ఏపీ బీజేపీ నేతలకు ఓ ప్రత్యేకత వుంది. ప్రజాక్షేత్రంలో ఒక్క ఓటు కూడా లేని వాళ్లంతా జాతీయ నాయకులుగా కొలువుదీరారు. వీరికి రాజ్యసభ పదవులు కూడా కట్టబెట్టారు. లేదంటే పార్టీకి సంబంధించి జాతీయ పదవులు. ఇలాంటి వాళ్లంతా తోడై, ప్రత్యర్థి పార్టీల నాయకులను తలమాసినోళ్లని విమర్శిస్తుంటారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తాజా ట్వీట్పై సోషల్ మీడియాలో సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతుండడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. కేసీఆర్ జాతీయ పార్టీపై ఏపీ టీడీపీ-బీజేపీ ఉమ్మడి నాయకుడిగా పేరొందిన సత్యకుమార్ ట్విటర్ వేదికగా సీరియస్గా స్పందించారు. ఆ ట్వీట్ కథా కమామీషూ ఏంటో తెలుసుకుందాం.
‘ఏపీలో ఏ ఒక్క బీజేపీ కార్యకర్తనన్నా మీరు పెట్టబోతున్న బీఆర్ఎస్ (భారత బార్ & రెస్టారెంట్ సమితి) పార్టీలోకి లాక్కోగలిగితే ముక్కు నేలకు రాస్తా. మీరు పుట్టిన కాంగ్రెస్,పెరిగిన టీడీపీ, తోడు దొంగ వైసీపీతో ట్రై చేసుకోండి ఒకరో ఇద్దరో తలమాసినోళ్లు దొరక్కపోరు’ అంటూ కేసీఆర్కు ఆయన సవాల్ పలకడంతో పాటు హితవు చెప్పడం గమనార్హం.
వైసీపీ దగ్గరికి వచ్చే సరికి తోడు దొంగ అని కామెంట్ చేయడాన్ని గమనించొచ్చు. టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల్ని తమ పార్టీలో చేర్చుకుంటే మాత్రం సత్యకుమార్ దృష్టిలో పునీతులు. బీజేపీ నేతలంతా నీతిమంతులు, మిగిలిన పార్టీల్లో వుంటే మాత్రం తలమాసినోళ్లని ఆయన ట్వీట్ చెప్పకనే చెబుతోంది. బీజేపీలో తలమాసినోళ్ల ట్వీట్లని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు అంటున్నారు.
రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికలో అవాకులు చెవాకులు పేలి బీజేపీ పెద్దల చీవాట్లు తిన్నా సత్యకుమార్కు బుద్ధి రాలేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాజకీయంగా తలమాసినోడి అడ్రస్ ఏంటో చెబితే సంతోషిస్తామని వారు అంటున్నారు. కనీసం వార్డుకు కూడా గెలవలేని సత్యకుమార్... ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తన బతుకేంటో తెలుస్తుందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు