మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు … కుక్కను మనిషి కరిస్తేనే వార్త అవుతుందంటారు. అలాగే భర్త మద్యం తాగి భార్యను హింసిస్తే వార్త కాదు … కానీ భార్య తాగి భర్తను హింసిస్తే అదో పెద్ద వార్త. అలాంటి వార్తకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం.
గుజరాత్ రాష్ట్రంలో భార్య తాగి వెళ్లి భర్తను హింసిస్తోంది. దీంతో భార్య నుంచి తనకు రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయిం చాడు. అహ్మదాబాద్లోని మనినగర్కు చెందిన ఓ వ్యక్తికి 2018లో పెళ్లైంది. పెళ్లయిన తర్వాత భార్య గురించి తెలిసిన ఓ నిజం అతన్ని షాక్కు గురి చేసింది. భార్యకు తాగుడు అలవాటు ఉందని అతనికి తెలిసొచ్చింది. దీంతో అతను భార్యా బాధితుడిగా మారాడు.
భార్య మద్యం సేవించి ఇంటికెళ్లి భర్తతో పాటు అత్తమామల్ని కూడా చితకబాదేది. దీంతో ఆ భర్త శారీరకంగా, మానసికంగా కుంగిపోయాడు. ఆ ఇల్లాలి వేధింపులకు ఇంటికే పరిమితం కాలేదు. మందు ఎక్కువగా తాగినప్పుడు ఏకంగా అతను పనిచేసే ఆఫీస్కు వెళ్లి గొడవకు దిగేది. భార్య వేధింపులు తాళలేక తల్లిదండ్రులను విడిచి విడిగా ఉంటున్నారు.
ఇటీవల తల్లిదండ్రులు కరోనాబారిన పడడంతో మళ్లీ వాళ్ల వద్దకు వచ్చాడు. భార్య కూడా వచ్చి మొదటి అంతస్తులో ఉంటూ భర్తను చితకబాదేది. భర్తతో పాటు అత్తమామలను చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా…. తిరిగి మహిళా హెల్ప్లైన్ టోల్ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి భర్తపై తప్పుడు ఫిర్యాదు చేసి … మరో రకంగా వేధింపులకు గురి చేసేది.
ఇక భరించలేక , భార్యతో తాడోపేడో తేల్చుకోవాలని భావించిన అతను పోలీసులను ఆశ్రయించి తన గోడు చెప్పుకున్నాడు. మద్యానికి బానిసైన భార్య నుంచి తన కుటుంబానికి రక్షణ కల్పించాలని సదరు భార్యా బాధితుడు కోరాడు.