Advertisement

Advertisement


Home > Articles - Special Articles

కొత్తగా 20 రూట్లలో ట్రూజెట్‌ విమాన సర్వీసులు

కొత్తగా 20 రూట్లలో ట్రూజెట్‌ విమాన సర్వీసులు

మార్చ్‌ 25న చెన్నై- సేలం సర్వీస్‌ ప్రారంభం

త్వరలో అహ్మదాబాద్‌, గౌహతి నుంచి సర్వీసులు ప్రాంతీయ విమానయాన సంస్థగా సేవలు ప్రారంభించిన ట్రూజెట్‌ అనతి కాంలోనే జాతీయ విమానయాన సంస్థగా ఎదిగి త్వరలో దేశవ్యాప్తంగా మరిన్ని సర్వీసులను తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల నుంచి కూడా ప్రారంభించనుంది. మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) గ్రూప్‌ కంపెనీలో భాగమైన టర్బో మేఘా ఎయిర్వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ‘ట్రూజెట్‌’ పశ్చిమ, తూర్పుతీరం, ఈశాన్య భారతం నుంచి కూడా విమాన సేవలను విస్తరించనుంది. త్వరలో దేశవ్యాప్తంగా మరో 20 రూట్లలో తన సేవలను ప్రారంభించనుంది. 

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, అస్సోం రాజధాని గౌహతి నుంచి ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాలకు విమానాలు నడపనుంది. ఇప్పటికే హైదరాబాద్‌ కేంద్రంగా12 ప్రాంతాలకు రోజూ కనీసం 2వేల మందిని వివిధ ప్రాంతాలకు తీసుకువెళుతున్న ట్రూజెట్‌ త్వరలో నాలుగింతలకు పెంచుకోవాలనే లక్ష్యంతో కార్యకలాపాలను విస్తరిస్తోంది.

సాధారణంగా దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో విమానయాన సేవలు ప్రారంభించేందుకు పేరేన్నికగన్న సంస్థలు ముందుకురాని సందర్భంలో మేఘా టర్బో ట్రూజెట్‌ అస్సాం కేంద్రంగా ఈశాన్య రాష్ట్రాల్లో సేవలు విస్తరించనుంది. వీటితోపాటు ట్రూజెట్‌ సేవలు మరిన్ని నూతన రూట్లలో విస్తరిస్తామని టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ లిమిటెడ్‌ ట్రూజెట్‌ సంస్థ వాణిజ్య వ్యవహారాల పర్యవేక్షణ అధికారి సెంథిల్‌ రాజా తెలిపారు. 

ఉడాన్‌ పథకం రెండోదశ కింద తమ సంస్థ 20రూట్లలో విమానాలు నడిపేందుకు అనుమతి పొందిందని తెలిపారు. తాము అనుమతి పొందిన రూట్లలో అహ్మదాబాద్‌ నుంచి గుజరాత్‌లోని పోరుబందర్‌, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌, మహారాష్ట్రలోని నాసిక్‌, జగావ్లతో పాటు గౌహతి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లోని కుఛ్బిబెహర్‌, బురన్పూర్‌, తేజు, తేజ్‌పూర్‌ తదితర మార్గాలు ఉన్నాయ్‌ అని వెల్లడించారు. ఈ నెల 25న తమిళనాడు రాజధాని చెన్నై నుంచి తమ సంస్థ విమాన సర్వీసులు ప్రారంభిస్తుందని రాజా తెలిపారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎయిర్‌షో (వింగ్స్‌ ఇండియా`2018)లో మేఘా టర్బో ట్రూజెట్‌ పాల్గొనడంతో పాటు స్టాల్‌ను నిర్వహిస్తూ ప్రయాణికులకు మరింత సేవలు అందించే విధంగా కార్యక్రమాలను విస్తృతం చేస్తోంది. 

రెండేళ్లలో 10 లక్షల మంది ప్రయాణం

సంస్థని స్థాపించిన రెండున్నర సంవత్సరాల్లోనే పది లక్షలమంది ప్రయాణికులను దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేసిన ట్రూజెట్‌ దేశంలోని మారుమూల ప్రాంతాలకు విమానాలు నడపడం ద్వారా దేశ విమానయాన చిత్రపటంలోకి వాటిని ఎక్కించే ప్రయత్నం చేస్తోంది. 2015 జూలై 12న రెండు విమానాలతో ప్రారంభమైన టర్బో మేఘా ఎయిర్వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ట్రూజెట్‌ సంస్థ ఈ ఏడాది జనవరి 19 నాటికి తమ సంస్థలో ప్రయాణించే 10లక్షల ప్రయాణికులను హైదరాబాద్‌ నుంచి వివిధ మార్గాల్లో తీసుకెళ్లింది. ప్రస్తుతం ట్రూజెట్‌ ఐదు విమానాలను దేశంలోని వివిధ మార్గాలకు నడుపుతోంది. ప్రతిరోజు 13 ప్రాంతాలకు 32 సర్వీసెస్‌ను ట్రూజెట్‌ నడుపుతోంది. 

ఈ సర్వీసెస్‌ ద్వారా ఈ ఏడాది జనవరి 19 నాటికి 10 లక్షల మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేసిన ట్రూజెట్‌ మరో 50 రోజుల్లోనే లక్షమందిని వారి గమ్య స్థానాలకు చేరవేసింది. త్వరలో మరో ఏడు విమానాలు... ప్రస్తుతం ట్రూజెట్‌ సంస్థ ఐదు విమానాల ద్వారా ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు తీసుకెళుతోంది. ఐదు విమానాలకు తోడుగా మరో ఏడు విమానాలను వాటి సరసన త్వరలో ట్రూజెట్‌ చేర్చబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉదాన్‌ పథకం తొలిదశలో 18 రూట్లను పొందిన ట్రూజెట్‌ ఆయా ప్రాంతాలకు ఇప్పటికే విమాన సర్వీసెస్‌ను ప్రారంభించింది. 

సర్వీసెస్‌ ప్రారంభించిన నగరాల్లో హైదరాబాద్‌ నుంచి ముంబై, ఔరంగాబాద్‌, చెన్నై, గోవా, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, కడప, రాజమండ్రి, మైసూర్‌, విద్యానగర్‌ ఉన్నాయి. హైదరాబాద్‌-ఔరంగాబాద్‌ మధ్య విమాన సర్వీస్‌ నడుపుతున్న సంస్థ ట్రూజెట్‌ ఒక్కటే. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బేగంపేట్‌ విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న వింగ్స్‌ ఇండియా 2018 లో ప్రత్యేకంగా ఒకస్టాల్‌ ను ఏర్పాటు చేసి దేశంలోని ప్రయాణికులను విమానయానానికి ఉత్సాహం చూపే విధంగా అవగాహన కల్పిస్తున్నట్లు సెంథిల్‌ తెలిపారు. తమ విమానాల్లో టికెట్‌ ప్రారంభ ధర 599 రూపాయలేనని పేర్కొన్నారు. 

ప్రయాణికులకు ఉచితంగా అల్పాహారం, ఆహారం అందిస్తూ మెరుగైన సేవలు నిర్వహిస్తున్న సంస్థగా మేఘా టర్పో ట్రూజెట్‌ ప్రసిద్ధికెక్కింది. దక్షిణాదిలో హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరుకు తొలుత సర్వీసులు ప్రారంభించిన ట్రూజెట్‌ అనతికాలంలోనే ఔరంగబాద్‌, చెన్నై, కడప, గోవా, ముంబయి, నాందేడ్‌, బళ్లారి, మైసూర్‌ ప్రాంతాలకు విమానసర్వీసులను విస్తరించింది. ట్రూజెట్‌ ప్రయాణికులకు అధునాతన ఎంటర్‌టైన్‌మెంట్‌ సౌకర్యాలను అందజేస్తోంది. 

స్నేహితులు, కుటుంబసభ్యులు గ్రూప్‌బుకింగ్స్‌ చేసుకుంటే వారికి వివిధ ప్రత్యేక సధుపాయాలను కల్పిస్తోంది. అదేవిధంగా ట్రూజెట్‌ బి ప్లాన్‌ క్రింద మధ్య, చిన్నతరహా ఎంటర్‌ప్రైజులకు ప్రత్యేక సధుపాయాలను అందిస్తోంది. అలాగే కార్పోరేట్‌ రంగంలోనివారికి తరచూ ప్రయాణించేవారికి ఫ్లాట్‌ రేటు విధానం క్రింద ప్రయాణికులకు అనుకూలమైన చార్జీలను వసూలు చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తే కాన్సిలేషన్‌ ఫీజు కూడా అతి తక్కువగా ఉంటోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?