చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన టైమింగ్ తో ఆకట్టుకున్న నటుడు కోసూరి వేణుగోపాల్. ఆయన పేరు చాలా మంది తెలియకపోవచ్చు కానీ.. ఆయనను చూస్తే మాత్రం ఆయన నటించిన సినిమాలను ఇట్టే గుర్తుకు తెచ్చుకోగలరు.
ఈ రంగానికి అంటూ తేడా లేకుండా అన్ని రంగాల వాళ్లకూ విషాదాలను మిగులుస్తున్న కరోనా మరొకరిని తన ఖాతాలో కలుపుకుంది. మర్యాదరామన్న, పిల్ల జమీందార్, అమీతుమీ వంటి హిట్ సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న కోసూరి వేణుగోపాల్ కరోనాకు చికిత్స పొందుతూ గుండెపోటుకు గురై మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి.
హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్టుగా తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఆయన ప్రభుత్వోద్యోగం నుంచి రిటైరైన తర్వాత నటనపై ఆసక్తితో సినిమాలపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా ఆయనకు పెద్ద పెద్ద దర్శకుల సినిమాల్లోనే అవకాశాలు వచ్చాయి. తనకు దక్కిన పాత్రలకు చక్కగా న్యాయం చేశారు. తనదైన టైమింగ్ తో హాస్యాన్ని పండించారు.
ఆయన ప్రతిభకు మరిన్ని అవకాశాలు రావాల్సిందేమో అనే భావన సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. కరోనా ఆయనను భౌతికంగా దూరం చేసింది. ఇటీవలే ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి హఠాన్మరణంతో చిత్ర పరిశ్రమకు విషాదం కలగగా, ఇప్పుడు మరో ప్రతిభావంతమైన నటుడి మరణంతో మరో విషాదం ఎదురైంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు