జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందుతోన్న 'జై లవ కుశ' సినిమా ఫస్ట్ లుక్ రేపే విడుదల కానుంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా, ఒక్కరోజు ముందుగానే అభిమానులకు 'కానుక' ఇవ్వబోతున్నారు ఫస్ట్ లుక్ రూపంలో. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం విదితమే.
ఇంతకీ, ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఎలా వుండబోతోంది.? ఈ ప్రశ్నకు సమాధానంగా 'బ్రాండ్ న్యూ అవతార్' అనే హింట్ అయితే ఇచ్చేసింది చిత్ర యూనిట్. మళ్ళీ క్వశ్చన్స్ షురూ.. అసలు బ్రాండ్ న్యూ అంటే ఏంటి.? సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఒకటి నెగెటివ్ షేడ్స్ వున్న క్యారెక్టర్. ఆ నెగెటివ్ షేడ్స్ వున్న క్యారెక్టర్కి సంబంధించి మాస్క్ల తాలూకు ఫొటోల్ని గతంలోనే రిలీజ్ చేశారు. సో, ఆ గెటప్నే ఇప్పుడు రివీల్ చేయబోతున్నారని అనుకోవాలేమో.!
మరోపక్క, ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి మూడు స్టిల్స్.. అంటే మూడు లుక్స్ విడుదల చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ఒక్కటే స్టిల్ రిలీజ్ చేస్తే అది పండగ. రెండు స్టిల్స్ విడుదల చేస్తే, డబుల్ పండుగ. మూడు స్టిల్స్ వస్తే.. ట్రిపుల్ ధమాకానే. పండగ ఏ స్థాయిలో వుంటుందనే విషయం రేపు మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు తేలనుంది. అప్పటిదాకా సస్పెన్స్ తప్పదంతే.