Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: జెమినీ గణేశన్‌ కెరియర్‌

ఎమ్బీయస్‌: జెమినీ గణేశన్‌ కెరియర్‌

''మహానటి'' సినిమాకు ప్రజలు బాగా కనెక్ట్‌ అవడంతో మంచి కమ్మర్షియల్‌ సక్సెసయింది. దానిలో దొర్లిన తప్పులు కొందరు ఎత్తి చూపుతున్నారు. సావిత్రికి జెమినీ గణేశనే తాగుడు అలవాటు చేశాడనడానికి ఆధారం ఏమిటని ఆయన పెద్ద భార్య కూతురు డా.కమలా సెల్వరాజ్‌ అడిగారు. వెంకట్రామయ్య చౌదరే అలవాటు చేశారని రమాప్రభ అంటున్నారు. దాన్ని బయోపిక్‌ అనకుండా సావిత్రి జీవితంపై ఆధారపడిన సినిమా అని ఉంటే (''డర్టీ పిక్చర్‌'' సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా తీశాం అని చెప్పుకున్నట్లు...) గొడవ వుండేది కాదు.

చాలాభాగం వాస్తవాలు, కొన్ని అవాస్తవాలు కలపడంతో గొడవ వచ్చిపడింది. నాటకీయత కోసం, ముఖ్యపాత్ర (ప్రొటగానిస్టు)పై ప్రేక్షకుడికి సింపతీ పోకుండా ఉండడం కోసం కొన్ని పొయెటిక్‌ లిబర్టీస్‌ తీసుకోక తప్పదు. కానీ సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి దీనిలో వాస్తవాలే చూపించారు అని సర్టిఫై చేయడంతో చిక్కు వచ్చింది. చిన్న చిన్న డిటెయిల్స్‌లో వచ్చిన తప్పుల గురించి నేనిక్కడ రాయటంలేదు. జెమిని గణేశన్‌తో బంధం గురించి సినిమాలో చూపిన తీరు గురించే నేను రాస్తున్నాను.

నిజానికి సావిత్రి జీవితాన్ని యథాతథంగా తీస్తే ప్రేక్షకుల్లో సానుభూతి కలగడం కష్టం. కేవలం ఆమె బాల్యం, నటజీవితం గురించి మాత్రం తీస్తే డ్రామా ఉండదు. ఆమె తెరమీద జీవితంలో ఎంత డ్రామా ఉందో, తెరవెనుకా అంత ఉంది. తనెన్నో తప్పులు చేసిందని ఆమెయే స్వయంగా చెప్పుకునేది. అయినా ఆమె ఆంధ్రుల అభిమాన నటి కాబట్టి అవన్నీ చూపలేరు. చూపిస్తే జనాలకు నచ్చదు. అలా అని జెమినీతో గొడవ చూపకుండా మానలేరు. అతన్ని పూర్తిగా విలన్‌ చేయలేరు, అదే సమయంలో అతనిలో కొన్ని లోపాలు చూపాలి. ఆ లోపాల వలన మన హీరోయిన్‌ బాధపడి, దేవదాసు టైపులో తాగుడుకి బానిసై, ఆరోగ్యం చెడగొట్టుకుని మరణించిందని చూపదలచారు.

జెమినీ పాత్ర వేసినతను కూడా హీరోయే కాబట్టి ఆ లోపాలకు కూడా జస్టిఫికేషన్‌ చూపించాలి. అందువలన అతను తనకంటె ప్రతిభావంతురాలైన భార్యను చూసి అసూయపడి, తనకు వేషాలు రాక, ఆత్మన్యూనతాభావంతో అలమటించి, దాన్ని పోగొట్టుకోవడానికి కాబోలు ఎవరో అమ్మాయితో శయనిస్తే, దాన్ని కళ్లారా చూసిన హీరోయిన్‌ తట్టుకోలేక తన జీవితాన్ని ఆత్మహత్యాసదృశమైన బాట పట్టించిందని, ఆ ఆవేదనలోనే పిల్లలను సరిగ్గా పట్టించుకోలేక పోయిందని చూపించారు. ఈ కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానిలో వాస్తవాల గోల వాళ్లకు అక్కరలేదు. అయ్యోపాపం, సావిత్రి అనుకున్నారు, చాలు, సినిమా ఆడేస్తోంది.

ఈ సినిమా హిట్‌ కావడంతో యీ కల్పనే కొన్నాళ్లకు నిజమై కూర్చుంటుంది. ''మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఞి'' పేరుతో పల్లవి అనే ఆమె ఒక జీవితచరిత్ర రాశారు. దానిలో హాలీవుడ్‌ నటీమణి, సావిత్రి కంటె 17ఏళ్లు పెద్దదైన సూసన్‌ హేవర్డ్‌ సావిత్రి సినిమాలు చూసి, ఆమెకు అభిమాని అయినట్లు, సావిత్రిని అభినందిస్తూ ఒక ఉత్తరం రాసినట్లు కల్పించారు. నిజానికి సూసన్‌ హేవర్డ్‌ సావిత్రి అభిమాన నటి. ఆమె సావిత్రి సినిమాలు చూసే అవకాశమే లేదు. చూసినా ఉత్తరం రాసిన దాఖలాలు లేవు. ఇది కల్పించిన రచయిత్రి, యిది కల్పన అని ఎక్కడా రాయలేదు.

అసలా పుస్తకం పూర్తి వాస్తవాలతో కూడిన జీవితచరిత్రో, లేక చిక్కనైన కథనం కోసం కల్పన రంగరించిన రచనో ఎక్కడా తెలుపలేదు. కొన్నేళ్లు పోయిన తర్వాత దానిలో రాసినవన్నీ అక్షరసత్యాలని ప్రజలు భ్రమించే ప్రమాదం ఉంది. అలాగే ''మహానటి'' సినిమా చూసిన భావితరాల వారు సావిత్రికి వచ్చిన పేరు చూసి జెమినీ అసూయపడ్డాడని నమ్మవచ్చు. భావితరాల మాట ఎలా వున్నా యీ తరంలోని వారు కూడా పూర్తి వివరాల జోలికి వెళ్లకపోతే అలా అనుకునే ప్రమాదం ఉంది. అందుకని ఆ వివరాలు సేకరించి యిస్తున్నాను.

జెమినీ గణేశన్‌ 1920లో పుట్టాడు. సావిత్రి కంటె 15ఏళ్లు పెద్దవాడు. తండ్రి చిన్నప్పుడే పోతే మద్రాసులో మేనత్త ముత్తులక్ష్మీ రెడ్డి వద్ద చేరాడు. ఆవిడ డాక్టరీ చదివి దేవదాసీ వ్యవస్థను రూపుమాపడానికి సామాజిక ఉద్యమం నడిపేది. కొంతకాలం ఆవిడ వద్ద చదువుకుని, తర్వాత తల్లి వద్దకు పుదుక్కోటైకు వచ్చి. ఆ తర్వాత మద్రాసులో సైన్సు గ్రాజువేట్‌ అయ్యాడు. 1940లో పెళ్లయింది. డాక్టరీ చదివిస్తానన్న మావగారు పెళ్లయిన ఆర్నెల్లకే చనిపోవడంతో మద్రాసులో కెమిస్ట్రీ లెక్చరరు ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. 1947లో జెమినీ స్టూడియోలో ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరాడు. ''మిస్‌ మాలిని'' (1947)లో పుష్పవల్లి పక్కన హీరోగా పరిచయమయ్యాడు. అది ఆడలేదు. అక్కడ ఉండగానే సావిత్రి టాలెంటు గుర్తుపట్టి సిఫార్సు చేయడం జరిగింది.

ద్విపాత్రాభినయం చేసిన ''మనం పోల్‌ మాంగల్యం'' (1953)తోనే స్టార్‌డమ్‌ వచ్చింది. దానిలో అతని పక్కన సావిత్రి హీరోయిన్‌. ఆ సినిమా షూటింగు సమయంలోనే 1952లో వాళ్లిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అప్పటికి సావిత్రికి 17 ఏళ్లయితే జెమినీకి 32. ఏమీ తెలియని పల్లెటూరి అమ్మాయిలా వున్న సావిత్రికి అతను హైఫై లైఫ్‌ పరిచయం చేశాడనీ, అనేక కొత్త విషయాలు నేర్పాడని, అభిరుచులు మప్పాడని సినిమాలో కూడా చూపారు. చిన్నతనంలోనే చనిపోయిన తండ్రి పట్ల అబ్సెషన్‌ ఉన్న సావిత్రి అతనిలో తన తండ్రిని చూసుకుందని సటిల్‌గా ఎస్టాబ్లిష్‌ చేశారు కూడా. పెళ్లయ్యాక యిద్దరి దశ తిరిగింది. కలిసి వేసిన సినిమాలూ, విడివిడిగా వేరే వాళ్లతో వేసిన సినిమాలూ కూడా హిట్టయ్యాయి. సావిత్రి ఎంత పెద్ద హీరోయిన్‌ అయిందో తెలుగువాళ్లందరికీ తెలుసు. సినిమాలో కూడా చూపించారు. 

అయితే జెమినీ గణేశ్‌ ఏపాటి హీరో, అతని మార్కెట్‌ ఎలా ఉండేది? ఎంతవరకు ఉంది? అనేది మన తెలుగువాళ్లల్లో చాలామందికి తెలియదు. అతను సావిత్రి డబ్బుపై పడి తిన్న పరాన్నభుక్కు అని కూడా కొందరు అనుకుంటారు. అందువలన అతని కెరియర్‌ గురించి కాస్త రాస్తాను. తమిళంలో శివాజీ, ఎమ్జీయార్‌ టాప్‌ స్టార్స్‌. వాళ్లతో పాటే యితర హీరోలు కూడా ఉండేవారు. మన దగ్గర జగ్గయ్య, కాంతారావు, హరనాథ్‌ ఉన్నట్లు! వీళ్లు స్వతంత్రంగా హీరోలుగా వేస్తూనే ఎయన్నార్‌, ఎన్టీయార్‌లతో బాటు పారలల్‌ హీరోగా వేసేవారు. అటువంటి పారలల్‌ హీరో పాత్రల్లో జెమినీ చక్కగా ఒదిగేవాడు.

ఎమ్జీయార్‌తో ఒక్క సినిమాయే వేసినా, శివాజీతో చాలా వేశాడు. విడిగా హీరోగా అతనికి చాలా డిమాండ్‌ ఉండేది. విజయావారు తీసిన మిస్సమ్మ, గుణసుందరి, మాయాబజార్‌, అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మ కథ తమిళ వెర్షన్లలో అతనే హీరో. ముక్తా శ్రీనివాసన్‌, శ్రీధర్‌ వంటి దర్శకనిర్మాతలు, బాలచందర్‌ వంటి దర్శకులు - అందరూ జెమినీని యిష్టపడేవారు. అతనికి దర్శకుడితో కాని, సహనటుడితో కాని ఎప్పుడూ పేచీలు రాలేదు. జానపద, చారిత్రాత్మక, పౌరాణిక, సాంఘిక సినిమాలన్నిటిలోను నటించాడు. ఎక్కువగా ప్రేమకథా చిత్రాలలో నటించడం వలన 'కాదల్‌ మన్నన్‌' (ప్రేమకు రాజు) అనే బిరుదు వచ్చింది. ఎప్పుడూ బిజీగానే ఉన్నాడు. వేషాల కోసం వెతుక్కోవలసిన పని ఎన్నడూ లేదు.

ఇక సినిమాల్లో చూపించిన పీరియడ్‌ గురించి ఫోకస్‌ చేసి చూస్తే సినిమాలో చూపించినదేమిటంటే - కొద్దికాలం పోయాక చూస్తే సావిత్రి బాగా డిమాండ్‌లో ఉంది, కానీ జెమినీకి మార్కెట్‌ పోయింది. అంతా సావిత్రి గురించే అడుగుతున్నారు, అతని గురించి అడిగేవారే లేరు. దాంతో అతని అహం దెబ్బతింది. ఈ స్టోరీ లైన్‌ అమితాబ్‌, జయ నటించిన ''అభిమాన్‌'' సినిమా నుంచి తీసుకున్నారు. ఆ సినిమాలో అమితాబ్‌ పేరున్న గాయకుడు, పల్లెటూరిలో అజ్ఞాతంగా ఉంటూన్న ప్రతిభావంతురాలైన ఒక గాయనిని చూసి, ముచ్చటపడి పెళ్లి చేసుకున్నాడు. ఆమెను బలవంతపెట్టి స్టేజి ఎక్కించాడు. తీరాచూస్తే ఆమెకు అతని కంటె ఎక్కువ పేరు వచ్చింది. ఆమె మార్కెట్‌ ముందు యితనిది వెలతెల పోయింది. ఇతను అసూయపడ్డాడు, వాళ్ల కాపురం చెడిపోయింది. దాన్ని ''మహానటి''లో ఎడాప్ట్‌ చేసుకున్నట్లుంది. అయితే వాస్తవాలు ఎలా ఉన్నాయంటే ''సుమంగళి'' (1965) నాటికే సావిత్రి తెరపై లావుగా కనబడింది. అప్పుడామెకు 30 ఏళ్లు.

1965 తర్వాత ఆమె సోలో హీరోయిన్‌గా వచ్చిన సినిమాలు ''మనసే మందిరం'' (1966), ''నవరాత్రి'' (1966) ''ప్రాణమిత్రులు'' (1967) మాత్రమే. ''నిర్దోషి'' (1967)లో అంజలితో, ''కంచుకోట'' (1967)లో దేవికతో, ''తల్లిప్రేమ'' (1967)లో కాంచనతో కలిసి వేయాల్సి వచ్చింది. ''ఉమ్మడి కుటుంబం'' (1967)లో ఆమె ఎన్టీయార్‌కు వదిన. ''వరకట్నం'' (1969), ''కోడలు దిద్దిన కాపురం'' (1970)లో కూడా వదినే. కళ్లతో, మొహంతో ఎంత అభినయం ప్రదర్శించినా సరిపోదని, సాటి తారామణులు శరీరాకృతి కాపాడుకుంటున్నారు కాబట్టి, యిక తనకు హీరోయిన్‌గా వేషాలు రావని గ్రహించడం బట్టే ఆమె ''చిన్నారి పాపలు'' (1968) సినిమాను స్వీయ దర్శకత్వంలో 1967 అక్టోబరులో ప్రారంభించింది. అంతకు ముందు ''నవరాత్రి'' తెలుగు వెర్షన్‌ ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌వారితో కలిసి నిర్మించింది. దీనిలో తక్కినవాళ్లందరూ తప్పుకోవడంతో మొత్తం నిర్మాణవ్యయం తనే భరించవలసి వచ్చింది. 

ఈ టైములో జెమినీ కెరియర్‌ ఎలా ఉందో చూదాం. 1966లో అతను వేసిన సినిమాలు 7, 67లో 8, 68లో 5, 69లో 11, 70లో 9, 71లో 12, 72లో 10, 73లో 7, 74లో 5.. అలా 1980 వరకు అంటే అతనికి 60ఏళ్లు వచ్చేవరకు అతని సినిమా రిలీజు కాని సంవత్సరం లేదు. ఈ సినిమాల్లో అతను వేసినవి గెస్టు రోల్సేమో అనే అనుమానం రావచ్చు. అందువలన వాటి హిందీ, తెలుగు వెర్షన్లు ఉన్నచోట తెలుగులో ఎవరు వేశారో రాస్తాను.

''రాము''(తమిళ వెర్షన్‌ 1966) లో ఎన్టీయార్‌, ''ఆస్తులు అంతస్తులు'' (త.వె.1968)లో కృష్ణ, ''కలక్టర్‌ జానకి'' (త.వె.1969) లో జగ్గయ్య, ''బొమ్మా బొరుసా'' (తవె 1969)లో రామకృష్ణ, ''మమతా'' (తవె 1970)లో అశోక్‌ కుమార్‌, ''స్త్రీగౌరవం'' (తవె 1971)లో కృష్ణంరాజు, ''సత్యకామ్‌'' (తవె 1971)లో ధర్మేంద్ర, ''బడిపంతులు'' (తవె 1973)లో ఎన్టీయార్‌, ''ఓ మై నహీ('' (తవె 1974)లో నవీన్‌ నిశ్చల్‌, ''నమక్‌ హరామ్‌'' (తవె 1975)లో అమితాబ్‌ బచ్చన్‌, ''కోరా కాగజ్‌'' (తవె 1976)లో విజయ్‌ ఆనంద్‌ ...యిలా!  ఈలోగా 1971లో అతనికి పద్మశ్రీ కూడా వచ్చింది. (శివాజీ గణేశన్‌కు 1966లో వచ్చింది. ఎమ్జీయార్‌కు యివ్వబోతే వద్దన్నాడని వినికిడి. చనిపోయాక భారతరత్న యిచ్చారు). పరిస్థితి యిలా వుండగా అతనికి డిప్రెషన్‌ వచ్చే అగత్యమేముంది? 

ఇక ఆంధ్రలో గజారోహణ టైములో అతన్ని ఎవరూ పట్టించుకోనట్లు, అవమానం జరిగినట్లు సినిమాలో చూపించారు. గజారోహణం టైములో సావిత్రి హుషారుగా ఉంటే, జెమినీ బెదిరి, ఎందుకివన్నీ అన్నాడనీ  కొందరు రాశారు. రేలంగి కూడా గజారోహణంటే యిబ్బంది పడ్డారని రాశారు. అంతమాత్రం చేత జెమినీని జనం పట్టించుకోలేదని చూపడం మెలోడ్రామాకు పరాకాష్ట. అప్పట్లో తెలుగు ప్రాంతాల్లో ఔట్‌డోర్‌ షూటింగులుండేవి కావు, టీవీలు ఎలాగూ లేవు. సినిమా తారలు నిజజీవితంలో ఎలా ఉన్నారో చూడాలంటే శతదినోత్సవ సభల్లో మాత్రమే సాధ్యం. అందువలన జూనియర్‌ ఆర్టిస్టు వచ్చినా జనాలు ఎగబడేవారు. సావిత్రికి తెలుగునాట ఉన్న పాప్యులారిటీ జెమినీ గణేశ్‌కు లేదన్నది నూటికి నూరుపాళ్లు వాస్తవం. కానీ జెమినీ అనామకుడేమీ కాదు. డబ్బింగు సినిమాల ద్వారా తెలుగువారికి పరిచితుడు. 

1962లో జరిగిన గజారోహణం నాటి సంగతిని లెక్కలోకి తీసుకుంటే ''పతియే ప్రత్యక్షదైవం'' (1955- కణవన్‌యే కణ్‌కండ దైవం, హీరోయిన్‌ అంజలి) ''విజయకోట వీరుడు'' (వంజికోట్టయ్‌ వాలిబన్‌ - 1958 వైజయంతిమాల, పద్మిని హీరోయిన్లు), ''వీరపాండ్య కట్టబ్రహ్మన్న'' (1959 - పద్మిని సరసన) ''వీరసామ్రాజ్యం'' (పార్థిబన్‌ కణవుకు తెలుగు వెర్షన్‌, హీరోయిన్‌ వైజయంతిమాల) ''మా ఊరి అమ్మాయి'' (1960 కళక్తూరు కణ్నమ్మ, హీరోయిన్‌ సావిత్రి) ''పాపపరిహారం'' (పావమన్నిప్పు - సావిత్రి సరసన) (1961), ''మురిపించే మువ్వలు'' (కొంజుం సెలంగై, హీరోయిన్‌ సావిత్రి) (1962), వంటి విజయవంతమైన డబ్బింగు సినిమాల ద్వారా జెమినీ కూడా పాప్యులర్‌ హీరోనే.  పైగా మన అభిమాన నటి సావిత్రి మొగుడు. అందువలన ప్రజలు అతని వెంటపడకుండా ఎలా ఉంటారు?

ఇక పేపర్లలో 'వేషాలు తగ్గిన 'సాంబారు గణేశన్‌' అని వచ్చిందన్నది హాస్యాస్పదం. అప్పట్లో పత్రికలు చాలా హుందాగా ఉండేవి. ఏ ''హిందూనేశన్‌'' ''కాగడా'' వంటి వివాదాస్పద పత్రికలు అతన్ని సాంబారు గణేశన్‌ అన్నాయేమో కానీ మామూలుగా అయితే అలా అనడానికే లేదు. వాస్తవానికి వేషాలు తగ్గినది సావిత్రికి. అందుకే ఖాళీగా ఉండలేక దర్శకత్వం మొదలుపెట్టింది. ''మాతృదేవత'' హిట్టయినా, యితరులు ఎవరూ దర్శకత్వానికి ఛాన్సివ్వకపోవడం చేత తన డబ్బుతోనే సినిమాలు తీసుకోవలసి వచ్చింది., మొదటి రెండూ తప్పిస్తే తక్కిన మూడూ రీమేక్‌లే.

''చిరంజీవి'' (1969) 'నీర్‌కుమళి'కి రీమేక్‌. ''వింతసంసారం'' (1971) 'వియత్నాం వీడు'కు రీమేక్‌. ''ప్రాప్తం'' (1971) 'మూగమనసులు'కి తమిళ రీమేక్‌. వీటి ఒరిజినల్స్‌ బాగా ఆడాయి కానీ సావిత్రి తీసిన రీమేక్స్‌ ఫెయిలయ్యాయి. అందుకే ఆమె హితైషులందరూ సినీనిర్మాణం జోలికి, దర్శకత్వం జోలికి పోకుండా హాయిగా వచ్చిన వేషాలు వేసుకుంటూ ఉండమని సలహా యిచ్చారు. ఆమె వినలేదు. అదే ఆమె ఆర్థిక యిబ్బందులకు కారణమైంది.

ఇక జెమినీ యింకో అమ్మాయితో ఉన్నాడని తెలిశాకనే సావిత్రి అతనిపై కోపగించుకుని దూరమైందన్న కీలకమైన ఘట్టం గురించి.. అలమేలు ఎందరో సవతులను సహించారు. వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు సావిత్రి భర్త 'ఒన్‌ నైట్‌ స్టాండ్‌'ను కూడా సహించలేకపోయారు అన్నట్లు సినిమాలో చూపించారు. నిజానికి మధ్యతరగతి మోరల్స్‌తో తీర్పు యివ్వాలంటే సావిత్రి అలమేలు అనే గృహిణి భర్తను వలలో వేసుకుని, ఆమె కాపురంలో నిప్పులు పోసింది. అందుకే కొంతకాలానికి దానికి పరిహారం చెల్లించింది అని చెప్పాలి. సావిత్రి ఆ కోణంలో ఆలోచించి, సమాధాన పడిందా?  భర్త స్త్రీలోలత్వం గురించి ఆమె ఎంత సెన్సిటివ్‌? కెరియర్‌ గురించి అందరికీ తెలుస్తుంది కానీ యిలాటి వ్యక్తిగత విషయాల గురించి బయటకు తెలియదు. అప్పటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కొంత ఊహాగానం చేయాల్సిందే.

మొదటగా సావిత్రి పెళ్లి చేసుకునే నాటికే జెమినీ స్త్రీలోలత్వం ఆమెకు తెలుసు. 'అలమేలును పెళ్లి చేసుకున్నాను. పుష్పవల్లితో సంబంధం ఉంది' అని సినిమాలోనే చెప్పించారు. పెళ్లి సరే, యిలా చిన్న యిల్లు మేన్‌టేన్‌ చేయడాన్ని సావిత్రి ఎలా జీర్ణించుకోగలిగింది? అప్పటి సామాజిక పరిస్థితులు, సినీరంగ పరిస్థితులు అలాటివి అని మనం గుర్తు పెట్టుకోవాలి. మన మధ్యతరగతి మోరలిస్టిక్‌ కొలబద్దలతో వాళ్లను బేరీజు వేయకూడదు. జెమినీయే ఒక చిన్నింటి వారసుడు. అతని తాత బ్రాహ్మణుడు. ఆయనకు వేరే కుటుంబం ఉంది. దేవదాసి ఐన జెమినీ నాయనమ్మ తాతకు ఉంపుడుగత్తె. జెమినీ తండ్రి మళ్లీ దేవదాసీ కుటుంబానికి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. అందువలన జెమినీకి తను చేసినదానిలో వింతేమీ కనబడి వుండదు. 

పుష్పవల్లి విషయానికి వస్తే కూడా పశ్చిమగోదావరి జిల్లాలోని దేవదాసీ కుటుంబానికి చెందిన వ్యక్తి. సినిమారంగానికి వచ్చాక రంగాచారి అనే అతన్ని పెళ్లి చేసుకుని, అతని ద్వారా ఒక కొడుకు (బాబ్జీ అని బాలనటుడు) కన్నాక, విడిపోయింది. కానీ అధికారికంగా విడాకులు తీసుకోలేదు. (1956 తర్వాతే విడాకుల చట్టం వచ్చింది) పుష్పవల్లి సోదరికి వేదాంతం రాఘవయ్యగారితో సంబంధం ఉంది. వాళ్లకు పుట్టిన శుభ కూడా సినిమా నటి అయింది. జెమినీతో సంబంధం పెట్టుకున్నాక పుష్పవల్లికి రేఖ, రాధ పుట్టారు. ఆవిడకు పెద్దగా నటనావకాశాలు రాలేదు. తెలుగు, తమిళం మొత్తం కలిపి 20-25 సినిమాల్లో వేసింది. ''చెంచులక్ష్మి'' (1958)లో లీలావతి పాత్రలో ఆమెను చూడవచ్చు.

1955లో ఎమ్మెస్‌ ప్రకాశ్‌ అనే అవివాహితుడైన సంగీతదర్శకుడు ''ఇంటిగుట్టు'' (1958) సినిమా తీయడానికి యింకో ఆయనతో కలిసి ఫిల్మ్‌ కంపెనీ పెట్టి, పుష్పవల్లి టి నగర్‌ నివాసంలో ఒక వాటా అద్దెకు తీసుకున్నారు. అతనితో పుష్పవల్లికి దోస్తీ కుదిరింది. నాలుగేళ్ల పాటు సాగింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. అతను ''మామకు తగ్గ అల్లుడు'' సినిమా కూడా తీశాడు. రెండింటిలోనూ సావిత్రే హీరోయిన్‌. ప్రకాశ్‌తో బంధం ఏర్పడ్డాక జెమినీ పుష్పవల్లి ద్వారా తనకు పుట్టిన పిల్లల సంగతి పట్టించుకోలేదు. రేఖకు ఆ విషయంలో ఆగ్రహం ఉంది. అందుకే 2005లో జెమినీ పోతే అంత్యక్రియలకు కూడా రాలేదు. ఆమె చెల్లి రాధ అమెరికాలో ఉంది. 

'మా అక్క పెళ్లిలో సావిత్రి, పుష్పవల్లి, మా అమ్మ కంటె ఎక్కువగా పెద్దరికం వహించార'ని డా.కమల చెప్పారు. అంటే యిది రహస్య వ్యవహారమేమీ కాదన్నమాట. తెలుగు, తమిళ సినీరంగాలలో ఎందరో ప్రముఖులు, ఎమ్జీయార్‌, కరుణానిధి, నుంచి అనేకమంది వైవిరావు (లక్ష్మి తండ్రి), భీమ్‌సింగ్‌ వంటి దర్శకనిర్మాతలకు యిటువంటి వ్యవహారాలుండేవి. రెండిళ్ల వ్యవహారానికి ఘంటసాల కూడా మినహాయింపు కాదు. జెమినీ సహనటుడు, డిఎంకె నాయకుడు ఐన ఎస్‌ఎస్‌ రాజేంద్రన్‌ భార్య ఉండగానే సిఆర్‌ విజయకుమారి అనే హీరోయిన్‌తో సహజీవనం చేసి పిల్లల్ని కన్నాడు.

ఇద్దరూ విడిపోయాక తామరసెల్వి అనే యింకో ఆవిణ్ని చేసుకున్నాడు. జెమినీ పెద్ద భార్య కూడా ఆనాటి గృహిణుల్లాగానే భర్త వ్యవహారాలను ఆపే శక్తి లేక మిన్నకుందని అనుకుని ఊరుకోకూడదు. సావిత్రీ ఊరుకుందని మనం గ్రహించాలి. సావిత్రితో పరిచయానికి ముందు పుష్పవల్లితో సంబంధం ఉందనే కాదు, 1952లో సావిత్రితో రహస్యవివాహం జరిగాక కూడా జెమినీ పుష్పవల్లితో సంబంధం కొనసాగించాడు. అందుకే 1954లో రేఖ పుట్టింది, తర్వాత రాధ పుట్టింది. ఇంతకంటె రుజువు ఏం కావాలి? సావిత్రి 1956లో జెమినీతో తన వివాహాన్ని బహిర్గతం చేసిందంటే పుష్పవల్లి ఎఫయిర్‌నూ ఆమోదించినట్లేగా!

  నిజానికి సినీతారలకు వివాహేతర సంబంధాల విషయంలో వేరే రకమైన వేల్యూ సిస్టమ్‌ ఉంది. వీటి పట్ల మరీ అంత సెన్సిటివ్‌గా ఉండకుండా, ఒక పరిమితి వరకు సహించే గుణం ఉంది. శ్రీరెడ్డి గొడవల్లో కాస్టింగ్‌ కౌచ్‌ గురించి చర్చ వచ్చినపుడు సినీరంగ ప్రముఖులెందరో యివన్నీ ఎప్పణ్నుంచో ఉన్నవే కదా, యిప్పుడెందుకీ రచ్చ అన్నట్లు మాట్లాడారు. జెమినీ వంటి ఉమనైజర్‌ 1956 నుంచి 1967 వరకు (అప్పుడతని వయసు 36 సం. నుంచి 47 సం.) మడి కట్టుకుని ఉంటాడని మనం నమ్మగలమా? సావిత్రి నమ్మి ఉంటారా? హీరోగా టాప్‌లో ఉన్నాడు. సరదాగా, తెలివిగా మాట్లాడుతూంటాడు (షావుకారు జానకి యీ విషయం చెప్పారు) వద్దన్నా అమ్మాయిలు వచ్చి పడుతూంటారు.

అందువలన యీ విషయాల్లో సావిత్రి చూసీచూడనట్లే ఉండి ఉంటారు. కనీసం 1967 వరకు జెమినీపై సావిత్రికి ఫిర్యాదులు లేవని అనుకోవడానికి తుర్లపాటి కుటుంబరావు యీ మధ్య రాసిన వ్యాసం పనికి వస్తుంది. 1967లో నెల్లూరులో సావిత్రి, జెమిని దంపతులకు సన్మానం చేస్తే తుర్లపాటి వెళ్లారు. ఆయన వద్దకు విజయవాడ నుంచి సావిత్రి పెదనాన్న వెంకట్రామయ్య చౌదరి వచ్చి 'సావిత్రిని వాడు మోసం చేస్తాడు. ఇప్పటికైనా విడాకులు తీసుకోమని మీరైనా చెప్పండి' అన్నారు. 'వాళ్లకు 1952లో పెళ్లయింది.

15 ఏళ్ల కాపురం అయి, యిద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకోమని ఎలా చెప్తామండి?' అని తుర్లపాటి ఆయనకు చెప్పి, యీ సంగతి సావిత్రికి చెప్పారు. సావిత్రి సంతోషించి, 'బాగా చెప్పారు. మీరిలా హితవు చెప్పారని బావగారికి కూడా చెప్తానుండండి' అన్నారని తుర్లపాటి రాశారు. అంటే 1967 వరకు వాళ్ల కాపురం బాగానే ఉందని అనుకోవాలి. ఆ ఏడాది అక్టోబరులోనే ''చిన్నారి పాపలు'' సినీ దర్శకనిర్మాతగా సావిత్రి మారారు.

జెమిని స్త్రీలోలత్వం పట్ల సావిత్రి ఒక సాధారణ మధ్యతరగతి మహిళలా రియాక్టయిందని, వారి కాపురం విచ్ఛిన్నమవడానికి అదే ప్రధానకారణమని సినిమాలో నాటకీయత కోసం చూపవచ్చు తప్ప అది నిజమనుకోవాలని లేదు. అసలు కారణం - భర్త మాట లక్ష్యపెట్టకుండా సావిత్రి డబ్బుని చిత్తం వచ్చినట్లు ఖర్చు చేయడం అనుకోవాలి. సావిత్రి అద్భుతమైన నటి, మహాద్భుతమైన మంచి మనిషి. ఎవరేమడిగినా లేదనకుండా యిచ్చేసేది. ఇవన్నీ బయటవాళ్లకు బాగానే ఉంటాయి కానీ యింట్లో వాళ్లకు ఎలా ఉంటాయో ఊహించండి. మీరు ఒక పరిమితికి మించి సమాజసేవ చేస్తానన్నా, దానధర్మాలు చేస్తానన్నా.

ఇన్‌కమ్‌టాక్స్‌ కట్టకుండా అవకతవకగా వ్యవహరాలు చేసినా మీ భార్య లేదా భర్త తప్పకుండా అడ్డుపడతారు. చేతకాకుండా వ్యాపారం చేస్తానంటే వద్దంటూ అవరోధాలు కల్పిస్తారు. దగాకోర్లను నమ్మి డబ్బు అప్పచెప్పేస్తూ వుంటే మందలిస్తారు. కోప్పడతారు. జెమినీ చేసినదదే. సావిత్రి మరణానంతరం జెమినీపై నింద వస్తే అతను ప్రెస్‌మీట్‌ పెట్టి లెక్కలన్నీ చెప్పాడనీ చదివాను. అప్పుడే కుమార్తె చాముండేశ్వరి సావిత్రిపై కేసు వేసిందని కూడా చెప్పాడట. వేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మైనర్ల ఆస్తిని మేజర్లు తగలేస్తూ ఉంటే ఆవిడ తన తరఫున, తన తమ్ముడి తరఫున తల్లిపై ఆంక్షలు విధించాలని కోర్టు వారిని కోరుతూ కేసు వేసి ఉండవచ్చు. జెమిని డబ్బు దగ్గర జాగ్రత్తపరుడు. అతను దర్శకత్వం జోలికి పోలేదు.

సినిమా కూడా ఒక్కటే ఒక్కటి తీశాడు. ''ఓ మై నహీ('' సినిమా కథని ''నాన్‌ అవన్‌ ఇల్లయ్‌'' పేర తీస్తే అతనికి ఫిల్మ్‌ఫేర్‌ ఎవార్డు వచ్చింది కానీ డబ్బులు రాలేదు. సినీనిర్మాణం ప్రత్యేకమైన కళ. సావిత్రి మహా మొండి మనిషని ఎవరి మాటా వినదని హితవు చెప్పడానికి జెమినీ వెళితే కుక్కల్ని ఉసిగొల్పిందని, జెమినీ గోడదూకి పారిపోవలసి వచ్చిందనీ  జెమనీ పెద్దభార్య కూతురే కాదు, రమాప్రభా చెప్పారు. 'మా అమ్మ అణ్నానగర్‌లో అద్దె యింట్లో ఉండడానికి కారణం సొంత యిల్లు లేక కాదు, మా అందరి మీదా అలిగి..' అని చాముండేశ్వరే చెప్పారు. 

ఇలాటి మొండితనం వలన భార్యాభర్తల మధ్య గొడవలు రావడంలో ఆశ్చర్యం లేదు. ఆమె యింటికి వస్తే కొట్లాటలు, తిట్లు తప్ప వేరేవీ లేనప్పుడు జెమిని రాకపోవడంలో ఆశ్చర్యం లేదు. వెళ్లడానికి అతనికి వేరే యిల్లు ఉంది. గర్ల్‌ ఫ్రెండ్సూ ఉండి ఉంటారు. అన్నిటిని మించి కెరియర్‌ ఉంది. అతను ''రుద్రవీణ'' (1988), ''భామనే సత్యభామనే'' (1998) వరకు చురుగ్గా నటిస్తూనే ఉన్నాడు. సావిత్రి కోమాలోకి వెళ్లాక తనపై విరుచుకు పడలేదు కాబట్టి, అతను యథేచ్ఛగా వచ్చి వెళుతూ వైద్యం చేయించాడు.

ఆమె పోయిన తర్వాత పెద్ద భార్య యింటికి తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు జరిపించాడు. కూతురు చాముండేశ్వరికి అప్పటికే పెళ్లయింది. కొడుకు సతీష్‌ను అక్కతో ఉంటావా? నాతో ఉంటావా? అంటే నీతో ఉంటానన్నాడు. అతన్ని చదివించి ఇంజనియర్‌ను చేశాడు. (అతనిప్పుడు అమెరికాలో ఉన్నాడు. తండ్రిని పన్నెత్తి మాటనడు) పెద్దభార్య నలుగురు కూతుళ్లలో  ముగ్గుర్ని డాక్టర్లను చేశాడు. వాళ్లలో ఒకరు దక్షిణ భారతదేశంలోనే తొలిసారి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సృష్టించిన గైనకాలజిస్టు డా. కమల.  నాలుగో కూతురు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూపులో జర్నలిస్టు. 

''మహానటి'' హిస్టరీపై ఆధారపడిన ఒక కల్పితగాథగానే మిగిలి వుంటే యిన్ని వివరాలు తెలుసుకోవలసిన పని లేదు. కానీ దాన్ని ఒక కల్ట్‌ సినిమాగా, వినోదపు పన్నుకి అర్హమైన సినిమాగా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సావిత్రి ఆథరైజ్డ్‌ బయోగ్రఫీలా పరిగణించేస్తున్నారు. రేపోమాపో దాన్ని  స్కూలు పిల్లల సిలబస్‌లో కూడా పెట్టమనే డిమాండ్‌ రావచ్చు. అందుకే వాస్తవాల గురించి యీ సుదీర్ఘ వివరణ. 

 (ఫోటో - పుష్పవల్లి, ''పాశమలర్‌'' (రక్తసంబంధం)లో శివాజీతో, ''మిస్‌మేరీ''లో మీనాకుమారి, జమునలతో, ''వంజికోట్టయ్‌ వాలిబన్‌''లో వైజయంతిమాలతో, ''కొంజుం సెలంగై''లో నాదస్వర విద్వాంసుడిగా, ''స్కూల్‌మాస్టర్‌''లో జానకితో)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?