Advertisement

Advertisement


Home > Articles - Special Articles

తెదేపా యువరాజుకి కట్టప్ప వెన్నుపోటు

తెదేపా యువరాజుకి కట్టప్ప వెన్నుపోటు

యుద్ధం చేసి చేసి అలసిపోయి నీరసమొచ్చిన యోధుడు కత్తి ఊపుడు ఆపకూడదు కాబట్టి ఒడుపు లేకుండా ఇష్టమొచ్చినట్టు ఊపుతుంటాడు. 

నిజంగా రాజులనాటి కత్తియుద్ధం చూడకపోయినా సినిమాల్లో ఇలాంటి సీన్లు చాలాసార్లు చూసే ఉంటాం. ఆ టైములో కత్తి ఎవడి వీపులో దిగుతోందో కూడా బైర్లు కమ్మిన యోధుడి కళ్లకి కనపడదు. 

ఇప్పుడు తెదేపాకి కట్టప్పలాంటి ఆంధ్రజ్యోతి వారి కలం అలాగే ఊగుతోంది.  సాక్షాత్తు పార్టీకి యువరాజైన లోకేష్ బాబు వెన్నులోకి అడుగున్నర లోతు పెన్నుపోటు వేసేసినా కూడా వివరం తెలియట్లేదు. 

వైకాపాని దునమాడాలి, తెదేపాని కాపాడుకోవాలి అనే ఉద్దేశ్యంతో ఆంధ్రజ్యోతి మొదలుపెట్టిన యుద్ధానికి ఇప్పుడు "తన" ఎవరో, "పర" ఎవరో బేధం బొత్తిగా తెలుస్తున్నట్టు లేదు. 

గుమ్మడికాయంత అక్షరాలతో "టార్గెట్ బాబు" అని హెడింగ్ పెట్టి దాని కింద తాటికాయ సైజులో "చంద్రబాబు వయసైపోయింది! గెలిస్తే వచ్చేది లోకేశే అని ప్రచారం- టీడీపీవైపు జనం మొగ్గకుండా కొత్త అస్త్రం" అని సబ్ టైటిల్ అచ్చేసారు. 

దాని కింద, "ముందే గ్రహించిన టీడీపీ నాయకత్వం- చంద్రబాబే సీయం అవుతారని స్పష్టీకరణ" అని కూడా ముద్రేసారు. 

దీని సారాంశం ఏమిటి? 

పొరపాటున తెదేపా గెలిచినా లోకేష్ సీయం అవ్వడులే భయపడకండి అని జనానికి చెప్పడమేగా? 

ఏ తండ్రైనా తనని తిట్టినా సహిస్తాడు కానీ ఒక్కగానొక్క ప్రియమైన పుత్రరత్నాన్ని అయోగ్యుడు అంటే భరించగలడా? 

అందులోను ఆ మాట ప్రత్యర్థులంటే పంటిబిగువున ఓర్చుకోవచ్చు. కానీ సొంత కరపత్రికలో సొంతవాళ్లే ఇలా ముద్రించారంటే ఆయనెలా ఫీలౌతారు అనే ఇంగితముండాలి కదా? 

గతంలో కొడుకుని దొడ్డిదారిన మంత్రిని చేసి మురిసిపోయిన చంద్రబాబుకి ఎప్పటికైనా కొడుకుని ముఖ్యమంత్రి సింహాసనంలో కూడా చూడాలని ఉంటుందన్న సంగతి విడిగా చెప్పక్కర్లేదు. 

అసలీ వయసులో ఆయన యావంతా కొడుకుని నిలబెట్టుకోవడం కోసమే. 

పక్క రాష్ట్రంలో కేసీయార్ తనయుడు కేటీయార్ డిఫాల్ట్ ముఖ్యమంత్రిగా వ్యవహారాలు చక్కబెడుతున్నాడు. సొంత రాష్ట్రంలో తన సమకాలికుడైన వైయస్సార్ తనయుడు జగన్ ముఖ్యమంత్రైపోయాడు. తన కొడుకు మాత్రం ఎవరి నమ్మకాన్ని గెలుచుకోలేకపోతున్నాడు. 

అసలే ఈ కంప్యారిజన్ సిండ్రోం తో కుమిలిపోతుంటే ఈ ఆంధ్రజ్యోతి రాతలు పుండు మీద కారం పూయడానికన్నట్టున్నాయి. 

నిన్నటికి నిన్న చంద్రబాబుకి అమిత్ షా ఫోన్ చేసి సంజాయిషీ చెప్పుకున్నారన్న చందంగా వార్త రాసారు. తరవాత అది అబద్ధమని తేలి చంద్రబాబు పరువు పోయింది. దానికి మళ్లీ కవరింగిస్తూ "తెదేపా నాయకులు చెప్పారు" అని రాసారు. 

అడుసు తొక్కనేల కాలు కడగనేల? అన్నిటికీ అనుకూలమైన అబద్ధపు రాతలతో గోబెల్స్ ప్రచారమే చేసుకుంటామంటే బెల్స్ మోగవు... రివర్సులో పరువుపోవడం తప్ప. 

పార్టీ అధినేతకి వృద్ధాప్యం వచ్చినప్పుడు యువరాజు ఎవరో తెలియకపోతే కేడర్ అయోమయంలో ఉంటుంది. కార్యకర్తలకి కూడా యువనాయకుడు లేక ఉత్సాహం ఉండదు. 

దీని పర్యవసానం ఎన్నికల ఫలితాల మీద భయంకరంగా ఉంటుంది. 

లోకేశే మా నాయకుడని మొన్న చంద్రబాబు దీక్షలో మాట్లాడుతూ రాం మోహన్ నాయుదు లాంటి వాళ్లు కూడా అన్నారు. 

లోపల ఎవరికెలాంటి ఫీలింగులున్నా పైకి మాత్రం యువరాజునే యువసారధిగా కొనియాడుతున్నారు. 

ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి "టార్గెట్ బాబు" కథనం లోకేష్ ని పత్రికాముఖంగా కించపరిచినట్టయ్యింది. 

హరిగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?