టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్పై మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న ఒంగోలు నగరపాలక సంస్థలో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
దొంగచేతిలో రాష్ట్రాన్ని పెట్టేశామని, ఒక దోపిడీదారుడికి మన భవిష్యత్ను అప్పగించేశామని విమర్శలు గుప్పించారు. బాలినేనిని హవాలా మంత్రిగా లోకేశ్ వెటకరించారు. గడిచిన 21 నెలల్లో ఒక్క బోరు, ఒక్క రోడ్డైనా వేశారా? అని మంత్రిని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో లోకేశ్కు మంత్రి బాలినేని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విదేశాల్లో రాసలీలలు చేసే లోకేశ్కు తనను విమర్శించే హక్కు లేదని మంత్రి బాలినేని ధ్వజమెత్తారు. మద్రాస్లో దొరికిన డబ్బు విషయమై తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరానని గుర్తు చేశారు.
తనపై వచ్చిన ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేనిపక్షంలో లోకేశ్ తప్పుకోవాలని తాను నోటీస్ పంపానన్నారు. ఇంత వరకూ దానికి సమాధానం లేదన్నారు. అలాంటి వ్యక్తికి సిగ్గులేకుండా మళ్లీ ఒంగోలుకు వచ్చి ఎలా మాట్లాడుతారని ఆయన ప్రశ్నించారు.
''లోకేశ్ ఒక దరిద్రుడు.. చంద్రబాబు ఒక నీచుడు. చంద్రబాబు, లోకేశ్ ఇక్కడ దోచుకుని విదేశాల్లో దాచుకుంటున్నారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని లోకేశ్ నాపై మాట్లాడటం సిగ్గుచేటు. ప్రత్తిపాటితో కలిసి లోకేశ్ పేకాట క్లబ్ నడిపిన విషయం ప్రజలకు తెలుసు. నేను కులాలు చూడలేదు.. కమ్మవారికి కూడా కార్పొరేషన్లో టికెట్ ఇచ్చా. టీడీపీ వారు వ్యక్తిగత సమస్యలపై నా వద్దకు వస్తే పరిష్కరించా. ఒంగోలు అభివృద్ధిపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదు'' అని మంత్రి ఘాటుగా చెప్పారు.
తనకు సంస్కారం ఉంది కాబట్టి.. వ్యక్తిగత విమర్శలు చేయడం లేదన్నారు. కరోనా సమయంలో ఒంగోలులో రూ.కోటి సొంత డబ్బు ఖర్చు చేసినట్టు ఆయన తెలిపారు. కుప్పంలో చంద్రబాబుకు పట్టిన గతే.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రిపీట్ అవుతుందని ఆయన హెచ్చరించారు.