తెలుగు చిత్ర సీమని ఈగో జాడ్యం పీడిస్తోంది. ఫలానా సినిమాని ఫలానా డేట్కి విడుదల చేస్తామని ముందుగా ప్రకటించిన వాళ్లు అదే డేట్కి మరో చిత్రం వస్తే తమ చిత్రాన్ని వాయిదా వేసుకోవడానికి ససేమీరా అంటున్నారు. ఇది కాస్తా ఇరు వర్గాల మధ్య పంతానికి దారి తీస్తోంది.
ఒకేసారి విడుదలైన సినిమాల్లో ఏదో ఒకటి నష్టపోవడం అనివార్యం కనుక ఎవరో ఒకరికి తీవ్ర స్థాయిలో లాస్ తప్పట్లేదు. గత ఏడాది లై, జయ జానకీ నాయక, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలని ఒకే రోజున విడుదల చేయడంతో రాణా సినిమా తప్ప తక్కిన రెండూ ఫెయిలయ్యాయి.
ఎంత లాంగ్ వీకెండ్ వచ్చినా కానీ తెలుగు పండుగలు లేని టైమ్లో ఎక్కువ సినిమాలని ఆదరించడం మన ప్రేక్షకులకి అలవాటు లేదు. ఈ విషయాన్ని విస్మరించి లై, జయ జానకీ భారీ మూల్యం చెల్లించుకున్నాయి. ఆ తర్వాత ఇలాంటి సిట్యువేషనే హలో, ఎంసిఏ మధ్య తలెత్తింది. ఈ పోటీలో హలో చిత్రం భారీ స్థాయిలో నష్టపోయింది. అయినప్పటికీ ఈ పరిస్థితి మళ్లీ మళ్లీ వస్తోంది.
ఇటీవలే తొలిప్రేమ, ఇంటిలిజెంట్, గాయత్రి చిత్రాలని ఒకేసారి విడుదల చేయడం చర్చనీయాంశమైంది. మీడియం బడ్జెట్ సినిమాల మాట ఎలా వున్నా కానీ పెద్ద సినిమాల మధ్య ఇంతకాలం జెంటిల్మన్ ఒప్పందాలుండేవి. కానీ ప్రస్తుతం నా పేరు సూర్య, భరత్ అనే నేను చిత్రాల మధ్య జరుగుతోన్న 'పంతం నీదా నాదా సై' అనే రగడ బయ్యర్లకి వణుకు పుట్టిస్తోంది. కోట్ల వ్యాపారం ముడిపడి వున్న బిజినెస్లో అహానికి పోతే ఎవరో ఒకరు కుదేలైపోరా మరి?
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు