పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఇచ్చిన షెడ్యూల్ను నిన్న హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి స్పందన ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్నికల షెడ్యూల్పై హైకోర్టు తీర్పును గౌరవిస్తామని ఆయన అన్నారు.
మరోవైపు ఈయనే చిత్రమైన వాదన చేస్తున్నారు. కోర్టుకు తప్పుడు సమాచారమిచ్చి ఎన్నికలను అడ్డుకున్నారని అచ్చెన్నాయుడు విమర్శిస్తుండడం గమనార్హం. ఈ కుట్రలో ఉద్యోగ సంఘాలనూ భాగస్వాములు చేశారని ఆయన ఆరోపించారు.
ప్రజల మద్దతుంటే ఎన్నికలంటే భయమెందుకు? అని అచ్చెన్న ప్రశ్నించడాన్ని చూసి ఎవరైనా నవ్వుకుంటే … తప్పు ఆయనది ఎంత మాత్రం కాదు. ఎన్నికలంటే భయంతో , అసలు తమ హయాంలో ఆ ఊసే ఎత్తకుండా, ఇప్పుడు శ్రీరంగ నీతులు చెప్పడం ఒక్క టీడీపీ నేతలకే చెల్లుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎస్ఈసీగా నిమ్మగడ్డ ఉండగా ఎన్నికలు జరిగితే తమ అరాచకాలు సాగవన్న భయంతోనే అడ్డుకున్నారని ఆయన విమర్శిం చడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందనే సామెతను గుర్తు తెస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తమ హయాంలో 2018లో జరగాల్సిన ఎన్నికలను, ప్రజావ్యతిరేకతకు భయపడి వాయిదా వేసుకుంటూ వచ్చిన విషయం ఎవరికీ తెలియదని అచ్చెన్నాయుడు భ్రమల్లో ఉన్నట్టున్నారు. స్థానిక సంస్థల పదవీ కాలం గడువు ముగియగానే తమ హయాంలో ఎన్నికలు జరిపి ఉంటే … అసలు ఈ రోజు ఇలాంటి దుస్థితి వచ్చి ఉండేదే కాదనే వాస్తవాన్ని అచ్చెన్నాయుడు గ్రహించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అచ్చెన్నాయుడి స్పందన చూస్తుంటే లోకేశ్ను మించిపోయేలా ఉన్నాడనే భావన కలుగుతోంది. ఇదే కాదు, ఇటీవల అచ్చెన్నాయుడు చేస్తున్న ప్రకటనలు లోకేశ్ను మరిపించేలా, మురిపించేలా ఉన్నాయనే అభిప్రాయాలు ఆ పార్టీ శ్రేణుల నుంచే రావడం గమనార్హం.