దేశవ్యాప్తంగా బీజేపీకి ఏర్పడుతున్న సానుకూల వాతావరణం.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే దుబ్బాక బైపోల్ విజయం, గ్రేటర్ పై పట్టు.. వంటివాటితో సహజంగానే కాషాయదళంలో కాన్ఫిడెన్స్ పెరిగింది. అయితే ఏపీ విషయానికొచ్చే సరికి అది మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారడమే విచిత్రం, విపరీతం.
తిరుపతి లోక్ సభ స్థానానికి జరుగనున్న ఉపఎన్నికలో గెలుస్తాం.. అనడం వరకు పర్వాలేదు కానీ, ఏపీనే హస్తగతం చేసుకుంటామంటూ కోతలు కోయడం మాత్రం వారి అత్యుత్సాహానికి పరాకాష్ట.
ఏపీలో కాంగ్రెస్, టీడీపీ భూస్థాపితం అయ్యాయని, బీజేపీ-జనసేన కూటమి మాత్రమే వైసీపీకి ప్రత్యామ్నాయమని అంటున్నారు సోము వీర్రాజు. అంతవరకు బాగానే ఉన్నా.. మిగతా నేతల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి.
2019 ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్లు.. వచ్చే దఫా బీజేపీకి వస్తాయని ఘనంగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు కొంతమంది బీజేపీ నేతలు.
సింగిల్ సీటుకి ఠికానా లేని బీజేపీ వచ్చే ఎన్నికల్లో 151 సీట్లు సాధిస్తుందనడం ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతాననడం కంటే మరీ ఎక్కువ. తిరుపతి బై పోల్ తో తమ విజయ పరంపర మొదలవుతుందని బీజేపీ నేతలు చెప్పడం వారి అవివేకానికి నిదర్శనం.
దుబ్బాకలో గెలుపు ఇలా..
దుబ్బాకలో టీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్ బీజేపీకి పరోక్షంగా లాభాన్నిచ్చింది. సింపతీతో ఈజీగా గెలిచేస్తామన్న భావనలో.. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా కొన్నిచోట్ల పోలింగ్ ని సీరియస్ గా తీసుకోలేదు.
మరోవైపు బీజేపీ చేసిన భారీ ఖర్చు కూడా ఫలితాన్నిచ్చింది. కాంగ్రెస్ చేతగానితనం ప్రభుత్వ వ్యతిరేక ఓటుని బీజేపీ దరికే చేర్చింది. ఇలాంటి కారణాల వల్ల అక్కడ బీజేపీ విజయం సాకారమైంది.
గ్రేటర్ లో గెలుపు ఇలా..
ఇక గ్రేటర్ విషయానికొచ్చేసరికి దుబ్బాక వేవ్ అక్కడికి బాగా ట్రాన్స్ ఫర్ అయింది. పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా.. ప్రత్యక్షంగా హోం మంత్రి అమిత్ షా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు.. అందరూ గ్రేటర్ ని టార్గెట్ చేశారు.
అన్నిటికంటే ముఖ్యమైన విషయం.. అవినీతికి పాల్పడ్డారని తెలిసినా.. టీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థుల్ని మార్చకపోవడం. వరదల్లో నష్టపోయినవారు, వరద సాయం అందనివాళ్లు టీఆర్ఎస్ అంతు చూడాలనుకున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ చతికిలపడటంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం బీజేపీ దగ్గరకే చేరింది.
తిరుపతిలో పరిస్థితి ఏంటి..?
దుబ్బాక, జీహెచ్ఎంసీతో తిరుపతి ఉప ఎన్నికలను పోల్చగలమా..? కచ్చితంగా పోల్చి చూడలేం. సింపతీ ఓట్లను కూడా వైసీపీ వద్దనుకుందంటే.. అబివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వానికి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.
గత ఎన్నికల్లో నోటాతో కూడా పోటీ పడలేని బీజేపీ, జనసేన.. ఏడాదిన్నరలోనే విజయం సాధించేంతగా బలాన్ని పెంచుకున్నాయంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. పోనీ ప్రభుత్వంపై అంత వ్యతిరేకత పెరిగిందా అంటే అదీ లేదు.
సంక్షేమ కార్యక్రమాల అమలుతో రోజు రోజుకీ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది, మరోవైపు అధికారంలో ఉండగా టీడీపీ చేసిన తప్పులన్నీ ఇప్పుడు బైటపడుతున్నాయి. మహా అయితే.. తిరుపతిలో టీడీపీని వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకడం బీజేపీ-జనసేన వల్ల అవుతుందేమో కానీ.. ఎన్నికల్లో విజయం మాత్రం దాదాపు అసాధ్యం.
ఇకనైనా బీజేపీ నేతలు వాపు-బలుపు మధ్య తేడా తెలుసుకుంటే మంచిది. అక్కడ గెలిచాం కాబట్టి ఇక్కడ కూడా గెలిచేస్తామని.. తెలంగాణ వేవ్ ఇక్కడ కూడా వర్కవుట్ అవుతుందనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు.