అభిమానులపై ఆకతాయి చేష్టలకు పాల్పడటం నందమూరి బాలకృష్ణకు అలవాటే అని వేరే చెప్పనక్కర్లేదు. ఒక సారి అయితే ఏదో ఆవేశం అనుకోవచ్చు.. అయితే అలవాటుగా బాలకృష్ణ రెచ్చిపోతూనే ఉంటారు.
ఎన్నికల ప్రచార సందర్భంలో కూడా బాలకృష్ణ కాస్త తగ్గి ఉండరు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం సమయంలో హిందూపురం ఏరియాలోనే బాలకృష్ణ అనుచితంగా ప్రవర్తించారు. రాజకీయ ప్రచారం, షూటింగు స్పాటు ఇలా బాలకృష్ణ అనుచిత ఆవేశానికి ఎక్కడా మినహాయింపు ఉండదు.
ఇక బాలకృష్ణ రెచ్చిపోయి కొట్టిన వీడియోలు వైరల్ అయ్యాకా.. ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ వాళ్లూ డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెడతారు. ఆ డ్యామేజ్ కంట్రోల్ వల్ల ప్రయోజనం మాట అటుంచితే.. దాని వల్ల మరింత డ్యామేజ్ మాత్రం తప్పడం లేదు.
బాలకృష్ణ రెచ్చిపోయినప్పుడల్లా డ్యామేజ్ కంట్రోల్ ఒకలాగే ఉంటుంది. బాలకృష్ణ చేత దెబ్బలు తిన్న వాళ్ల జన్మ ధన్యం అయ్యిందని చెప్పించడమే ఈ డ్యామేజ్ కంట్రోల్ సారాంశం. ఒకసారి కాదు.. ప్రతిసారీ ఇదే లెక్కే!
బాలకృష్ణ చేత దెబ్బలు తిన్నవాడి చేతే.. ఆయన అలా కొట్టడం తన అదృష్టమని ఒప్పజెప్పించే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంటుంది. హిందూపురంలో బాలకృష్ణ చేత దెబ్బలు తిన్న కుర్రాడి చేత కూడా అలాంటి వీడియో ఒకటి చేయించారు. బాలకృష్ణ మతిస్థిమితం లేని చర్యలు , అనుచిత చర్యలు పార్టీకి నష్టం అవుతాయనే లెక్కలతో టీడీపీ వాళ్లు ఈ వీడియో ప్రహసనానికి తెర తీశారు.
అయితే తెలుగుదేశం పార్టీ చేసే ట్రిక్స్ మరింత నవ్వులపాలవుతున్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు బాలయ్య చేత తన్నులు తినడం అంత అదృష్టం అనుకుంటే వరస పెట్టి తన్నించుకోవచ్చు. అదేదో సినిమాలో తన్నుల బాబా ఉన్నట్టుగా బాలకృష్ణ ను తన్నుల నేతగా చేసుకుని వరస పెట్టి క్యూలో నిలబడి తన్నించుకోవచ్చు.
అయితే.. ఈ కామెడీని జనాల ముందు ప్రదర్శిస్తూ టీడీపీ వాళ్లు నవ్వులపాలవుతున్నారు. ఆయన రెచ్చిపోవడమే కామెడీ అయితే, దాన్ని తమ అదృష్టంగా చిత్రీకరిస్తూ .. వీళ్లు మరింత కామెడీ చేసి స్థూలంగా బోలెడంత డ్యామేజ్ చేసుకుంటున్నారు. దీనికి బదులు బాలకృష్ణను జనాల మధ్యకు రానివ్వకుండా చూసుకుంటేనే టీడీపీకి ప్రయోజనమేమో!