లోకేషేమో 1978- వాజ్ పేయి- ప్రధానమంత్రి- చంద్రబాబు నాయుడు.. అని అంటారు. చంద్రబాబేమో విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో పెట్టింది తనే అంటూ పల్లవి మార్చారు. ఇదే ట్యూన్ లో హైదరాబాద్ ను ప్రపంచపటంలో పెట్టింది తనే అని చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారు.
తడిక ప్లేస్ లో లడికి పెట్టినట్టుగా హైదరాబాద్ ప్లేస్ లో విశాఖపట్నం పెట్టారు చంద్రబాబు నాయుడు. అంతా సేమ్ టూ సేమ్! విశాఖపట్నాన్ని కూడా ప్రపంచంలో పటంలో పెట్టారట! ఇంతకీ ఈ మ్యాప్ పాయింటింగ్ డ్యూటీ చంద్రబాబు నాయుడు ఏకాలంలో చేశారో మరి!
మరోవైపు బాలకృష్ణ .. తన చేయి దురుసును ప్రదర్శిస్తూ ఉన్నారు. తన అభిమానులను వీపీల కింద జమ కట్టి ఆయన కొడుతూ ఉన్నారు! అభిమానుల వేలం వెర్రి లేకపోతే ఈ సినిమా హీరోకీ మనుగడ లేదు. అయితే ఆ అభిమానులకు ఇలా చేయి దురుసుతో సమాధానం చెప్పడం బాలకృష్ణ స్టైల్.
ఇదీ తెలుగుదేశం ముఖ్యనాయకత్వం తీరు. నారా లోకేషేమో తన తడబాట్ల కామెడీని కొనసాగిస్తూ ఉన్నారు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా.. అనే సామెతను గుర్తు చేస్తున్నారు లోకేష్. సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనకు మనమే ఉరేసుకున్నట్టే అంటూ దశాబ్దం కిందటే సెలవిచ్చిన లోకేష్.. అదే తీరును తన ప్రసంగాల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు.
చంద్రబాబు ఏమో.. తన మాటలు వింటూ ఈ తరం కుర్రకారు నవ్వుకుంటోందని, అరిగిపోయిన రికార్డులు వేస్తుంటే అవి అతకడం లేదనే ప్రాథమిక విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. జస్ట్ హైదరాబాద్ పేరు తీసి.. విశాఖ పెట్టి చంద్రబాబు నాయుడు మళ్లీ రీమిక్స్ ప్రసంగాలతో తనెంత కామెడీ చేస్తున్నట్టో గ్రహించలేకపోతే ఆయనకు ఏమైందో అనే అనుమానాలు రాకమానవు.
స్థూలంగా స్థానిక ఎన్నికల ప్రచారంలోకి దిగి.. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, లోకేష్ లు.. తమ తమ రొటీన్ కామెడీలను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విషయంలో ఎవ్వరికి ఎవ్వరూ తగ్గడం లేదు. మరి స్థానిక ఎన్నికల విషయంలోనే ఇంత కామెడీ అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ కామెడీలు మరింత పతాక స్థాయికి చేరతాయేమో!