ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవితంలో అనేక కోణాలున్నాయి. ఆయనలో ఓ భావకుడు, ప్రేమికుడు, స్వాప్నికుడు ఉన్నాడు. ప్రేమ గీతాలు ఆలపించిన బాలు ... వ్యక్తిగత జీవితంలో కూడా అలాంటి రాగాన్నే అందుకున్నారు. గాయకుడిగా స్థిరపడాలంటే మద్రా సులో ఉండక తప్పని స్థితి. ఎందుకంటే చిత్ర పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్ మద్రాసే. దీంతో ఆయన మద్రాసులోని అగస్తేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉండేవారు. ఆయనకు సావిత్రి అనే కుమార్తె.
చిన్న వయసులోని గాయకుడిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన బాలు నూనూగు మీసాల యవ్వనంలో మెరిసిపోయే వారు. తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కూతురు సావిత్రిపై ఇష్టాన్ని పెంచుకున్నారు. అటు వైపు నుంచి గ్రీన్సిగ్నల్ లభించ డంతో రియల్ లైఫ్లో కూడా ప్రేమ గీతాలు ఆలపించారు. వీళ్లిద్దరి ప్రేమ కథ వాళ్ల పెద్దల చెవిలో పడింది. పెళ్లి ప్రస్తావన రావడంతో కులాలు, గోత్రాలు, ఇతరత్రా అంశాలు తెరపైకి వచ్చాయి. ఇద్దరి గోత్రాలు ఒక్కటే కావడంతో ప్రేమ కథ అడ్డం తిరిగింది. గోత్రాలు ఒక్కటే అయితే వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారనే కారణంతో పెళ్లికి పెద్దలు నిరాకరించారు.
కానీ మనసుల నుంచి ప్రేమను చెరిపేసుకోవడం వాళ్లిద్దరి వల్ల కాలేదు. దీంతో బాలు నోట విరహ గీతాలు వినిపించాయి. మరో వైపు సావిత్రిని బెంగళూరులోని బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. కూతురిని ప్రేమించిన పాపానికి బాలును ఇల్లు ఖాళీ చేయిం చారు. దీంతో బాలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. బాలు బాధను చూడలేక కొందరు మిత్రులు ఓ శుభ ముహూర్తాన సావిత్రి మెడలో బాలు చేతుల మీదుగా సింహాచలం అప్పన్న సన్నిధిలో మూడు ముళ్లు వేయించారు.
దీంతో సినిమాను తలపించేలా బాలు, సావిత్రి ప్రేమ పెళ్లి కథ చివరికి సుఖాంతమైంది. బాలు, సావిత్రి దంపతులకు పల్లవి, చరణ్ అనే ఇద్దరు పిల్లలు. సంగీత సంబంధమైన పేర్లే పిల్లలకు పెట్టడం వెనుక కళపై బాలుకున్న మమకారం, ఆరాధనను తెలియజేస్తోంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు