విశాఖ పారిశ్రామిక సమ్మిట్ రాష్ట్ర రాజకీయాలపై కాస్త గట్టి ప్రభావమే చూపించినట్లు కనిపిస్తోంది. సిఎమ్ జగన్ ఎత్తుగడ కావచ్చు, లేదా అభివృద్ది మీద సీరియస్ గా దృష్టి పెట్టి వుండొచ్చు. మొత్తానికి అది సక్సెస్ అయింది. మామూలుగా కాదు. ఇంకా ఎక్కువగా.
దీనికి ఒకటే సాక్ష్యం. ప్రతిపక్షాలు అన్నీ సమ్మిట్ ముగిసిన రెండో రోజు నుంచే దాని మీద వ్యతిరేకంగా గళమెత్తడం. ఇలా ఎత్తిన గొంతులు ఏవైనా వాటికి కావాల్సిన మాటా మంతీ ముడి సరుకు మాత్రం తెలుగుదేశం మీడియా విభాగం నుంచే వస్తాయన్నది బహిరంగ రహస్యం.
అందరికన్నా ముందుగా జనసేన ఓ ప్రకటనతో స్టార్ట్ చేసింది. ఆ తరువాత తెలుగుదేశం అను’కుల’ సామాజిక మీడియా అదే రాగం అందుకుంది. వీలయినన్ని స్టోరీలు వండి వార్చడం ప్రారంభించారు. ఆ తరువాత లోకేష్ గళం విప్పారు. ఆపై తోకపార్టీగా మిగిలిన వామపక్షం లేచింది. ఇక మిగిలింది తెలుగుదేశంలో తెరవెనుక బంధాలున్న భాజపా నేతలు కొందరు. వారు కూడా మొదలుపెట్టారు.
ఇదంతా దేని కోసం? విశాఖ సమ్మిట్ విజయం వైకాపా కు మిగలకుండా చేయడానికి తప్ప మరి దేనికి? నిజంగా విశాఖ సమ్మిట్ వల్ల వైకాపాకు ప్రయోజనం వుండదు, లేదు అనుకుంటే ప్రతి ప్రక్షాలు అన్నీ ఇంతలా గొంతు చించుకోవు.
ఇన్నాళ్లూ అభివృద్ది లేదు…లేదు..పైసల పంపిణీ తప్ప అని గొంతెత్తాయి. ఇప్పుడు అలా చేసినదంతా ఎక్కడికి పోతుందో అని భయపడుతున్నాయి. అందుకే ఇంత యాగీ చేస్తున్నాయి.
ఇప్పుడు జగన్ అండ్ కో చేయాల్సింది ఒక్కటే ఎన్నికలు వచ్చే లోపు ఇప్పుడు కుదిరిన ఒప్పందాల్లో సగానికి సగమైనా మెటీరియలైజ్ చేయించాల్సిందే. ఇక అప్పుడు మరి నోరు ఎత్తడానికి వుండదు. ఎత్తినా ఎక్కడ పరిశ్రమలు వచ్చి, ఎక్కడ ప్రజలకు లబ్ది చేకూరుతుందో, అక్కడ ఆ గొంతులను ఎవ్వరూ లెక్క చేయరు. అలా కాకపోతే మాత్రం ఏడాది తరువాత వైకాపాను మామూలుగా ఉతకరు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు