Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: టీచర్లకు డ్రెస్‌కోడ్‌ ఉందా?

ఎమ్బీయస్‌: టీచర్లకు డ్రెస్‌కోడ్‌ ఉందా?

తూర్పు శ్రీలంకలో యిటీవల హిందూ-ముస్లిముల మధ్య ఘర్షణ వాతావరణం పెరుగుతోంది. త్రిన్‌కొమలి లోని 'శ్రీ షణ్ముగ హిందూ లేడీస్‌ కాలేజి' అనే హైస్కూలులో నలుగురు ముస్లిము టీచర్లు ఉన్నట్టుండి చీరలు కట్టడం మానేసి అరేబియన్‌ స్త్రీలలా 'అబయా' (పై నుంచి కింద దాకా శరీరాన్ని కప్పి ఉంచే ఉడుపు) వేసుకు రాసాగారు. ఒక హిందూ స్కూలులో యిలాటి డ్రస్సు వేసుకురావడమేమిటంటూ స్కూలు పిల్లల తలిదండ్రులు, కొందరు టీచర్లు కలిసి ఆందోళనకు దిగారు.

స్కూలు ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు. 'హిందూ స్కూళ్లు హిందువుల కోసమే. ఇక్కడ మతతత్వం చెల్లదు' అంటూ. 'ఈ స్కూలు 1923లో ఒక హిందూ స్త్రీ విరాళంతో నెలకొల్పినా, ప్రస్తుతం అది ప్రభుత్వ నిధులతో నడుస్తోంది. అందువలన హిందూ స్కూలు అనడానికి లేదు. 2000 మంది విద్యార్థుల్లో 120 మంది ముస్లిములే. అన్ని మతాల టీచర్లను నియమిస్తున్నారు. పైగా టీచర్లకు డ్రెస్‌కోడ్‌ లేదు. మాకు సౌకర్యంగా ఉన్న బట్టలు మేం వేసుకుంటున్నాం' అంటారు ఆ టీచర్లు.

ఆందోళనకారులు పనిలో పనిగా 'మీరు మంచి తమిళం మాట్లాడకలేకపోయినా ఫర్వాలేదు కానీ అపభ్రంశపు తమిళం మాట్లాడకండి' అంటూ నినాదాలు యిచ్చారు.  శ్రీలంక తమిళుల యాసనే తమిళనాడు తమిళులు వెక్కిరిస్తారు. శ్రీలంక ముస్లిములు కూడా తమిళులే అయినా వారికి ప్రత్యేకమైన యాస ఉంది. దాన్ని వీళ్లు ఎత్తిచూపుతున్నారు. శ్రీలంక జనాభాలో ముస్లిము తమిళులు 10% ఉంటారు. హిందూ తమిళులు 13% ఉంటారు. బౌద్ధులు 70%, క్రైస్తవులు 7%  ఉంటారు. ఇరు మతాల తమిళులు ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు.

చాలా యిళ్లల్లో మగవారు ఎల్‌టిటిఇ చేతిలోనో, సైన్యం చేతిలోనో చనిపోయారు. అంతంత మాత్రంగా చదువుకున్న ఆడవాళ్లే యిళ్లు నడుపుతున్నారు. కాస్త డబ్బున్నవాళ్లు గొడవలు ప్రారంభం కాగానే విదేశాలకు వెళ్లి స్థిరపడిపోయారు. అందువలన అక్కడున్న వాళ్ల పరిస్థితి నాసిగా ఉంది. తత్ఫలితంగా యిరు వర్గాల మధ్య అసూయాద్వేషాలు కూడా కలిగాయి. అయినా ప్రత్యక్షంగా కలహాలకు దిగలేదు. కానీ యిటీవల మనదేశంలో హిందూత్వ శక్తులకు ఊపు రావడంతో శ్రీలంకలో కూడా హిందూ శక్తులు తమ ప్రతాపం చూపదలచాయి. 2016 అక్టోబరులో ''శివ సేనై'' పేర ఒక సంస్థ వెలిసింది.

