Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఇదేం ఖ‌ర్మ‌రా బాబూ...జ‌గ‌న్ ర్యాగింగ్‌!

ఇదేం ఖ‌ర్మ‌రా బాబూ...జ‌గ‌న్ ర్యాగింగ్‌!

చంద్ర‌బాబు, ఆయ‌న ద‌త్త పుత్రుడు అంటూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ విరుచుకుప‌డ్డారు. వాళ్లిద్ద‌రిని ఓ ఆట ఆడుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో  వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న‌తో జ‌గ‌న్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై ఆయ‌న త‌న‌దైన స్టైల్‌లో కౌంట‌ర్ ఇచ్చారు. డిసెంబ‌ర్ ఒక‌టిన త‌న ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకంగా టీడీపీ ప్రారంభించాల‌ని నిర్ణ‌యించిన ఇదేం ఖ‌ర్మ‌, అలాగే ఇటీవ‌ల త‌న‌కిదే లాస్ట్ చాన్స్ అని చంద్ర‌బాబు కామెంట్‌పై జ‌గ‌న్ వెట‌కారం చేశారు.  

టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా మార్చేశారన్నారు. ద‌త్త పుత్రుడి పార్టీని రౌడీసేన‌గా మార్చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. గ‌తంలో వీళ్లిద్ద‌రూ చేసిన పాల‌న‌ను చూసి జ‌నం ఇదేం ఖ‌ర్మ‌రా బాబు అనుకుని, ద‌త్త పుత్రుడిని, సొంత పుత్రుడిని అన్ని చోట్ల ఓడించి బైబై చెప్పార‌ని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇంటింటికి మ‌నం చేసిన అభివృద్ధిని చూసి, ప్ర‌తి ఎన్నిక‌లోనూ అశీర్వ‌దించి తీర్పు చెప్పార‌న్నారు. చివ‌రికి కుప్పంలో కూడా అదే తీర్పు ఇచ్చార‌ని ఆనందంతో చెప్పారు.

మున్సిపల్‌, జెడ్పీ, ప‌రిష‌త్‌, స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో టీడీపీని చిత్తుగా ఓడించార‌న్నారు. మ‌రోసారి రాష్ట్ర వ్యాప్తంగా బైబై బాబు అని చెప్పార‌ని జ‌గ‌న్ చేతులు వూపుతూ అభిన‌యించారు. అందుకే చంద్ర‌బాబు... ఇదేం ఖ‌ర్మ‌రా బాబు అని త‌న త‌ల ప‌ట్టుకుని కూచుంటే, పుత్రుడు, ద‌త్త‌పుత్రుడు కూడా బాబుతో ఇదేం ఖ‌ర్మ‌రా అని అంటున్నార‌ని వెట‌క‌రించారు.

ఎన్టీఆర్ త‌న ఇంట్లో, పార్టీలో, కేబినెట్‌లో చంద్ర‌బాబుకు స్థానం ఇచ్చినందుకు... ఇదేం ఖ‌ర్మ‌రా బాబు అనుకుని వుంటార‌ని దెప్పి పొడిచారు. చంద్ర‌బాబు లాంటి నాయ‌కులు రాజ‌కీయాల్లో ఉన్నందుకు రాష్ట్ర ప్ర‌జ‌లు ఇదేం ఖ‌ర్మ‌రా బాబు అని అనుకుంటున్నార‌ని అవహేళ‌న చేశారు. ఇటీవ‌ల కాలంలో త‌న పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకురాక‌పోతే... ఇవే చివ‌రి ఎన్నిక‌లు అవుతాయ‌ని చంద్ర‌బాబు బెదిరిస్తున్నార‌ని జ‌గ‌న్ అన్నారు.

చివ‌రికి కుప్పంలో కూడా తాను గెల‌వ‌లేన‌నే నిరాశ‌, నిస్పృహ చంద్ర‌బాబు ప్ర‌తి మాట‌లోనూ క‌నిపిస్తున్నాయ‌ని జ‌గ‌న్ చెప్పారు. అంతేకాదు, ఆయ‌న చేసే ప్ర‌తి ప‌నిలోనూ నిరాశ‌, నిస్పృహ క‌నిపిస్తున్నాయ‌న్నారు. చంద్ర‌బాబు మాటలు వింటుంటే...కొంద‌రు గుర్తొస్తున్నార‌న్నారు. సెల్ ట‌వ‌ర్‌పైనుంచి దూకేస్తామ‌ని, రైలు కింద త‌ల‌కాయ పెట్టేస్తామంటారు, పురుగుల మందు తాగేస్తామంటారని, ఈ ర‌కంగా అధికార భ‌గ్న ప్రేమికుడైన చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను బెదిరిస్తున్నార‌ని ఓ రేంజ్‌లో ర్యాగింగ్ చేశారు.

ఎలాంటి మంచిప‌నులు చేయ‌ని త‌మ‌కు ఎందుకు ఓటు వేస్తార‌ని గానీ, ఎందుకో వేయాలో చంద్ర‌బాబు, ఆయ‌న ద‌త్త పుత్రుడు చెప్ప‌ర‌న్నారు. ఎందుకంటే చెప్పేదానికి ఏమీ లేదు కాబ‌ట్టి అని జ‌గ‌న్ అన్నారు. ఇలాంటి వాళ్ల‌కు ప్ర‌జ‌ల గుండెల్లో చోటు వుండ‌ద‌న్నారు. కానీ ఎల్లో మీడియాలో స్థానం వుంటుంద‌ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. ఇలాంటి వాళ్లంద‌ర్నీ చూసిన‌ప్పుడు... ఇదేం ఖ‌ర్మ‌రా బాబు రాష్ట్ర రాజ‌కీయాలు ఇలా వున్నాయ‌ని అనిపిస్తుంద‌న్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?