Advertisement

Advertisement


Home > Politics - Andhra

టిడిపికి ‘జాకీ’ లేస్తున్న కమ్యూనిస్టులు!

టిడిపికి ‘జాకీ’ లేస్తున్న కమ్యూనిస్టులు!

అదృష్టవశాత్తు ఏదైనా అవకాశం కలిసి వచ్చి 2024 ఎన్నికలలో తమకు ఒకటో అరో సీట్లు దక్కుతాయనే ఆశ కమ్యూనిస్టు పార్టీలను పురిగొల్పుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి అరా సీట్లు అయినా దక్కించుకుంటే ఒక జాతీయ స్థాయి రాజకీయ పార్టీగా తమ మనుగడను కొనసాగిస్తూ ఉండవచ్చునని ఆశ వారికి ఉండడం సహజం. అయితే అందుకు ఇంకో ప్రయత్నాలు చేయాలి గానీ.. వారి గురించి పట్టించుకోకుండా ఉన్న తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడితే వారికి ఏం ప్రయోజనం దక్కుతుందో అర్థం కావడం లేదు. పవన్ కల్యాణ్ ఊహించుకునే పొత్తుల కాంబినేషన్లు చెడిపోయి.. బిజెపి తెలుగుదేశాన్ని అతి భయంకరంగా తిడుతూ, నిందలు వేస్తూ ఎన్నికల సమరంలోకి దిగితే అలాంటి పరిస్థితిలో.. తమతో పొత్తు కుదురుతుందని కమ్యూనిస్టులు ఆశపడుతున్నారేమో తెలియడం లేదు. 

సొంతంగా పోటీచేసి సీట్లు దక్కించుకోగల స్థితి కమ్యూనిస్టులకు లేదు. అలాగని రాష్ట్రంలో ఏ పార్టీ కూడా వారితో పొత్తు పెట్టుకోడానికి సుముఖంగా లేదు. కొందరు వామపక్ష నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తో కొంత సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేశారు గానీ.. దానివల్ల ఇతర లాభాలు తప్ప రాజకీయ లబ్ధి లేదు. జగన్ ఎప్పటికీ ఒంటరిగా మాత్రమే పోటీచేసే ఉద్దేశంతో ఉంటాడని వారికి తెలుసు. 

ఇక చంద్రబాబు ఒక్కడే ఎవరో ఒకరి భుజం ఆసరాగా వాడుకోడానికి యత్నిస్తుంటాడు. ప్రస్తుతానికి పవన్ అందుకు రెడీగా ఉన్నాడు. బిజెపిని కూడా తీసుకురావాలని పవన్ ప్లాన్ కావొచ్చు. కానీ.. బిజెపి అందుకు ఒప్పుకునే అవకాశం తక్కువ. ఆ బంధం చెడిందంటే.. పవన్ మాత్రం.. చంద్రబాబు జట్టులో చేరతాడు. బిజెపి ఒంటరిగా అయినా బరిలోకి దిగుతుంది. అదే పరిస్థితి వస్తే.. చంద్రబాబును ఎన్నికల సమరంలో ఒక రేంజిలో ఆడుకుంటుంది గానీ.. ఉపేక్షించదు. అలాంటప్పుడు చంద్రబాబు తమను కూడా పొత్తుల జట్టులో కలుపుకుంటే.. కనీసం తమకు ఒకటో అరో శాతం ఓట్లుంటే వేయిస్తాం కదా అనేది వారి ఆలోచన. అలాగే ఆ మాత్రం సీట్లు దక్కించుకోవచ్చునని కోరిక. 

అలాంటి ఊహలతో ఇప్పటినుంచే తెలుగుదేశాన్ని కాకాపట్టే ప్రయత్నాల్లో ఉన్నారా అనే అనుమానం కలుగుతోంది. అనంతపురం జిల్లాలో జాకీ సంస్థ వెళ్లిపోయి మూడేళ్లవుతోంటే.. ఇప్పుడు వాళ్లు ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. తెలుగుదేశం స్థలమిచ్చిన తర్వాత ఏడాదిన్నర కాలంలో కనీసం ప్రహరీ కూడా కట్టని సంస్థ ఏ డ్రామాలు ఆడిందో అర్థం చేసుకోకుండా.. తెలుగుదేశానికి అనుకూలంగా జగన్ సర్కారుపై నిందలు వేస్తున్నారు. 

ఇదంతా తమకు ఎన్నికల్లో లాభిస్తుందని అనుకుంటున్నారేమో గానీ.. మోడీ అంటే ప్రస్తుతం వణుకుతున్న చంద్రబాబు.. వారితో పొత్తు కుదరకపోయినా సరే.. కమ్యూనిస్టులను మాత్రం తన జట్టులో కలుపుకోడు. అది మాత్రం పక్కా. ఆ సంగతి వారికి ఎప్పటికి తెలుస్తుందో ఏమో. జాకీ సంస్థ వెళ్లిపోవడాన్ని సాకుగా మార్చుకుని.. టీడీపీకి జాకీలు వేయడానికి కమ్యూనిస్టులు  కష్టపడుతున్నట్టుగా ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?