Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఇప్పటం గ్రామస్తులు జనసేనాని పరువు తీసినట్లేనా?

ఇప్పటం గ్రామస్తులు జనసేనాని పరువు తీసినట్లేనా?

ఏపీలోని మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామస్తులు జనసేనాని పవన్ కళ్యాణ్ పరువు తీశారా? తాజాగా ఉదయించిన ప్రశ్న ఇది. ఈ మధ్య కాలంలో ఇప్పటం గ్రామం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే కదా. పవన్ కళ్యాణ్ సభకు ఇప్పటం గ్రామస్తులు భూమి ఇచ్చారన్న కోపంతో జగన్ ప్రభుత్వం అక్కడి గ్రామస్తుల ఇళ్లను కూల్చివేసినట్లు పెద్ద దుమారం రేగింది. ఇది పెద్ద సంచలనం కలిగించింది కూడా. ప్రభుత్వం పై పవన్ నిప్పులు కురిపించాడు. జనసేన సభకు అక్కడి రైతులు పొలం ఇచ్చిన కారణంగానే ప్రభుత్వం కక్ష గట్టి కూల్చివేతలకు పాల్పడిందని జనసేన నేతలు ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కూల్చివేసిన తర్వాతి రోజే ఇప్పటం గ్రామంలో పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఇళ్ల కూల్చివేతతోనే ప్రభుత్వ పతనం ప్రారంభమైందంటూ నినదించారు.

తర్వాత యాభై మూడు కుటుంబాలకు.., కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. వచ్చే శనివారం ఆ డబ్బును పవన్ కల్యాణ్ పంపిణీ చేయబోతున్నారు. అయితే ఈ సమయంలోనే కీలక ఘటన జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ కు డ్యామేజీగా పరిణమించగా, ప్రభుత్వం ఏ తప్పు చేయలేదని బయటపడింది. ఇప్పటం గ్రామ రైతులకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. పధ్నాలుగు మంది రైతులకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున జరిమానా విధించింది. ఇళ్ల కూల్చివేత జరగుతున్నప్పుడు అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించిన ఇళ్ల యజమానులు.. తమకు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు కూల్చివేతలు ఆపాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే నోటీసులు ఇచ్చినట్లుగా ప్రభుత్వం ఆధారాలను హైకోర్టుకు సమర్పించింది.

ఈ అంశంపై హైకోర్టు న్యాయమూర్తి గతంలో విచారణ జరిపినప్పుడు రైతులను హైకోర్టుకు రావాలని ఆదేశించారు. ఈ రోజు (గురువారం) విచారణలో రైతులు..  ఇళ్ల కూల్చివేత విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై తమకు అవగాహన లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రైతుల వాదనను తిరస్కరించిన న్యాయమూర్తి కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ఒక్కొక్కరికి రూ. లక్ష జరిమానా విధిస్తూ నిర్ణయం ప్రకటించారు. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయించినందుకు ఈ జరిమానా విధిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. ఇళ్ల కూల్చివేత పైన దాఖలైన పిటీషన్ ను న్యాయస్థానం కొట్టి వేసింది. నవంబర్ నాలుగో తేదీన ఇప్పటం గ్రామంలో ప్రధాన రోడ్డును 120 అడుగులకు విస్తరిస్తున్నామని చెప్పి.. ఆ రోడ్డులో ఉన్న 53 ఇళ్లను కూల్చివేయడం ప్రారంభించారు. అంతకు ముందే వారికి రోడ్డు విస్తరణ నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ భూమినే ఆక్రమించుకుని ఉన్న ఇళ్లను తొలగించాలని లేకపోతే కూల్చివేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. 

వాటిపై ముందుగానే న్యాయపోరాటం చేయలేదు ఇళ్ల యజమానులు. నవంబర్ నాలుగో తేదీన ఉదయమే కూల్చివేతలు ప్రారంభించిన తర్వాత వారిలో కొంత మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌లో తమకు ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు. దీంతో అప్పటికప్పుడు హైకోర్టు కూల్చివేతలపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణలో వారు హైకోర్టుకు తప్పడు సమాచారం ఇచ్చారని వెల్లడయింది. ఇప్పటం కూల్చివేతల అంశం రాజకీయంగానూ కలకలం రేపింది. ప్రభుత్వం మాత్రం ఇళ్ల కూల్చివేతలో ఎలాంటి కక్ష సాధింపు లేదని చెబుతోంది. మార్చిలోనే రోడ్డును ఆక్రమించుకున్న వారికి నోటీసులు ఇచ్చామని ప్రకటించింది.

గ్రామ అవసరాల కోసమే రోడ్డును విస్తరిస్తున్నామని.. ప్రభుత్వం ఎవరి ఇళ్లనూ కూల్చలేదని స్పష్టం చేసింది. కేవలం ప్రహారి గోడలను మాత్రమే కూల్చామని తెలిపింది. అదే సమయంలో ఈ అంశంపై రాజకీయంగా దుమారం రేగింది. ఈ నెల 27న మరోసారి పవన్ కళ్యాణ్ ఇప్పటం లో పర్యటించి వారికి ఆర్దిక సాయం అందించే విధంగా కార్యక్రమం ఖరారైంది. ఇదే సమయంలో హైకోర్టు ఈ కేసు విచారణకు రావటం.. పిటీషనర్లపై హైకోర్టు సీరియస్ అవ్వటంతో ..ఇప్పుడు పవన్ పర్యటన కొనసాగుతుందా.. లేక పార్టీ నేతల ద్వారా వారికి ఆర్దిక సాయం అందిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?