టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు వైసీపీ నుంచి డిమాండ్ వస్తోంది. నియోజకవర్గంలో ఎంత ఎక్కువగా పాదయాత్ర జరిగితే, తమకు అంత మంచి జరుగుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని లోకేశ్ మరోసారి తెలిపారు.
తన నియోజకవర్గం మంగళగిరి పరిధిలోని నూతక్కిలో శుక్రవారం లోకేశ్ నేతృత్వంలో బాదుడేబాదుడు కార్యక్రమం జరిగింది. తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర చేపట్టనున్నట్టు లోకేశ్ వెల్లడించారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నట్టు లోకేశ్ తెలిపారు. ప్రతి నియోజక వర్గంలో నాలుగు రోజుల పాదయాత్ర చేస్తానన్నారు.
తనను ఓడించేందుకు సీఎం జగన్ అన్ని రకాల ఆయుధాలు వాడుతారన్నారు. పాదయాత్ర పూర్తి చేసుకుని వచ్చే వరకూ నియోజకవర్గాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని లోకేశ్ ప్రజానీకాన్ని కోరారు.
ఆల్రెడీ లోకేశ్ను మంగళగిరిలో జగన్ ఓడించారు. మరోసారి ఓడించేందుకు సీఎం జగన్ అన్ని రకాల ఆయుధాలు వాడుతారని లోకేశ్ చెప్పడం గమనార్హం. తన నియోజకవర్గాన్ని కాపాడుకోవాలని టీడీపీ శ్రేణులకి అప్పగించి వెళుతున్న లోకేశ్... ఇక మిగిలిన నియోజకవర్గాల్లో ఎంత మాత్రం ప్రభావం చూపుతారో అర్థం చేసుకోవచ్చు. లోకేశ్పై ఇప్పటికే ఒక ముద్ర వుంది. లోకేశ్ బాగా నెగెటివిటీని మూటకట్టుకున్నారు.
లోకేశ్ను ప్రత్యర్థులు కమెడియన్గా చూస్తారు. అంతే తప్ప, అతన్ని ప్రత్యర్థిగా వైసీపీ ఏ మాత్రం పరిగణించదు. లోకేశ్ పాదయాత్ర చేపడుతుంటే టీడీపీలో టెన్షన్, వైసీపీలో ఖుషీ కనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గంలోనూ నాలుగు రోజులు పాదయాత్ర వుంటుందని లోకేశ్ చెప్పిన నేపథ్యంలో, తమ దగ్గర ఎంత ఎక్కువ వుంటే అంత మంచిదని వైసీపీ నేతలు కోరుకుంటున్నారు. దీన్ని బట్టి లోకేశ్ పాదయాత్రను వైసీపీ నేతలు ఎక్కువ కోరుకుంటున్నారనే చర్చ నడుస్తోంది.
అయితే లోకేశ్ తన నాయకత్వ సమర్థతను పాదయాత్ర ద్వారా నిరూపించుకుంటారని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈ దఫా తాను గెలవడంతో పాటు పార్టీని అధికారంలోకి తెస్తారనే ధీమాను లోకేశ్ అభిమానులు వ్యక్తపరుస్తున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు