తనకు ప్రాణహాని వుందని జనసేనాని పవన్కల్యాణ్ కామెంట్స్ ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. గత ఏడాది కూడా పవన్ ఇలాంటి ఆరోపణలే చేశారు. తనను హత్య చేసేందుకు భారీ మొత్తంలో సుపారీ ఇచ్చినట్టు తనకు తెలిసిందని గతంలో చేసిన ఆరోపణలనే మరోసారి ఆయన పునరావృతం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. పవన్ కామెంట్స్పై వైసీపీ తీవ్రస్థాయిలో ఎదురు దాడికి దిగింది.
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ పవన్కు ప్రాణహాని అంటే, అది చంద్రబాబు దగ్గరి నుంచే అని సంచలన కామెంట్స్ చేశారు. కాపు సామాజిక వర్గాన్ని కించపరిచేలా పవన్ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. గుంటనక్క లాంటి చంద్రబాబుతో జత కట్టడం వల్లే పవన్ను కూడా ప్రజలు ఓడించారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కష్టాన్ని చూసి మెచ్చుకుని జనం పట్టం కట్టారని ఆయన చెప్పుకొచ్చారు.
అవగాహన రాహిత్యంతో పవన్ మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం అన్నారు. అవాకులు చెవాకులు పేలుతున్న పవన్ను మానసిక వైద్యుల వద్ద చూపించాలనే డిమాండ్లు ప్రజల నుంచి వస్తున్నాయన్నారు. కాపుల ఓట్ల కోసం పవన్ను చంద్రబాబు వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.
పవన్ వెంట కాపులు వెళ్లరని ఆయన స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పే దమ్ము పవన్కు ఉందా? అని కొట్టు సత్యనారాయణ ప్రశ్నించడం గమనార్హం. చంద్రబాబును ఓడించేందుకు ప్రజలు మరోసారి సిద్ధంగా ఉన్నారన్నారు. జోకర్ లాంటి బాబు, లోఫర్ లాంటి లోకేశ్ మాటలు నమ్మవద్దని పవన్కు ఆయన హితవు చెప్పారు. పవన్కల్యాణ్ ప్రాణాల చుట్టూ తాజా రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. పవన్ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే, ఆయనకు కౌంటర్లు ఇవ్వాల్సిన పరిస్థితులు తలెత్తాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.