Advertisement

Advertisement


Home > Articles - Special Articles

మరణించిన యువతి మళ్లీ పుట్టింది

మరణించిన యువతి మళ్లీ పుట్టింది

పునర్జన్మలున్నాయా? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు. ప్రతి వారికి ఊహ తెలిసినప్పటి నుంచీ పోయే దాకా వినిపించే, అనిపించే ప్రశ్నే. 

ఈ నేపథ్యంతో భారతీయ భాషల్లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు హిట్సే. 

కానీ అది నిజమని నమ్మాలంటే మాత్రం శాస్త్రీయత అడ్డొస్తొంది. 

బాబు గోగినేని లాంటి సుప్రసిద్ధ హేతువాదులు ఈ టాపిక్ మీద అనర్గళంగా ప్రసంగించి పునర్జన్మలనేవి మూఢవిశ్వాసాలని చెప్పి చాలామందిని నమ్మించగలరు. వాళ్లు చెప్పే మాటలు ఆ కాసేపూ హేతుబద్ధమనిపించినా మళ్లీ కొన్నాళ్లకి "పునర్జన్మలున్నాయంటావా?" అని ఎవర్నో ఒకళ్లని అడగాలనిపిస్తుంది. మనసులో ఎక్కడో పునర్జన్మలున్నాయేమోనన్న నమ్మకం దోబూచులాడుతుంటుంది. భగవద్గీతలాంటివి విన్నప్పుడు నిజమేననే భావన కూడా కలుగుతుంది. 

అడపా దడపా ఎవరికో పూర్వజన్మస్మృతి కలిగిందన్న వార్తలొస్తుంటాయి. పేపర్లోనో, టీవీలోనో ఒకరోజు చూపిస్తారు. అవి చూస్తున్నప్పుడు మళ్లీ వీటిని ఘంటాపథంగా నమ్మాలనిపిస్తుంది. 

తాజాగా అలాంటి ఒక సంఘటన వార్తలకెక్కింది. 

రాజస్థాన్ లోని రాజ్ సమంద్ అనే కుగ్రామంలో నాలుగేళ్ల కింజల్ అనే పాప తన ఊరు పిప్లాంత్రీ అని, తన పేరు ఉష అని చెప్పడం మొదలుపెట్టింది. తాను మంటల్లో కాలిపోయానని, తన ఇల్లు ఫలానా చోట ఉందని, తన తల్లి-తండ్రి, సోదరుడు, భర్త, పిల్లల పేర్లతో సహా చెప్పడం కొనసాగించింది. మొదట తల్లిదండ్రులు అంతగా పట్టించుకోలేదు. కానీ పదే పదే ఇవే కబుర్లు చెబుతుండడంతో డాక్టరుకు చూపించారు. ఎటువంటి మానసిక రుగ్మత ఆమెకు లేదని డాక్టరు చెప్పాడు. 

అయినా పిల్ల మాటల్లో మార్పు లేకపోవడంతో ఆ వివరాలు ఆరా తీస్తే అందరికీ ఆశ్చర్యపోయే సత్యం ఎదురయ్యింది. 

నిజంగానే పిప్లాంత్రీ అనే గ్రామంలో 2013లో ఉష అనే యువతి పొయ్యంటుకుని, ఒళ్లుకాలి చనిపోయింది. కింజల్ చెప్పిన పేర్లతోనే ఆ చనిపోయిన ఉషకు కుటుంబసభ్యులంతా ఉన్నారు. 

"మీ ఇంటి ఉష మా ఇంట్లో కింజల్ గా పుట్టింది" అనే విషయం కింజల్ తండ్రి ఉష కుటుంబానికి చెప్పగానే వాళ్లు మొదట నమ్మలేదు. 

కానీ కింజల్ ని పిప్లాంత్రీకి కి తీసుకురాగానే అందరూ చచ్చినట్టు నమ్మాల్సొచ్చింది. కింజల్ తన గతజన్మ తల్లిని చూసి బిక్కమొహం పెట్టింది. అందరి కుటుంబ సభ్యుల దగ్గరకి ఏడవకుండా వెళ్ళింది. మెట్ల దగ్గర ఉండాల్సిన మొక్క ఏదని అడిగింది. దానిని ఈ మధ్యనే తొలగించామని ఇంట్లో వాళ్లు ఆమెకు చెప్పారు. 

ఇదంతా చూసి పునర్జన్మల్ని నమ్మాల్సిందే అని ఆ గ్రామాల్లోని వాళ్లంతా అనుకుంటున్నారు. 

అయితే ఇది నమ్మకుండా ఇందులో ఏదైనా గూడుపుఠాణీ ఉందా అని కొందరు ఆ కోణంలో పరిశోధించారు. ఉష కుటుంబం నుంచి ఏదన్నా ఆస్తిని ఆశించి కింజల్ కి ఉషకి సంబంధించిన కొన్ని పేర్లతో ట్రైనింగ్ ఇచ్చి తన తల్లిదండ్రులే ఈ పని చేసారా అని కొందరికి అనుమానమొచ్చింది. 

అయితే ఇక్కడ ప్రస్తావిస్తున్న రెండు కుటుంబాలూ నిరుపేద కుటుంబాలే. పైగా కింజల్ తల్లి తెగ బెంగ పడుతోంది...ఏ క్షణాన్నైనా తన కూతురు గతజన్మకి ఎక్కువగా కనెక్టయి ఉషగా మారిపోతుందుందేమోనని. 

కానీ మనసున్న కింజల్ తండ్రి రతన్ సింగ్ మాత్రం ఉష కుటుంబంతో కింజల్ కి రోజూ ఫోనులో వీడియో కాలింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించాడు. తన గత జన్మ కుటుంబంతో ఇప్పుడా పాపకి బంధుత్వం కొనసాగుతుండడం చూసి సంతృప్తిగానే ఉన్నాడు. 

జన్మల్ని నమ్మినా నమ్మకపోయినా, రెండు కుటుంబాలు కులాలు మరిచి చక్కగా బంధుత్వాన్ని కలుపుకున్నాయి. ఉషది పేద బ్రాహ్మణ కుటుంబమైతే, కింజల్ ది పేద రాజపుట్ కుటుంబం. 

వృద్ధురాలైన ఉష తల్లికి కలిగిన గర్భశోకం ఇప్పుడు లేదు. ఏ కుమార్తెనైతే తొమ్మిదేళ్ల క్రితం కోల్పోయిందో ఆమె ఇప్పుడు నాలుగేళ్ల కింజల్ గా తన ముందుందన్న భావనతో ఆమెలో కొత్త చైతన్యం వచ్చింది. 

ఇదంతా ఇప్పుడు జరుగుతున్న కథ. 

అయితే సరిగ్గా ఇలాంటిదే మహత్మాగాంధీ టైములో ఒకటి జరిగింది. అది శాంతిదేవి సంఘటన. అది కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. 

ఇప్పుడున్న మాధ్యమాల వెల్లువలో దేనికీ అటెన్షన్ పే చేసే ఓపిక, తీరిక జనానికి లేదు గానీ అప్పట్లో మాత్రం శాంతిదేవి కథ అంతర్జాతీయంగా పెద్ద సంచలనమయింది. గాంధీజీ కూడా ఆమె వార్తపై దృష్టి సారించారు. 

శాంతి దేవి 1926లో ఢిల్లీలో పుట్టింది. నాలుగేళ్ల వయసు రాగానే తన ఊరు మథుర అని చెప్పింది. తన భర్త అక్కడ కృష్ణుడి గుడి ముందు బట్టల షాపు నడుపుతున్నాడని చెప్పింది. అతనెలా ఉంటాడో, అతనికి ఎక్కడ పుట్టుమచ్చ ఉందో కూడా చెప్పడం ..ఆమె మథుర ఇంట్లో ఎటువంటి మిఠాయిలు తినేవాళ్లో వివరించడంతో...శాంతిదేవి తల్లిదండ్రుల్లో కంగారు మొదలయింది. ఆ ఊరి స్కూల్ హెడ్మాస్టరు ప్రమేయంతో మథురకు వెళ్లి వాకబు చేస్తే శాంతిదేవి చెప్పిన బట్టలకొట్టు యజమాని దొరికాడు. ఆమె భార్య లుబ్డీ దేవి 9 ఏళ్ల క్రితం మరణించింది. అతనికి శాంతిదేవి చెప్పిన గుర్తులన్నీ ఉన్నాయి. నెమ్మదిగా శాంతి దేవి చెప్పిన పేర్లన్నీ ఆరా తీస్తే ఒక్కటి కూడా పొల్లు పోకుండా అన్నీ నిజమని తేలాయి. 

ఆ గతజన్మ భర్తని నాలుగేళ్ల శాంతిదేవి కలిసింది. కాసేపట్లో ఆమె అతనిని అడిగిన ప్రశ్న, "ఎప్పటికీ రెండో పెళ్లి చేసుకోనని మాటిచ్చావు కదా. మరి ఎందుకు చేసుకున్నావు?" అని. 

అది అత్యంత ఏకంతంగా అతను తన భార్య లుబ్డీదేవికి చేసిన వాగ్దానం. వారిద్దరికీ తప్ప ఇంకెవరికీ తెలిసే అవకాశం లేని విషయం. 

ఈ వార్త గాంధీజీ చెవిన పడింది. ఆయన శాంతిదేవిని కలిసి మాట్లాడడమే కాకుండా కాకుండా 15 మందితో కూడిన కమిటీని కూడా వేసి నిజాలు నిగ్గుతేల్చమన్నారట. ఆ కమిటీలో విద్యావేత్తలు, జర్నలిస్టులు, సైకాలజిస్టులు ఉన్నారు. అందరూ కలిసి ఆమెతో కలిసి మథుర వెళ్లి పరిశోధన చెసి శాంతిదేవి చెప్పేదంతా నిజమని.. ఆమె గతజన్మలో లుబ్డీ దేవేనని తేల్చి రిపోర్టు సమర్పించారు. 

శ్యాం సింఘరాయ్, మగధీర లాంటి సినిమాల్లోనే కాదు...నిజజీవితంలో కూడా ఇలాంటి పునర్జన్మ కథలు ఎన్నో ఉంటున్నాయి. మనం పెద్దగా దృష్టి పెట్టమంతే. పైగా మనకి ఆ అనుభవాలేవీ లేవు కనుక అటువంటి అనుభవాలు పొందేవాళ్లని కట్టుకథలుగానో, మరొకటి గానో పరిగణించమంటుంది మనలోని లాజికల్ మైండ్. 

కానీ మన కాన్షియస్ మైండ్ కి అందని ఎన్నో విషయాలు మనలో నిక్షిప్తమయ్యుంటానేది సైంటిస్టులు కూడా ఒప్పుకుంటారు. అయితే వాటిల్లో పునర్జన్మ కూడా ఉంటుందా అనేది ఎన్ని దృష్టాంతాలు చూసినా ఇంకా చాలామందికి శేషప్రశ్నే.

రిగ్రెషన్ హిప్నోతెరపీ పేరుతో గతజన్మల్ని దర్శించే మార్గం కనిపెట్టామంటున్నారు ప్రపంచవ్యాప్తంగా చాలామంది. 

తెలుగు వాళ్లల్లో డాక్టర్ న్యూటన్ కొండవీటి ఈ రకమైన గతజన్మ అనుభూతుల్ని ఎందరికో కలగజేసారు. ట్రాన్సులోకి తీసుకువెళ్లి గత జన్మల్ని దర్శింపజేయడం ఈ రిగ్రెషన్ హిప్నోతెరపీ ప్రత్యేకత. వెళ్లినవాళ్లల్లో చాలామంది తాము చూసింది కలకాదు, ఊహించుకున్న దృశ్యం కాదు ..గతజన్మల దృశ్యాలే అని చెప్తున్నవారున్నారు. అదెలా సాధ్యమంటే "కావాలంటే మీరూ ప్రయత్నించి చూడండి" అంటున్నారు. 

ఏది ఏమైనా పునర్జన్మకి సంబంధించిన కథలన్నీ ఆసక్తికరాలే. గతజన్మ గురించి తెలుసుకోవాలనే కోరిక కూడా పలువురిలో ఉంటున్నదే. పుటుక, చావు కనిపిస్తున్నాయి కనుక నిజమని నమ్మే మనమంతా పునర్జన్మల విషయంలోనే భిన్నాభిప్రాయాలతో ఉంటున్నాం. ఎందుకంటే పుటుక, చావు మాదిరిగా గతజన్మస్మృతి అందరికీ సమానంగా కనిపించట్లేదు మరి. 

- వి. పినాకపాణి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?