ముస్లిం, క్రైస్తవ సంస్థల మతాంతీకరణను అడ్డుకోవడానికి ఆవిర్భవించాని చెప్పుకుంటోంది. దానికి ప్రతిగా ముస్లిములు అనేక కొత్త మసీదులు కట్టి ముస్లిముల్లో మతభావనలను రెచ్చగొట్టసాగారు. భారీగా ముస్లిము విద్యాసంస్థలు కూడా నెలకొల్పసాగారు. ఈ ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు జరిగి జాఫ్నా మేయరుగా ఇమ్మాన్యుయేల్‌ ఆర్నాల్డ్‌ ఎంపిక అయినప్పుడు సేవా సేనై 'తమిళ ప్రాంతాల్లో క్రైస్తవ ప్రాబల్యాన్ని సహించం' అని అడ్డు చెప్పింది. తమిళ మీడియాలో కొన్ని వర్గాలు వారికి వత్తాసు పలికాయి. ఇలా కొద్దిపాటి గొడవలు జరుగుతూండగా యింతలో ఏప్రిల్‌లో యీ స్కూలు గొడవ వచ్చింది.

డ్రస్సు మార్చిన నలుగురు ముస్లిం టీచర్లు ఆందోళన కారణంగా తమను 'ముస్లిం' స్కూళ్లకు బదిలీ చేయమని ప్రభుత్వాన్ని కోరారు. ఇది శివసేనైలో ఉత్సాహాన్ని నింపింది. రంజాన్‌ మాసం వస్తూండగా గోవధ, గోమాంసం అమ్మకం నిషేధించాలంటూ జాఫ్నాలో నిరసన తెలిపారు. 'ఇది హిందువుల, బౌద్ధుల దేశం. మేం గోవులను పూజిస్తాం. మా సెంటిమెంట్లు గౌరవించాలి.' అని ప్రకటించి ముస్లిములూ హిందూ సంప్రదాయాలను అవలంబించాని పట్టుబడుతున్నారు. కొలంబోలో ముస్లిములు ఎక్కువగా నివసించే శివారులో గోరక్షణ సమితి వెలిసింది.

నందిని అధిరోహించిన శివుడు బొమ్మతో పెద్ద హోర్డింగు పెట్టి 'గోమాంసం తిననివారిని దేవుడు రక్షిస్తాడు' అని రాసి పెట్టారు.  సింహళ వంటకాలు - ముఖ్యంగా మాంసాహారం - ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షిస్తాయి. ఇప్పుడీ నిషేధం వలన టూరిజం దెబ్బ తినవచ్చు. రంజాన్‌ మాసంలోనే యీ వివాదం లేవనెత్తడంలో దురూహ కనబడింది కొన్ని తమిళ సామాజిక సంస్థలకు. 'మనల్ని చీల్చడానికి పొరుగుదేశం రచించిన వ్యూహం యిది' అంటున్నాయి అవి. ఎందుకంటే శివసేనై ప్రారంభం కాగానే శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ మద్దతు ప్రకటించాడు. 

ఈ వివాదం కారణంగా తామెవరికీ లొంగేది లేదని, తమ ఐడెంటిటీని కాపాడుకోవడానికి వెరవమని చాటుకోవడానికి యిరు వర్గాలూ ప్రయత్నిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ముస్లిము వనితలు అబయా ఎక్కువగా వేసుకుంటున్నారు. అరేబియా ప్రాంతం నుంచి తిరిగి వచ్చిన బంధువులు బహుమతిగా యిచ్చినవి కొన్ని. లోకల్‌ మార్కెట్లలో అమ్ముతున్నవి కొన్ని. కొంతమంది నల్లవి వేసుకుంటారు. మరికొందరు రంగురంగులవి వేసుకుంటారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?