Advertisement

Advertisement


Home > Politics - Andhra

బాబుకి సానుభూతి పెంచుతున్న జ‌గ‌న్‌!

బాబుకి సానుభూతి పెంచుతున్న జ‌గ‌న్‌!

చంద్ర‌బాబు గ్రాఫ్ పెరిగింది, జ‌గ‌న్‌కి త‌గ్గింద‌ని ఈనాడు, జ్యోతి రాసేస్తూ వుంటాయి. ఇది నిజం కూడా. ప్ర‌శాంత్ కిషోర్ ఏం విశ్లేషిస్తారో తెలియ‌దు కానీ, టీ అంగ‌ట్లో ఉచితంగా పేప‌ర్ చ‌దివే ఏ సామాన్యున్ని అడిగినా ఈ విష‌యం చెబుతారు. ముఖ్యంగా మౌలిక వ‌స‌తులు (రోడ్లు) ప‌ట్టించుకోక‌పోవ‌డం జ‌నం కోపానికి కార‌ణం.

దీనికి తోడు యాప్‌ల గోల‌. ఆస్ప‌త్రుల్లో డాక్ట‌ర్ల‌కి యాప్ పెడితే ఏం ప్ర‌యోజ‌నం?  ఉండాల్సింది మందులు క‌దా! చెత్త క‌రెక్ట్‌గా తీసుకెళుతున్నారా?  లేదా? అని యాప్‌. ఆ ఏరియా వార్డు మెంబ‌ర్లు, కౌన్సిల‌ర్లు ఎందుకున్నారు? త‌మ వీధి శుభ్రంగా ఉందో లేదో తెలియ‌నంత బిజీనా?  దీనికి తోడు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల రుబాబు. అన్న క్యాంటీన్ల వ‌ల్ల తెలుగుదేశానికి వ‌చ్చే  మైలేజీ కంటే , కూల్చివేత‌ల‌తో వైసీపీకి వ‌చ్చే డ్యామేజీ ఎక్కువ‌. క్యాంటీన్ల ర‌ద్దే ఒక చారిత్రిక త‌ప్పిదం.

చ‌రిత్ర‌ని చూసి ఎవ‌రూ నేర్చుకోరు. చిత్తుగా ఓడిపోయిన ఇందిరాగాంధీని షా క‌మిష‌న్ పేరుతో వేధించ‌డం వ‌ల్లే 1980లో మ‌ళ్లీ ఆమె అధికారంలోకి వ‌చ్చింది. వేధింపుల‌కి గురైతే జ‌నానికి సానుభూతి పెరుగుతుంది. గ‌తంలో జ‌గ‌న్‌కి జ‌రిగింది. ఇపుడు చంద్ర‌బాబుకి జ‌గ‌న్ ద‌గ్గ‌రుండి సానుభూతి పెంచుతున్నాడు.

ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తుల్లో బాబుని వ‌దిలేసి వుంటే ప్ర‌తిదీ రాజ‌కీయం చేస్తున్నాడ‌నే చెడ్డ పేరుతో త‌న‌ని తాను ఫినీష్ చేసుకునేవాడు. చ‌చ్చిపోయిన టీడీపీకి ద‌గ్గ‌రుండి ఆక్సిజ‌న్ అందించి వైసీపీ బ‌తికించి త‌న‌మీద యుద్ధానికి త‌యారు చేస్తూ వుంది.

జ‌గ‌న్‌పైన ఈ సారి గెలిచేస్తామ‌ని తెలుగుదేశం అప్పుడే గాలి మేడ‌లు క‌ట్టేస్తూ వుంది. ప్ర‌క్షాళ‌న అంటూ పార్టీ మీటింగ్‌లు పెడుతున్నాడు బాబు. ఈ మ‌ధ్య అనంత‌పురం టీడీపీ మీటింగ్ జ‌రిగింది. ప్ర‌భాక‌ర్ చౌద‌రి, కేశ‌వ్‌, హ‌నుమంత‌రాయ చౌద‌రి, ప‌రిటాల శ్రీ‌రామ్‌, పార్థ‌సార‌థి, కాల్వ శ్రీ‌నివాసులు, కందికుంట ప్ర‌సాద్‌, ర‌ఘునాథ‌రెడ్డి వీళ్లే క‌దా నాయ‌కులు. వీళ్లంద‌రి పాల‌న గ‌తంలో జ‌నం చూశారు క‌దా! వీళ్ల నుంచి ఏం ఆశిస్తారు? అన్నీ అవే పాత ముఖాలు, పార్టీ నుంచి ల‌బ్ధి పొంది పైకి ఎదిగిన వాళ్లు. వీళ్ల‌తో ఎన్నిక‌ల‌కు వెళుతున్నాడు. ఏం అభివృద్ధిని ఆశించి, ఏం కొత్త‌ద‌నాన్ని ఆశించి వీళ్ల‌కి జ‌నం ఓట్లు వేయాలి?  న‌న్ను చూసి ఓట్లు వేయండ‌ని బాబు అనొచ్చు. నిన్ను చూసి గ‌తంలో ఓట్లు వేస్తే ఏం జ‌రిగింది? అమ‌రావ‌తి పేరుతో ఐదేళ్లు వృథా చేశావు.

జ‌గ‌న్‌పైన వ్య‌తిరేక‌త వున్నా, ఏదో బ‌ట‌న్ నొక్కి డ‌బ్బులేస్తున్నాడు. అప్పోస‌ప్పో చేస్తున్నాడు (అవ‌న్నీ మ‌ళ్లీ మ‌న‌మే తీర్చాలి. జ‌గ‌న్ తీర్చ‌డు). చంద్ర‌బాబును గెలిపిస్తే ఆయ‌న బ‌ట‌న్ నొక్కుతాడు. కానీ డ‌బ్బులు తెలుగుదేశం నాయ‌కుల జేబుల్లోకి వెళ్తాయి. చంద్ర‌బాబును గెలిపించ‌డం జ్యోతి, ఈనాడుకి చారిత్రిక అవ‌స‌రం కావ‌చ్చు. కానీ జ‌నానికి ఏం అవ‌స‌రం?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?