శ్రుతి హాసన్... అగ్రహీరో కమల్హాసన్ కుమార్తెగా వెండితెరకు పరిచయం అయ్యారు. అయితే కేవలం వారసత్వ బలంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేమని ఆమెకు బాగా తెలుసు.
అందుకే చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందాలన్నా, కొంత కాలంపాటు మనుగడ సాగించాలన్నా ప్రతిభే గీటు రాయని ఆమె బలంగా నమ్మారు. అందుకే నటనలో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు.
కమల్హాసన్ కూతురిగా కంటే, శ్రుతి హాసన్ తండ్రిగా కమల్కు గుర్తింపు తేవాలని ఆమె తాపత్రయం. తాజాగా శ్రుతి హాసన్ ఒక షూటింగ్ స్పాట్ నుంచి ఉన్నట్టుండి పేకప్ చెప్పేశారని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. దీనికి కరోనా భయమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘లాభం’ అనే తమిళ సినిమాలో శ్రుతిహాసన్ తాజాగా హీరోయిన్గా నటిస్తున్నారు. ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ ధర్మపురి, కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరిగింది. సహజంగానే సినిమా షూటింగ్ అంటే చూడ్డానికి జనం ఎగబడుతారనే విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో షూటింగ్ జరుగు తున్న ప్రాంతానికి ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు విజయ్-శ్రుతిహాసన్ను చూసేందుకు పెద్దసంఖ్యలో వెళ్లారు. దీంతో జనాన్ని చూసి కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని శ్రుతిహాసన్ షూటింగ్ మధ్యలోనే సెట్ నుంచి వెళ్లిపోయారు.
ఎవరో , ఏమిటో తెలియని జన సమూహం మధ్య ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్లో పాల్గొనడం ఆరోగ్యపరంగా అంత క్షేమం కాదని భావించి అక్కడి నుంచి అర్ధాంతంగా శ్రుతి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకునే షూటింగ్ మధ్యలో ఆమె పేకప్ చెప్పారనేందుకు ఇటీవల ఆమె చేసిన ట్వీట్ బలం కలిగిస్తోంది.
‘కొవిడ్-19 వల్ల ప్రతిఒక్కరీ ఆరోగ్యానికి ప్రమాదం ఉంది. అది ఇంకా అంతరించిపోలేదు. ప్రోటోకాల్స్ ఫాలో కాని నేపథ్యంలో ఒక మహిళగా.. నటిగా జాగ్రత్తలు తీసుకునే హక్కు నాకు ఉంది’ అని టీవల శ్రుతి ట్వీట్ చేశారు. కరోనా కంగారు ఇంకా చిత్ర పరిశ్రమను వెంటాడుతుందనేందుకు ఇదే తాజా ఉదాహరణ.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు