యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్ పంట పండింది. లోకేశ్ రాజకీయ పంటను పండించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు దక్కుతుంది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో నేతన్న నేస్తం నిధుల జమ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ తనదైన స్టైల్లో ప్రతిపక్షాల నేతలు, ఎల్లో మీడియాపై విరుచుకుపడ్డారు. ఇంత వరకూ ఎప్పుడూ లోకేశ్ గురించి ప్రత్యక్షంగా, పరోక్షంగా సీఎం జగన్ విమర్శించలేదు.
తాజాగా లోకేశ్, ఆయనకు పిల్లనిచ్చిన మేనమామ నందమూరి బాలకృష్ణపై సెటైర్స్ విసిరారు. మరీ ముఖ్యంగా లోకేశ్ను సీఎం గుర్తించడం ఆసక్తికర పరిణామం. పాదయాత్రలో నిత్యం వైఎస్ జగన్పై లోకేశ్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయినా లోకేశ్ గురించి జగన్ పట్టించుకోవడం లేదు. అలాంటిది ఇవాళ వెంకటగిరి సభలో లోకేశ్ను పోకిరీగా చిత్రీకరించడం గమనార్హం.
యూట్యూబ్లో చూస్తే పట్టపగలే మందు తాగుతూ పది మంది అమ్మాయిలతో డ్యాన్స్లు చేస్తూ, స్విమ్మింగ్ పూల్లో అమ్మాయిలతో కనిపిస్తాడని లోకేశ్ వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించారు. ఇంత కాలానికి లోకేశ్ను ఒక రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తించారనేందుకు ఆయనపై ఘాటు విమర్శలే నిదర్శనం. బహుశా ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేశ్పై విమర్శలు చేయడం ద్వారా తానే నాయకుడిగా చేసినట్టు అవుతుందని జగన్ భావించినట్టున్నారు. అందుకే ఆయనపై ఎప్పుడూ ఒక్క విమర్శ కూడా చేయలేదు.
పవన్కల్యాణ్ విషయంలో కూడా జగన్ ఏనాడూ పేరెత్తి ప్రస్తావించలేదు. ముద్దుగా చంద్రబాబు దత్త పుత్రుడని జగన్ పిలుస్తుంటారు. అలాగే నిత్య పెళ్లి కొడుకని, ప్యాకేజీ స్టార్ అని దెప్పి పొడుస్తుంటారు. చంద్రబాబు దత్త పుత్రుడితో పాటు ఆయన కన్న కొడుకును కూడా ఎట్టకేలకు జగన్ రాజకీయ నాయకుడిగా గుర్తించడం యువ నాయకుడి అభిమానులకి సంతోషం కలిగిస్తుందని చెప్పొచ్చు.