నటి రేణూదేశాయ్ తన మనసులోని భావాలను ఎప్పుడూ దాచుకునే ప్రయత్నం చేయరు. సామాజిక, రాజకీయ, సినిమా సంగతుల గురించి సోషల్ మీడియా వేదికగా తనవైన అభిప్రాయాలను స్పష్టంగా చెబుతుంటారు. సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటూ నెటిజన్ల ప్రశ్నలకు ముక్కుసూటి సమాధానాలు చెబుతుంటారు.
తాజాగా తన మాజీ భర్త, జనసేనాని పవన్కల్యాణ్ గురించి నెటిజన్ అడిగిన ప్రశ్నకు కూడా ఆమె కుండబద్దలు కొట్టినట్టు సమాధానం ఇచ్చారు. పవన్కల్యాణ్ గురించి ఏదైనా మాట్లాడితే, కొందరు దాన్ని నెగెటివ్గా క్రియేట్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా కూతురు ఆద్యతో కలిసి ఇన్స్టా లైవ్లోకి వచ్చారామె. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎంతో అత్యవసరమైతే తప్ప జన సమూహాల్లోకి వెళ్లొద్దని కోరారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ అకీరా గురించి ప్రశ్నించాడు.
‘మేడమ్.. అకీరా ఎందుకని సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉండరు?’ అని ప్రశ్నించాడు. రేణూ స్పందిస్తూ ...అకీరాకి పలు సోషల్మీడియా ప్లాట్ఫామ్స్లో అకౌంట్స్ ఉన్నాయని, అదంతా ప్రైవేట్గానే ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. కేవలం తన ఫ్రెండ్స్ మాత్రమే అకీరాని ఫాలో అవుతుంటారని వెల్లడించారు. తన ఆన్లైన్ ఖాతాలను పబ్లిక్ చేయడం అకీరాకు ఇష్టం లేదని, అలాగే తనని ఇబ్బంది పెట్టడం నచ్చదని సమాధానమిచ్చారు.
దీంతో రేణూకు వ్యక్తిగత ప్రశ్నలు రావడం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మరో నెటిజన్.. ‘పవన్కల్యాణ్ గురించి ఏమైనా మాట్లాడగలరా?’ అని కోరారు. రేణూ స్పందిస్తూ ...‘ఆయన గురించి ఏం మాట్లాడమంటారు? నా లైవ్కి వచ్చి కూడా మీరు ఆయన గురించే మెస్సేజ్లు పెడతారు.
ఒకవేళ నేను ఆ మెస్సేజ్లు చదివి.. ఆయన గురించి మాట్లాడితే, ‘రేణుకి ఏం పనిలేదు. ఎప్పుడూ ఆయన గురించే మాట్లాడుతుంది’ అని మళ్లీ నన్నే తిడతారు. మీరు అడిగారని మాట్లాడితే నాపై కామెంట్లు చేస్తారు. అలాంటప్పుడు నేనేం చేయాలి. అందువల్లే లైవ్కి రావడం కష్టంగా ఉంటుంది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రేణూ సమాధానం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు