Advertisement

Advertisement


Home > Articles - MBS

సినీ స్నిప్పెట్లు 01 - ఎన్టీయార్‌

సినీ స్నిప్పెట్లు 01 - ఎన్టీయార్‌

ఇది కొత్త శీర్షిక. తెలుగు, హిందీ, అప్పుడప్పుడు యితర భాషాచిత్రాల గురించిన కొన్ని కబుర్లు. ప్రస్తుతం రాస్తున్నవన్నీ మరీ సీరియస్‌ టోన్‌లో వున్నాయని యిది ప్రారంభిస్తున్నాను. సినిమా ముచ్చట్లు అనే శీర్షిక చాలామంది వుపయోగిస్తున్నారు కాబట్టి దానితో ప్రాస కుదిరేట్లు స్నిప్పెట్‌ (సమాచార శకలం, ఏదైనా పుస్తకంలోని ఉటంకింపు) అనే యింగ్లీషు పదాన్ని తెలుగైజ్‌ చేసుకున్నాను. గతంలో తెర వెనుక విశేషాలు ఎవరూ చెప్పేవారు కారు. గత 15, 20 ఏళ్లగా అందరూ చెప్పడం ప్రారంభించారు. ఎవరైనా ఏదైనా చెప్పగానే దినపత్రికల వాళ్లు, ఎఫ్‌ఎమ్‌ వాళ్లు, టీవీ యాంకర్స్‌ అందరూ వాటిని పదేపదే ప్రస్తావిస్తున్నారు. అయినా మనం మిస్సయ్యేవి కొన్ని వుంటూనే వుంటాయి. నాకు తారసిల్లినవి నేను యిక్కడ చెపుతున్నాను. వాటిలో కొన్ని మీలో కొందరికి యిప్పటికే తెలిసి వుండవచ్చు. వాటిని వదిలి మిగతావి చదవండి.

మే 28 న ప్రారంభిస్తున్నాను కాబట్టి ఎన్టీయార్‌ ఉదంతాలు మొదటగా చెప్పడం సముచితం. ''యువచిత్ర'' బ్యానర్‌పై మంచి సినిమాలు తీసిన కె మురారి ''నవ్విపోదురు గాక..'' అనే పేరుతో 520 పేజీల్లో తన జీవితచరిత్ర రాసుకున్నారు. మూడేళ్ల క్రితం అది వెలువడినప్పుడు దానిలోని నాలుగైదు విషయాలను పట్టుకుని పుస్తకాన్ని వివాదాస్పదంగా చిత్రీకరించారు. నిజానికి దానిలో ఆయన చాలా విషయాలు బాగా రాశాడు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, వ్యవసాయ కుటుంబాలు రాజకీయాల్లోకి రావడం యిత్యాది అనేక విషయాలు విపులంగా తన కోణంలో రాశారు. నిజానికి వాటికి అక్కడక్కడ కల్పన, నాటకీయత జోడించి టీవీ సీరియల్‌గా తీస్తే ''బునియాద్‌'' వంటి మంచి సీరియల్‌ తయారయ్యేది. ఆయన రాసిన కొన్ని విషయాలు మనకు తెలిసిన నటీనటుల్ని కొత్త కోణంలో చూపుతాయి కూడా. ఎన్టీయార్‌ గురించి ఆయన రాసిన ఒక సంఘటన రాస్తున్నాను. 

సాయంత్రం మీటింగుకి వెళ్లినపుడు యూనిట్‌కు సకల మర్యాదలు జరిగాయి, వాళ్ల కార్లను వేదిక దాకా వెళ్లనిచ్చారు, ముందు వరుసలో కూర్చోబెట్టారు. వేదికపై ఎన్టీయార్‌ మైక్‌ వద్దకు వచ్చి 'అందరికీ స్వాగతం, యువచిత్ర యూనిట్టంతా వచ్చినందుకు నిర్మాత మురారి గారికి ధన్యవాదాలు'' అని ''రండి మురారిగారూ'' అంటూ వేదికపైకి పిలిచారు. శోభన్‌బాబు చెప్పినదానిలో మొదటిది నిజమైంది. మురారికి ఆనందంతో బాటు అనుమానం, కాళ్లలో వణుకు ప్రారంభమైంది. కదలలేదు. సావిత్రిగారు నవ్వుతూ చెయ్యి తట్టి ''నిన్నే పిలుస్తున్నారు, వెళ్లు'' అన్నారు. ''నీ పని అయ్యిందిలే'' అన్నట్టు చలం చూస్తున్నారు. శోభన్‌బాబు మాత్రం ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని లేచి నిలబడి తన చెయ్యి పట్టుకుని స్టేజి దాకా తీసుకెళ్లారు. కాస్త అయోమయస్థితిలోనే యీయన వేదికపైకి వెళ్లారు. ఎన్టీయార్‌ రాజసంగా తన చూపులతోనే వేదికపై మురారి స్థానాన్ని సూచించారు. వెళ్లి కూర్చున్నారు. తర్వాత దాసరి, సావిత్రి, శోభన్‌, చలం - అందర్నీ వేదికపై ఆహ్వానించారు. సావిత్రి పైకి రాగానే రామారావుగారి పక్కన పదహారణాల తెలుగింటి యిల్లాలులా వున్న ఆయన భార్య బసవతారకం గారికి నమస్కరించారు. అది చూడగానే మురారి అసంకల్పితంగా లేచి తనూ ఆవిడకు నమస్కరించారు.

కాస్సేపటికి దాసరి మైక్‌ తీసుకుని యూనిట్‌ అందర్నీ పరిచయం చేయడం మొదలుపెట్టారు. మొదటగా మురారి పేరు చదివారు. ఈయన బింకంగా, తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో దండ తీసుకోకుండా ఎన్టీయార్‌ వద్దకు వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దండ వేయకూడదని, కేవలం నమస్కారం పెట్టి వచ్చేద్దామని మురారి ప్లాను. కానీ కాస్సేపు పోయాక చూస్తే యీయన దండ వేయడం, పెద్దాయన 'రండి మురారిగారూ' అంటూ దగ్గరకు తీసుకోవడం జరిగాయి. ఇదెలా జరిగిందో తనకే తెలియలేదంటారు మురారి. తన ఆత్మకథలో ''నా చేతికి ఎవరు దండ యిచ్చారో, నేను ఎలా వేశానో నాకే తెలియదు. చలం అంతకుముందే అన్నారు - 'ఆయన ముఖంలోని తేజస్సు మనల్ని మనకి తెలియకుండానే ఆకర్షణలో పడేస్తుంది' అని. తర్వాత ఏం జరిగిందో నాకు యిప్పటికీ గుర్తు లేదు. తెలియని అనుభూతి. నాలో నేను లేను. నిజంగానే ఆయన రారాజు.'' అని రాసుకున్నారు.

తన అవస్థ చూసి చలం, శోభన్‌బాబు నవ్వుతూంటే మురారికి కోపం రాలేదట. తెలియని ఆనందపు మైకంలో వాళ్లకి మనసులోనే ధన్యవాదాలు చెప్పారట. మురారి మైకం, తన్మయత్వం గమనించిన శోభన్‌ ఆయన కుర్చీలో కూర్చోబోతూంటే కిందపడి పోతాడేమో అన్నట్లుగా లేచి పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టారు. మర్నాడు షూటింగు లంచ్‌లో అందరికీ స్వీట్లు, కోడికూర. ''మురారి పందెం ఓడితే యిలా వుంటుందన్నమాట'' అన్నారు సావిత్రి. 'ఇది ఓడడం కాదు, ఓడి గెలవడం' అనుకున్నారు మురారి లోలోపల. - (సశేషం) 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2015)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?