లాక్డౌన్ అనేది అన్ని వర్గాలలో నిజంగా సాధ్యమా? ఉన్నత వర్గాలు, ఎగువ మధ్యతరగతి వర్గాలు విశాలమైన యిళ్లల్లో, ఫ్లాట్లలో వుంటారు కాబట్టి మరీ సన్నిహితంగా వుండనక్కర లేకుండా గడపగలరు. రెండు, మూడు గదుల వాటాల్లో ఉండే మధ్యతరగతి వాళ్లు రోజుల్లో 24 గంటలూ అత్యంత సన్నిహితంగా వుండడం ఆరోగ్యానికి మంచిదేనా? మామూలుగా అయితే కుటుంబసభ్యుల్లో ముప్పావు మంది రోజంతా బయటే గడుపుతారు కాబట్టి రోజులో పది, పన్నెండు గంటల కంటె అందరూ కలిసి వుండరు. వీళ్లల్లో ఎవరికీ కరోనా లేకపోయినా జలుబో, దగ్గో, తుమ్ములో, జ్వరమో, ఏదో ఒకటి రావచ్చుగా. అవి వ్యాపించవా? ఇక ఈ వాటాలు కూడా పక్కపక్కనే ఉంటూంటాయి. ఒక యింటి నుంచి మరో యింటికి అతి సులభంగా రోగాలు వ్యాపిస్తాయి. సిగరెట్టు కాల్చే వాళ్లుంటే ఊపిరితిత్తులకు దెబ్బ కూడా.
ఇక దిగువ మధ్యతరగతివాళ్లు, పేదలు వుండే పేటలు, మురికివాడలు ఎలా వుంటాయో చూస్తూంటాం. అక్కడ జనసాంద్రత విపరీతంగా వుంటుంది. తగిన టాయిలెట్ సౌకర్యాలుండవు. డ్రైనేజి వసతులు వుండవు. తాగునీరు కలుషితమై వుంటుంది. వార్తల్లో ధరావీ ఒక్కటే వస్తూంటుంది, సైజులో అతి పెద్దది కాబట్టి! అనేక నగరాల్లో చిన్న స్కేలులో ధరావి వుంది. బంజారాహిల్స్లోనే యిరుకిరుకు బస్తీలు చూపించగలను. కొన్నిట్లో పదిహేను అడుగుల వెడల్పు రోడ్లున్న సందులున్నాయి. ఎక్కడ చూసినా జనం భూమిలోంచి మొలుచుకుని వచ్చినట్లు కనబడతారు. వీళ్లందరూ పగలు ఊరంతా వ్యాపించి వుంటారు కాబట్టి బతుకు గడిచిపోతూ వచ్చింది. ఇప్పుడు రోడ్లన్నీ ఖాళీ. ఆఫీసులన్నీ ఖాళీ. మైదానాలు ఖాళీ. అందరూ కలిసి కట్టకట్టుకుని అతి తక్కువ స్పేస్లో భుజాలు రాసుకుంటూ రోజులో 24 గంటలూ గడపడం ఏమంత ఆరోగ్యకరం?
మొత్తం జనాభాలో దారిద్య్రరేఖకు దిగువన ఉండేవారు నూటికి 30 మంది ఉంటారు. వారిలో చాలామంది గ్రామాల్లో, పట్టణాల్లో ఉంటారనుకున్నా, కేవలం 5% మందే నగరాల్లో వున్నారనుకున్నా దాదాపు 7 కోట్ల మంది యిలాటి బస్తీల్లో కిక్కిరిసి వుండాలి. వీరందరికీ ప్రమాదం పొంచి వుందని అనుకోవాలి, వీరి వలన యితరులకు ప్రమాదమూ పొంచి వుందనాలి. వీరి ప్రాణాలకు భయం ఉందని అనను. వీరిలో కనీసం 1% అంటే 7లక్షల మంది ద్వారా యితరులకు రోగం సోకే ప్రమాదం ఉందంటాను. ఇప్పటికిప్పుడు వాళ్ల స్థితిగతులు మార్చలేం. ఇంకోచోటికి మార్చి పోషించనూ లేము. అందువన యీ బస్తీవాసులందరికీ స్టాంపులు కొట్టి మానిటర్ చేయాలి. అలా చేయాలంటే తక్కిన వ్యవస్థంతా మామూలుగా పనిచేయాలి. లాక్డౌన్ ఉన్నంతకాలం అది సాధ్యపడదు.
ఎవరి ఇళ్లల్లో వాళ్లున్నా పేదలైతే పప్పు, ఉప్పు యింటికి యిస్తాం, డబ్బుంటే మీ అంతట మీరే కొనుక్కునేట్లా కిరాణా షాపులు తెరిచి వుంచాం అంటున్నారు. కూరలూ అంతే. సప్లయిలు రావుట అనగానే ధరలు పెరిగిపోయాయి. అయితే వీటన్నిటి క్వాలిటీ చెక్ చేసేవారెవరు? చెక్ చేసే ప్రభుత్వోద్యోగులు లేరు కదా! అంతా దైవాధీనం. వీటివలన ఆరోగ్యం దెబ్బ తింటే? పనివాళ్లు రావటం లేదు. ఒంటరిగా వుండే ముసలివాళ్ల సంగతి ఆలోచించారా? ఇల్లు తుడుచుకోవడం, గిన్నెలు తోముకోవడం మాత్రమే కాదు, వాషింగ్ మెషిన్ పాడైతే బట్టలు కూడా ఉతుక్కోవాలి.
ఇంట్లో లైటు పోయినా, ఫ్యాన్ ఆగిపోయినా, కుళాయి కారిపోతున్నా చేసిపెట్టేవాడు లేడు. పిల్లల దగ్గరకి వెళదామంటే వెళ్లనీయరు. వీటివలన వారి ఆరోగ్యం చెడితే? మందులు కూడా అన్నీ దొరకటం లేదు. ఆసుపత్రుల ఒపిలు లేవు. టెలిఫోన్లో అడిగి మందులు వేసుకోవడమే! గుండె ఎలా కొట్టుకుంటోందో, ఊపిరితిత్తుల్లో కఫం చేరిందో లేదో, చర్మం మీద వచ్చిన పొక్కు ప్రమాదకరమో కాదో ఫోన్లో తెలియదు కదా! ఖరీదైన ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యాన్ని ఎంతమంది పేదలు వినియోగించుకోగలరో నాకు అనుమానమే!
గతంలోనే రాశాను, కరోనా తప్ప వేరే జబ్బు లేనట్లుగా సమాజం ప్రవర్తిస్తోందని. ఫాలో అప్ పేషంట్లను డాక్టర్లు చూడకపోతే దాని నష్టం పూరించలేనిదిగా తయారైతే ఎలా అనేది ఎవరూ ఆలోచించటం లేదు. ఇక ఎమర్జన్సీ అనేది రోడ్డు మీద పోలీసు భావనపై ఆధారపడి వుంది. కారులో పూర్ణగర్భిణి కనబడితే సరే వెళ్లండి అంటాడు. అయిదో నెలలోనో, ఆరో నెలలోనే స్కానింగ్ చేయించుకోవడానికి వెళతానంటే ఎమర్జన్సీ కాదంటాడు. లోపల బిడ్డ ఎదుగుదలలో లోపముంటే తెలియకుండా పోతుంది కదా! ఒకవేళ పోలీసు వెళ్లనిచ్చినా ఆసుపత్రిలో సిబ్బంది చాలినంతమంది వుండటం లేదు.
దానికి కారణం కరోనా గురించి మనం వ్యాపింపచేసిన భయం! డాక్టర్లను ప్రాణదాతలుగా కాక యమదూతల్లా చూడడం ప్రారంభమైంది. కరోనా పేషంట్లను చూడడం చేత డాక్టర్లకు, నర్సులకు కరోనా సోకి వుంటుందని, వాళ్లు కనుక తమ యింటి పక్కన వుంటే తమకూ సోకుతుందనీ జనాలు భయపడుతున్నారు. అందువలన అపార్టుమెంటు కాంప్లెక్సు వాళ్లు యీ వైద్యసిబ్బందితో ‘ఉంటే యింట్లో ఉండండి, పని మానేయండి, కాదూ కూడదు, ఆసుపత్రికి వెళ్లాలనుకుంటే అక్కడే వుండిపోండి. ఇళ్లకు రాకండి’ అని చెప్తున్నారు. దానితో సగానికి సగం మంది వైద్యసిబ్బంది పనిచేయలేక పోతున్నారు. ఈ అంటువ్యాధి ఎక్కడ సోకుతుందో అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ పని చేయడంతో బాటు, సమాజం చేత మాట పడాలంటే వాళ్లకు అలవి కావటం లేదు.
క్వారంటైన్ చేయబడినవారి చికాకులు, కోపతాపాలు భరించడం కూడా పెద్ద శిక్షగా వుంది వాళ్లకు! ఇన్నాళ్లూ అన్నీ కార్పోరేటు ఆసుపత్రులకే అప్పగించి ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేసి, ఏ సౌకర్యాలు లేకుండా చేసిన ప్రభుత్వం యీనాడు ప్రయివేటు వాళ్లను నమ్మం అంటూ మొత్తం భారమంతా ప్రభుత్వాసుపత్రులపై పడేసింది. టెస్టింగు చేసే అధికారం అతి కొద్దిమంది ప్రయివేటు వాళ్లకు కూడా యిచ్చాం అన్నారు కానీ వాళ్లకు టెస్టింగు కిట్స్, వాటిని వాడేందుకు అనుమతుల విషయంలో ఐసిఎమ్ఆర్ విపరీతంగా జాప్యం చేసిందని విన్నాను. ప్రయివేటు ఆసుపత్రుల్లో టెస్టు చేసినా దాని రిజల్టును ప్రభుత్వాసుపత్రి ద్వారానే రూట్ చేయాలంటున్నారు.
దీనికి చాలా సమయం పడుతోంది. ఆసుపత్రులకు కిట్స్ చేరని సందర్భాలూ ఉన్నాయట. క్వారంటైన్లో చేరినా, ఓ పట్టాన టెస్ట్ జరపక, జరిపినా రిజల్టు చెప్పక, చికిత్స ప్రారంభించక తాత్సారం జరగడంతో పేషంట్లు చికాకు పడిపోతున్నారు. క్వారంటైన్ అనుభవమే కొత్త, దానికి తోడు నిష్క్రియాపరత్వమూ కొత్త. దాంతో ఆ చికాకంతా వైద్యసిబ్బందిపై చూపుతున్నారు. ఇదెక్కడి ఖర్మరా బాబూ అని సిబ్బందంతా తలలు పట్టుకుంటున్నారు.
ప్రయివేటు ఆసుపత్రులో ఒపిలు నిర్వహించటం లేదు. ఆపరేషన్సన్నీ ఆగిపోయాయి. మొదలే వాటి నిర్వహణ కష్టంగా వుంటూ యాజమాన్యాలు చేతులు మారుతున్నాయి. పులి మీద పుట్రలా యిది రావటంతో జీతాలు కోసేస్తున్నారు. హాజరైన వాళ్ల స్థితే అలా వుంటే కానివాళ్ల గతి ఏమవుతుందో ఊహించుకోవచ్చు. ఆ భయంతో వాళ్లు యిళ్లల్లో బిక్కుబిక్కుమంటూ వున్నారు. వాళ్లు ఒక్కరేనా, ఎన్ని పరిశ్రమలు కుదేలయ్యాయి? ఐటీ వాళ్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలరు. మరి తక్కినవాళ్లు?
లాక్డౌన్ ఎత్తేశాక ఫ్యాక్టరీు, దుకాణాు తెరిచామనవచ్చు. కానీ మనకు ఉద్యోగం వుంటుందన్న హామీ వుందా? ఉన్నా జీతం అదే వుంటుందన్న ధీమా వుందా? రెండు నెలలుగా వ్యాపారం లేదు అనే కారణం చూపి వాళ్లు జీతాలు తగ్గించేస్తే..? పత్రికారంగంలో, టీవీ మీడియాలో జరుగుతున్న దాని గురించి వార్తలు వస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ రంగమైతే చెప్పనే అక్కరలేదు. సినిమా హాళ్లు, షూటింగు, ప్రి-ప్రొడక్షన్లు, పోస్ట్-ప్రొడక్షన్లు అన్నీ మూసుకుని కూర్చున్నారు. అందరూ యింట్లో వుంటే, టీవీలే చూస్తారు, ఎఫ్ఎమ్ రేడియోలు ప్రయాణంలోనే వింటారు అనే కారణం చెప్పి వాళ్లూ ఉద్యోగులకు జీతాలు తగ్గించారట. ఇది మనం ఊహించగలమా?
అలాగే ట్రావెల్ యిండస్ట్రీ, హోటల్ యిండస్ట్రీ, టూరిజం, రెస్టారెంట్లు, వీటన్నిటికి యిప్పట్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. లాక్డౌన్ ఎత్తివేత తర్వాత యివన్నీ క్రమేపీ కుంటుకుంటూ నడిచినా ఫంక్షన్ హాళ్ల, క్లబ్బుల, పబ్బుల వ్యాపారం మాత్రం యథాతథ పరిస్థితికి రావడానికి చాలా సమయమే పడుతుంది. ఒకచోట గుమిగూడితే ప్రమాదం అనే భయం మనసు లోంచి అంత త్వరగా తొలగిపోదు. తెగించేవాళ్లు కొందరుంటారు కానీ, ఎక్కువమంది భయపడడం సహజం. మనందరికీ ఆదాయం లేకపోతే ప్రభుత్వానికి మాత్రం ఎక్కణ్నుంచి వస్తుంది? అందుకని అధికంగా పన్నులు వేస్తారేమో!
ఇలాటి ఆలోచనలు మనసులో సుళ్లు తిరుగుతూంటే యింట్లో కూర్చున్నా సరదాగా గడపగలరా? ‘ఈ ఫ్యాక్టరీలు, వ్యాపారాలు, వ్యవసాయాలు మళ్లీ మొదలై సరుకు మార్కెట్లోకి వచ్చేసరికి చాలా రోజులు పడుతుంది. ఇప్పుడే రెండు, మూడు నెలలకు సరిపడా కొనేసి పెట్టుకుందాం, రెట్టింపు ధరైనా ఫర్వాలేదు’ అని గృహిణి అనవచ్చు. జీతం వచ్చినపుడే ఒక నెల అరువు పెడుతున్న గృహస్తు జీతమే రానప్పుడు, లేదా సగమే వచ్చినపుడు రెట్టింపు ధరకు 2 నెలల సామాన్లు కొనగడా? అప్పుపై, క్రెడిట్ కార్డుపై వాయిదాలను మూడు నెలల పాటు వాయిదా వేసింది ప్రభుత్వం. వడ్డీ పడకమానదు. మన వ్యవసాయ ఋణమాఫీ కథలా తయారవుతోంది. అయినా మూడు నెలల తర్వాత ఒక్కసారిగా లప్ప ఎక్కణ్నుంచైనా వచ్చి పడుతుందా?
ఇక వ్యాపారస్తుడి సంగతి చూద్దాం. ఎంతో యంత్రాంగం వున్న బ్యాంకులకే బాకీలు వసూలు చేసుకోవడం రావటం లేదు. ఏ వ్యాపారస్తుడికైనా బాకీల వసూలు పెద్ద సమస్య. అవతలివాడికి యిప్పుడీ కరోనా ఒకటి సాకుగా దొరికింది. కరోనా కారణంగా నాకివ్వాల్సిన వాళ్లు యివ్వటం లేదండి అనేస్తాడు, నేను అప్పులిచ్చినవాళ్లకు ఉద్యోగాలు పోయాయట అంటాడు. ఇలాటి బెంగే పారిశ్రామికవేత్తది కూడా. నెలల తరబడి వ్యాపారం మూతపడినా, రావలసిన బాకీలు వస్తాయన్న నమ్మకం లేకపోయినా ఉద్యోగులను యింట్లో కూర్చోబెట్టి పూర్తి జీతాలు యిచ్చేయండి అని ప్రభుత్వం సలహా యిస్తోంది. తను మాత్రం తన ఉద్యోగుల జీతాల్లో సగం విరగకోస్తోంది. ఎదుటివారికి చెప్పేందుకేనా నీతులు? లాక్డౌన్ రోజుల్లో ఉద్యోగులకు జీతాలు యిచ్చినవారికి ఫలానా రాయితీలు యిస్తామన్న ప్రకటన ఏదైనా ఉందా? వాళ్లకు ఏదో విధంగా కాంపెన్సేట్ చేయాలి కదా.
రైతుల మాట ఆలోచిస్తే గుండె గాభరా పెరుగుతుంది. ఇప్పటికే వ్యవసాయం కుదేలైంది. పంట కిట్టుబాటు కావటం లేదు. పీకలోతు అప్పుల్లో మునిగి వున్నారు. ఇప్పుడిది! పంటలకు కరోనా సంగతి తెలియదు కదా, వాటి టైమ్ టేబుల్ ప్రకారం పండేస్తున్నాయి, కోతకు వచ్చేస్తున్నాయి. వ్యవసాయ కూలీలు రావడానికి లేదు. వాణిజ్య పంటలైతే కాస్త నయం కానీ తగినన్ని గోడౌన్లు లేవు, ఎన్ని దశాబ్దాలైనా సరే కట్టరు. ఇక కూరగాయలైతే నిలువ వుంచలేరు. రవాణా సౌకర్యం లేక రోడ్డు మీద పారబోసుకోవాల్సిందే. లాక్డౌన్ పెట్టిన కొన్ని రోజులకే యివి తోచి మినహాయింపులిచ్చారు. అయినా చాలా కూరలు, పళ్లు మార్కెట్లోకి రావటం లేదు. ఇక్కడ మనం అర్రులు చాస్తున్నాం, అక్కడ కుళ్లిపోతున్నాయి. వీళ్లను ఆదుకోవడానికంటూ తర్వాత ఎన్ని పథకాలు ప్రకటిస్తారో ఏమో!
ఇక రోజుకూలీ విషయం, రోజువారీ ఆదాయంపై ఆధారపడే తోపుడుబళ్లవాళ్లు, జంగిడీ వాళ్లను తలచుకుంటే కన్నీళ్లు ఆగవు. ఒక్క రోజు రెక్కాడకపోయినా డొక్కాడదు వాళ్లకు. ఒంట్లో బాగుండకపోయినా సరే, పనికి వచ్చేస్తారు. ప్రతిపక్షాలు ఒక్క రోజు బంద్కి పిలుపు నిచ్చినా దానివలన జనాభాలో యింత శాతం అవస్థలు పడతారు, యిన్ని కోట్ల నష్టం వచ్చిందంటూ రాష్ట్రప్రభుత్వం అంకెలు చదువుతుంది. తను కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బంద్కు పిలుపు నిచ్చినపుడు మాత్రం యివన్నీ మర్చిపోతుంది. ఏది ఏమైనా యీ వర్గాల వాళ్లు పనికి పోకుండా ఒక్క రోజైనా ఉండలేరన్నది వాస్తవం. అలాటివాళ్లు నెలల తరబడి యింట్లో కూర్చుంటే ఏం గడుస్తుంది? ప్రభుత్వం యిచ్చే సాయం చాలక, అప్పో, సొప్పో చేసి ప్రాణం నిలుపుకున్నా, తర్వాత అవి తీర్చలేక ఏ అఘాయిత్యం చేస్తారో! చేసినా అవి కరోనా మరణాల జాబితాలోకి రావు.
ఇలా భవిష్యత్తు అగమ్యగోచరంగా వుంటుందన్న టెన్షన్లతో జనాభాలో చాలామందికి ఆరోగ్యం చెడిపోవడం ఖాయం. చింత పడకండి, కుటుంబసభ్యులతో హాయిగా గడపండి అనవచ్చు. మనసు ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉన్నపుడే కులాసాగా గడపగలరు. అందర్నీ కట్టకట్టి ఒకే చోట పడేయడం వలన మానసిక సమస్యలు కూడా వస్తాయి. ప్రతివాడికీ పర్శనల్ స్పేస్ కావాలి. ఉద్యోగం మీదో, పని మీదో బయటకు వెళ్లినపుడు ఆ స్పేస్ దొరుకుతుంది. పెట్టుకుందామన్న పేచీలను సమయం లేక వాయిదా వేయడం జరుగుతుంది. రిటైరై పోయి, యింట్లోనే కూర్చున్న ముసలివాళ్లు ప్రతి విషయంలో రోజంతా సణుగుతూ వుంటారు. రోజంతా తగవులాడగలిగిన సమయం చేతిలో వుంటుంది. పాత విషయాలు తవ్వితీసి, అప్పుడిలా చేశావ్, ఎందుకులే అని ఊరుకున్నాను అంటూ గొడవలు పెట్టుకుంటారు. అందువలన యింట్లో ముసలివాళ్లుంటే చాలామందికి బోరు.
ఇప్పుడు యీ లౌక్డౌన్ ధర్మమాని అందరూ అలా తయారవుతారు. వేరే పనేమీ లేదు కాబట్టి భార్యాభర్తలు పాత సంగతులు తవ్వుకుని వాదించుకోవచ్చు. పరిస్థితులు బాగా లేవు కాబట్టి చికాకు ప్రదర్శించవచ్చు. ఉన్న ఒక్క టీవీలో ఏ ఛానెల్ చూడాలా అన్నదానిపై కొట్లాడుకోవచ్చు. తాగుడు అలవాటున్న వాళ్లతో మరీ యిబ్బంది. మద్యం ఒకసారి అలవాటయ్యాక ఒక్కసారిగా మాన్పించడం కష్టం కాబట్టి, దశలవారీగా మద్యనిషేధం పెడతామంటూంటారు. ఇప్పుడు హఠాత్తుగా స్టాకు లేకుండా పోయింది.
ఎలాగోలా సంపాదించినా ఇదేమీ ఔషధం కాదు, గుటుక్కున మింగి పడుక్కోవడానికి. తాగుడుతో బాటు ఫ్రెండ్స్తో వాగుడు వుంటేనే అది సంపూర్ణమౌతుంది. పిల్లాపాపా ముందు తాగడం యిబ్బంది, తాగాక వాగితే మరీ యిబ్బంది. టీవీ సీరియల్స్ వ్యసనానికి అలవాటు పడిన గృహిణులు కూడా యిప్పుడు చికాగ్గా, పరాగ్గా వుండవచ్చు. నాకనిపిస్తుంది - వారాలకే మనం యిలా అయిపోతున్నామే, కశ్మీరు వాళ్లు ఏళ్ల తరబడి ఎలా భరించారా అని. మనకి యింటర్నెట్, వాట్సాప్లు వున్నాయి కాబట్టి ఏదోలా కాలక్షేపం అవుతోంది. 370 ఎత్తేశాక కశ్మీరులో నెలలపాటు అవేమీ లేవు కదా! ఎన్ని శాపనార్థాలు పెట్టారో మరి!
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు