ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో వస్తున్న తీర్పులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని భూకుంభకోణంపై ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ తీవ్ర దుమారం రేపింది. ఆ ఎఫ్ఐఆర్లో కొందరు ప్రముఖులు, వాళ్ల పిల్లల పేర్లు ఉండడంతో …అసలు అందులోని విషయాలను రాయడానికి వీల్లేదని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
లోక్సభ, రాజ్యసభల్లో ప్రతిరోజూ ఏపీ హైకోర్టు తీర్పులను నిరసిస్తూ అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతున్నారు. దీంతో ఏపీ హైకోర్టు తీర్పులు దేశ వ్యాప్త దృష్టిని ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయ వ్యవస్థ తీరుపై న్యాయకోవిదులు, ప్రముఖ జర్నలిస్టులు , ప్రజా సంఘాల నేతలు, ఉద్యమకారులు తమదైన శైలిలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరంపరలో జస్టిస్ బి.శేషశయనారెడ్డి వెల్లడించిన అభిప్రాయం అమూల్యమని చెప్పొచ్చు. ఆయన వెల్లడించిన అభిప్రాయంలో ముఖ్యమైన అంశాల్ని తీసుకొందాం.
“న్యాయమూర్తులు విమర్శలకు ఆస్కారం ఇచ్చేలా వ్యవహరించొద్దు. మన తీర్పులు మాట్లాడాలే తప్ప మనం మాట్లాడకూ డదు. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. సామాన్య ప్రజలు కూడా న్యాయ వ్యవస్థ మీద, న్యాయమూర్తుల మీద విమర్శలు చేస్తున్నారంటే, పరిస్థితి ఎక్కడికి వచ్చిందో అర్థం చేసుకోవాలి.
జడ్జిల మీద ప్రజల్లో అనేక సందేహాలు ఏర్పడేందుకు ఆస్కారం కల్పించినట్టైంది. జడ్జిలు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని ఆయన నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ప్రధానం ఆయన చెప్పిందాంట్లో మన తీర్పులు మాట్లాడాలే తప్ప … మనం మాట్లాడకూదనేది ఎంతో విలువైంది. ఇటీవల కాలంలో రాష్ట్ర ఉన్నతాధికారులపై హైకోర్టులో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. న్యాయమూర్తుల కామెంట్స్ రాజకీయపరంగా ఉన్నాయనే అభిప్రాయాలు లేకపోలేదు. జస్టిస్ శేషశయనారెడ్డి అభిప్రాయాలను ప్రతి న్యాయమూర్తి పరిగణలోకి తీసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.