలిగి ఉండటం ఏ నటుడికి-నటికి అయినా గొప్పే అయ్యి ఉండొచ్చు. కానీ వారికి ప్రతిభ ఉన్నంత మాత్రానా.. అవకాశాలు ఇవ్వాలని, వారిపై కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని ఎవ్వరూ డిమాండ్ చేయలేరు. ఇండస్ట్రీలో నెపోటిజం గురించి ఎంతైనా దుమ్మెత్తిపోయవచ్చు. ఈ విషయంలో ఒక దశలో అయ్యో పాపం అనే జనాలు, ఆ తర్వాత ఆ తతంగాన్ని అంతా లైట్ తీసుకుంటారు. అయ్యోపాపం.. ఏ సుశాంత్ మీదో జాలి చూపించే వాళ్లు కూడా.. తాము పని చేస్తున్న రంగంలో తమ చేతిలో ఉన్న అవకాశాలను ఎవరికి ఇస్తారు?
ఏ రంగంలో పని చేసే వాళ్లు అయినా.. తమకు తెలిసిన వారికి, తమకు బంధువులు అయ్యే వారికి అవకాశాలు ఇవ్వడానికి మొగ్గుచూపుతారు. బయటి వాళ్ల అవసరం ఉంది, వీళ్ల పనికి వారు కచ్చితంగా ఉపయోగపడతారు, బయటి వాళ్లను పెట్టుకుంటే లాభం ఉంటుందన్నప్పుడు బయటి వాళ్లను పెట్టుకుంటారు. అందులో ఉద్ధరించడం ఏమీ ఉండదు, జస్ట్ వ్యాపారం! సినిమా పరిశ్రమ అయినా అంతే కదా!
జాన్వీ కపూర్ తో కరణ్ జొహార్ సినిమా చేశాడు.. అంటే, శ్రీదేవి కూతురుగా ఆమె కు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నం అది. అంతే కానీ.. శ్రీదేవి కూతురు అనాకారి అయ్యుంటే ఆమెను తెచ్చి పెట్టలేడు కదా! అల్లు శిరీష్ ను అల్లు అరవింద్ హీరో గా తెచ్చాడు, కొన్ని సినిమాలు చేయించాడు, అలాగని 'గీతాగోవిందం' కోసం మరో హీరోని తెచ్చాడు. ఈ నిర్మాతలో వ్యాపారి కూడా ఉన్నాడు! కాబట్టి.. మనగలుగుతున్నాడు. అలా కాకుండా గీతాగోవిందం సినిమాను కూడా కొడుకుతోనో చేయించుకుని ఉంటే.. అది వేరే సంగతి. కాబట్టి.. కోట్ల రూపాయలు పెట్టే వాళ్లు లాభనష్టాలనే ఎక్కువగా బేరీజు వేసుకుంటారు. అలా కాకుండా.. ఎంతసేపూ సొంత వాళ్లనే నిలబెట్టుకోవడానికి ప్రయత్నించే నిర్మాతలు ఒకటీ రెండు సినిమాల తర్వాత అడ్రస్ లేకుండా పోతున్న వైనాలను కూడా అంతా గమనిస్తూనే ఉన్నారు.
నెపోటిజం అంటూ కంగనా లాంటి వాళ్లు అరిచి గీ పెట్టవచ్చు గాక.. రేపు కంగనా తనకు పిల్లలను పుడితే వారిని బాలీవుడ్ లో నిలబెట్టుకోవడానికి ప్రయత్నించదా? అలా చేయనంటూ ఆమె ఇప్పుడు చెప్పగలదా? ఈ పరిణామాలన్నింటినీ విశ్లేషించే, తాప్సీ ఈ విషయంలో కుండబద్ధలు కొట్టింది. బాలీవుడ్ లో నెపోటిజం కొనసాగుతుందని, దాన్ని ఎవరూ కొందరు ఆశిస్తున్న పరిష్కారం ఏదీ దక్కదని ఆమె తేల్చి చెప్పింది. కంగనా ఒప్పుకోదేమో కానీ, ఇదైతే వాస్తవం!