తమను తాము ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే ఏదైనా సమయం రావాలి. కరోనా విపత్కర కాలంలో ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత మార్పు తీసుకొస్తోంది. కొందరిని తత్వవేత్తలుగా మారుస్తోంది. అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్. తొలి చిత్రం 'ధడక్'లో మంచి నటన కనబరచి ప్రేక్షకుల మనసు గెల్చుకున్నారామె. తనలో కరోనా తీసుకొచ్చిన మార్పు, అలాగే నేర్పిన గుణపాఠం గురించి ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.
‘వారం నుంచి లాక్ డౌన్లో ఉంటున్నా. ఈ సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. రోజూ తింటున్న ఆహారం విలువేంటో ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే లాక్డౌన్ కారణంగా తినడానికి తిండిలేని వాళ్ల గురించి కథలుకథలుగా వింటున్నాం. ఇంట్లో తినడానికి సరిగ్గా ఆహారంలేక ఎప్పటికప్పుడు కొనుగోలు చేయడానికి సాహసం చేసి బయటకు వెళ్తున్న వాళ్లను చూస్తుంటే ఏదో తెలియని బాధ, భయం. ఇలాంటి అభాగ్యుల గురించి ఇంత కాలం ఆలోచించకుండా నేనెంత స్వార్థంతో, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించానో తెలుసుకున్నాను’ అని ఆమె తన అభిప్రాయాన్ని నిజాయితీగా వెల్లడించారు.
జాన్వీ ఇంతటితో ఆగలేదు. ఇంకా అనేక అభిప్రాయాలను వెల్లడించి మనసును నీట్గా శుభ్రం చేసుకున్నారు. ఇంకా ఆమె ఏమంటారంటే...
‘ప్రతిరోజూ మా నాన్న మమ్మల్ని ఎంతగా మిస్ అవుతున్నారో తెలుసుకున్నాను. మా పనుల్లో మేము ఉండి ఇంటికి తిరిగొచ్చే సమయం వరకు మా కోసం ఆయన ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థమైంది. నా రోజువారీ జీవితం సాఫీగా సాగిపోవడానికి ఎంతమంది మీద ఆధారపడ్డానో అర్థమైంది. మా ఇంటికి నేను చాలా అవసరం అనే సంగతి గ్రహించాను. వాళ్లందరినీ బాధ్యతగా చూసుకోవాలని తెలుసుకున్నాను. వాళ్ల ఆరోగ్యమే నా ఆరోగ్యం అని తెలుసుకున్నాను’ అని సోషల్ మీడియాలో ఆమె అంశాలు ఇపుడు వైరల్ అయ్యాయి. మొత్తానికి కరోనా వల్ల నష్టాలే కాదు...గ్రహిస్తే ఎంత మంది ఉందో జాన్వీ రాతలను చదివిన తర్వాత అర్థమవుతోంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు