ఫ్రస్ట్రేషన్, ఫ్రస్ట్రేషన్.. పతాక స్థాయికి చేరిన ఈ ఫ్రస్ట్రేషన్లో.. ఏం మాట్లాడుతున్నారో, ఏం రాస్తున్నారో, ఏం చేస్తున్నారో కూడా అర్థం చేసుకోలేని రీతిలో వ్యవహరిస్తున్నాయి పచ్చవర్గాలు! తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే తనేం మాట్లాడుతున్నారో తనే అర్థం చేసుకోలేని రీతిలో ఉన్నట్టున్నారు! సైకిల్ పోవాలి అని ఒకటికి పది సార్లు ఆయనే చెబుతారు! మళ్లీ సారీ అని చెబుతారు! రిగ్గింగ్ చేసుకోవడానికి తిరుపతి వెళితే అడ్డుకున్నారంటారు! ఇక లోకేష్ సంగతి సరేసరి! పాదయాత్రతో ఆయన వ్యవహరం మరింతగా అభాసుపాలవుతున్నారు. ఇక తెలుగుదేశం కార్యకర్తలు కూడా అక్కడక్కడ *సైకిల్ పోవాలి..* అని లోకేష్ సభల్లో *జగనన్నే రావాలి..* అని నినదించి కామెడీలు కొనసాగిస్తూ ఉన్నారు!
జగన్ చేతిలో తెలుగుదేశం పార్టీ ఎవ్వరూ ఊహించనంత స్థాయి ఓటమిని మూటగట్టుకుంది. 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొనేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ అయిపోతుందనుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలే దక్కారు 2019 ఎన్నికల్లో! నాలుగేళ్లు గడిచిపోతున్నాయి.. మరో ఏడాదిలో ఎన్నికలు. ఇలాంటి తరుణంలో కూడా ఇప్పటి వరకూ మళ్లీ అధికారం అందుతుందనే దాఖలాలు ఏమీ కనిపిస్తున్నట్టుగా లేవు. వచ్చే ఎన్నికల్లో విజయం పట్ల తెలుగుదేశం కార్యకర్తల్లో విశ్వాసాలు శూన్యం! వారిలో ఏదోలా భరోసా నింపడానికి చంద్రబాబు నాయుడు రకరకాల పాట్లు పడుతూ ఉన్నారు. పచ్చమీడియా ఈ మేరకు విన్యాసాలు చేయడానికి రకరకాలుగా ప్రయాసలు పడుతూ ఉంది. అయినప్పటికీ.. అధికారం దక్కుతుందనే ఆశావహ పరిస్థితులు ఇప్పటి వరకూ తెలుగుదేశం వర్గాల్లో ఏర్పడటం లేదు. ఇదే ఇప్పుడు పచ్చబ్యాచ్ ఫ్రస్ట్రేషన్ కు ప్రధాన కారణం!
చంద్రబాబు సొంత పుత్రుడు లోకేష్ ను నడిపిస్తున్నా, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ను వెనకుండి నడిపిస్తున్నా... అధికారం ఇంకా అందుతుందనే దాఖలాలు లేవు! మరి ఈ దశలో ఫ్రస్ట్రేషన్ పతాక స్థాయికి చేరక ఏమవుతుంది!
మరి ఈ పరిస్థితుల్లోనే ఏదేదో రాస్తున్నట్టున్నారు. ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతుంటే, పచ్చమీడియా ఏదేదో రాస్తోంది! పవన్ కల్యాణ్ ను కొనడానికి కేసీఆర్ వెయ్యి కోట్లను సిద్ధం చేశారని ఏబీఎన్ ఆర్కే సెలవివ్వడం, ఎప్పుడో పట్టాభి పాత ఫొటోలు చూపి పోలీసులను ఆయనను కుళ్లబొడిచారని ఈనాడు సెల్ఫ్ గోల్ చేసుకోవడం ఈ ఫ్రస్ట్రేషన్ కు సంకేతాలే!
ఈ మధ్యనే ఈనాడు పత్రిక ఒక వ్యవహారంలో కోర్టుకు ఎక్కి కూడా నవ్వులపాలయ్యింది. ఏపీలో సచివాలయాలకు పేపర్ అలవెన్స్ ఇచ్చిన వ్యవహారంపై కోర్టుకు ఎక్కి ఈనాడు నవ్వులపాలయ్యింది. వలంటీర్లు ఆ అలవెన్స్ తో సాక్షి పేపర్ నే కొంటారంటూ ఈ జీవోను రద్దు చేయాలంటూ కోర్టుకు వెళ్లి ఈనాడు ఎదురుదెబ్బ తింది! బహుశా అలాంటి జీవోపై కోర్టుకు వెళ్లడం అంటే.. అంతకు మించిన ఫ్రస్ట్రేషన్ ఉండదు! ఊహాజనిత ఆరోపణతో కోర్టుకు వెళ్లి , కోర్టు వారి సమయాన్ని వృథా చేసినందుకు ఈనాడుపై ఫైన్ పడాల్సింది! ఆ లెవల్లో ఉంది ఆ ఫిర్యాదు!
ఇక పట్టాబిని కొట్టేశారంటూ, పట్టాబినీ కొట్టేశారంటూ.. ఈనాడు వాపోయిన తీరు ఆ పత్రిక పరువును బజారున పడేసింది! వివరణ ఇచ్చుకోవచ్చు, మరేమైనా చేయొచ్చు. ఈ వ్యవహారంలో ఈనాడుపై ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా విరుచుకుపడాల్సిన అవసరం లేకుండా పోతున్నట్టుగా ఉంది. తన స్వరూపాన్ని ఈనాడే పూర్తి గా విప్పి చూపించినట్టుగా అయ్యింది. ఈ వ్యవహారంపై సవరణలు ఇస్తే ఇవ్వొచ్చుగాక! తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఈనాడు పడుతున్న తాపత్రయం ఏమిటో ప్రజలకు మరోసారి అర్థం అయ్యింది. ఇదేమీ ఇప్పటి వరకూ అర్థం కాని వ్యవహారం కాదు. అయితే ప్రహసనం పాలవ్వడానికి ఈనాడే స్వయంగా అవకాశం ఇచ్చింది.
ఇక పవన్ కల్యాణ్ కూడా ఎక్కడైనా తమ చేజారుతాడేమో అనే ఆందోళన కూడా పచ్చవర్గాలకు ఉండనే ఉన్నట్టుంది. అందుకే రేపు పవన్ చేజారినా అతడు వెయ్యి కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాడంటూ ప్రచారానికి ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం అయినట్టుంది!
-హిమ
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు