‘వకీల్సాబ్’ విడుదల నేపథ్యంలో జగన్ ప్రభుత్వాన్ని విలన్గా చూపుతూ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న వారి చెంప పగల గొట్టేలా మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఈ విషయంలో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను వెనకేసుకు రావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు వకీల్సాబ్ మూవీని అడ్డు పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకోవాలనే కుట్రలకు నాగ బాబు ఫుల్స్టాప్ పెట్టారు.
‘వకీల్సాబ్’పై నాగబాబు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మూడేళ్ల తర్వాత నటించిన సినిమా కావడంతో సహజంగానే పవన్ కల్యాణ్ కుటుంబం ఉత్కంఠకు గురైంది. అది నాగబాబు మాటల్లో కనిపించింది. చాలా రోజుల తర్వాత తాను థియేటర్లో సినిమా చూసినట్టు నాగబాబు తెలిపారు. ఇందులో కల్యాణ్ నటించలేదని, సాధారణ జీవితంలో ఉన్నట్టే ఈ సినిమాలో కనిపించాడని నాగబాబు చక్కని అభిప్రాయం తెలిపారు.
ఇదే సందర్భంలో ‘వకీల్సాబ్’ బెన్ఫిట్ షోలపై ఏపీలో నెలకున్న వివాదంపై కూడా ఆయన స్పందించారు. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో బెన్ఫిట్ షోలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం కక్ష కట్టి షోలు ఆడకుండా చేసిందనే ప్రచారంపై నాగబాబు స్పందిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి పనులు చేసే వ్యక్తి కాదని తాను నమ్ముతున్నట్టు తేల్చి చెప్పారు.
పరిపాలనకు సంబంధించి ఎన్నో సమస్యలపై పోరాటం చేస్తూ ఆయన బిజీగా ఉన్నారని వెనకేసుకొచ్చారు. కేవలం స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయకులు మాత్రమే కొన్ని చోట్ల బెన్ఫిట్ షోలను అడ్డుకుని ఉంటారని నాగబాబు అన్నారు.
ఒకవేళ జగన్కు ఈ విషయం తెలిస్తే తప్పకుండా ఆయన స్పందించే అవకాశం.. అంటే అడ్డుకునే వారని పరోక్షంగా నాగబాబు అభిప్రాయపడ్డారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా ఫర్వాలేదని, చిత్రపరిశ్రమలో ఇలాంటి ఇబ్బందులు సృష్టిస్తే సినిమాపైనే ఆధారపడి బతుకుతున్న ఎన్నో కుటుంబాలు, కార్మికులు నష్టపోతారని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు