రాజధాని అమరావతికి శత్రువు ఎవరు? ....ఇప్పుడీ ప్రశ్నపై రాజధాని ప్రాంత గ్రామాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. కంచే చేను మేసిన చందంగా... అమరావతి రాజధాని పరిరక్షణ తయారైంది. అమరావతి ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని కోట్లాది రూపాయల సంపదన కొందరు అగ్రవర్ణ నేతలు కూడగొట్టుకున్నారనేది ప్రధాన ఆరోపణ. కేవలం ఆరోపణే కాదు... నిజమని నమ్మేవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు.
అయితే ఇంత వరకూ ఆ విషయమై బహిరంగంగా ఎవరూ విమర్శలు చేయలేదు. కానీ అనధికారికంగా ఎవరినీ కదిలించినా అమరావతి ఉద్యమ నాయకులు శివారెడ్డి, తిరుపతిరావు, డాక్టర్ శైలజ తదితరులపై ఉద్యమ కార్యకర్తలు తీవ్ర అవినీతి ఆరోపణలు చేయడాన్ని కాదనగలరా?
ఇప్పటికే రాజధాని అంశాన్ని టీడీపీ, ఎల్లో మీడియా పూర్తిగా పక్కన పడేశాయి. తాజాగా అమరావతి పరిరక్షణ పేరుతో సంఘాలు పెట్టుకున్న నాయకులు కూడా... దీనికి ఎలా ముగింపు పలకాలో అర్థం కాక తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా అమరావతి పాదయాత్రను ఏం చేయాలనేది వారికి సమాధానం దొరకని భేతాళ ప్రశ్నగా మిగిలింది.
ఈ నేపథ్యంలో అమరావతి ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకంటూ కొత్త నాటకానికి తెరదీశారు. డిసెంబర్ 17,18 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు తుళ్లూరులో అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధుల సంయుక్త సమావేశం నిర్వహించారు.
అమరావతి పరిరక్షణ సమితి నాయకులు శివారెడ్డి, తిరుపతిరావు మాట్లాడుతూ పోలీసుల ఆంక్షల వల్ల పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చినట్టు పేర్కొన్నారు. అంతే తప్ప, పాదయాత్రను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అమరావతి ఉద్యమాన్ని మధ్యలో వదిలి పెట్టారనే ఆవేదన కొంత మందిలో లేకపోలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు వాడుకున్నాయనే ఆవేదన రాజధాని ప్రాంత మహిళలు, రైతుల్లో ఉంది. ఇంత కాలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను శత్రువుగా చూశామని, కానీ నిజమైన ద్రోహి ఎవరో ఇప్పుడిప్పుడే తమకు అర్థమవుతోందని రాజధానికి భూములిచ్చిన మహిళలు, రైతులు చెబుతుండడం విశేషం.
పాదయాత్రకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా... ఇంకా జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలయాపన చేయడం దేనికనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. దీనికి మాత్రం అమరావతి ఉద్యమ నాయకులు సమాధానం చెప్పకుండా ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారనే నిలదీతలు ఎదురవుతున్నాయి. ఇంత కాలం ఉద్యమం పేరుతో వసూలు చేసిన వందల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు