వైసీపీలోకి జనసేన కీలక నాయకుడు పసుపులేటి సురేష్ రాయల్ వెళ్లనున్నారు. తిరుపతి జనసేనలో ప్రజాదరణ ఉన్న నాయకుడిగా సురేష్ గుర్తింపు పొందారు. రాజకీయాలతో సంబంధం లేకుండా చాలా ఏళ్లుగా మెగా కుటుంబంతో సురేష్ రాయల్కు సన్నిహిత సంబంధాలున్నాయి. పవన్కల్యాణ్తో నేరుగా మాట్లాడగలిగే తిరుపతి జనసేన నాయకుల్లో సురేష్ ప్రముఖుడు.
రాజకీయంగా పవన్కల్యాణ్ పంథా నచ్చకే అతను వైసీపీలో చేరనున్నారని సమాచారం. ఇవాళ సాయంత్రం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. తిరుపతి జనసేనలో మీడియా అటెన్షన్ కోసం పని చేసే వాళ్లే ఎక్కువ. పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్, రాజారెడ్డి ఇలాంటి కొన్ని పేర్లు మీడియాలో కనిపిస్తూ వుంటాయి. వీరికి మీడియాతో తప్ప ప్రజలతో ఏ మాత్రం సంబంధం లేదని తిరుపతిలో టాక్.
ప్రత్యర్థులపై నోరు పారేసుకుంటూ జనసేన ముఖ్య నాయకుల దృష్టిలో పడాలనే యావ తప్ప, పార్టీని క్షేత్రస్థాయిలో బలపరచాలనే తపనే ఉండదు. కానీ సురేష్ రాయల్ మనస్తత్వం వీరికి విరుద్ధం. పార్టీ కోసం పని చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. తిరుపతిలో జనసేనకు అంతోఇంతో పరపతి వుందంటే సురేష్ రాయల్ ఘనతే అని చెప్పక తప్పదు. పార్టీ ప్లెక్సీలు కట్టాలన్నీ, సమావేశం నిర్వహించాలన్నా సురేష్ రాయల్ లేనిదే ఏదీ జరగదని తిరుపతి జనసేన కార్యకర్తలు చెబుతారు. వైసీపీలో సురేష్ రాయల్ చేరికతో జనసేనకు భారీ దెబ్బ అని చెప్పక తప్పదు.
ఒకవైపు పవన్కల్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వనని ప్రగల్భాలు పలుకుతుంటే, మరోవైపు దగ్గరున్న వాళ్లే దూరమవుతున్న పరిస్థితి. ఇదంతా ఎందుకు జరుగుతుందో పవన్ ఆత్మపరిశీలన చేసుకుని, తన పంథాను మార్చుకుంటే పార్టీ బతికి బట్ట కడుతుంది. లేదంటే జనం పాడె కడతారని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు